కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

“మొదటి పునరుత్థానము” ఇప్పుడు జరుగుతోంది!

“మొదటి పునరుత్థానము” ఇప్పుడు జరుగుతోంది!

“మొదటి పునరుత్థానము” ఇప్పుడు జరుగుతోంది!

“క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు.”​—⁠1 థెస్సలొనీకయులు 4:16.

“బ్రతికియుండువారు తాము చత్తురని ఎరుగుదురు.” ఆదాము పాపం చేసిన దగ్గరనుండి అలా జరుగుతూనే ఉంది. చరిత్రంతటిలో, పుట్టిన ప్రతీవ్యక్తికి తాను చనిపోతానని తెలుసు, అయితే చాలామంది ఇలా ఆలోచిస్తారు: ‘ఆ తర్వాత ఏమి జరుగుతుంది? చనిపోయినవారి స్థితి ఏమిటి?’ బైబిలు వాటికిలా జవాబిస్తోంది: “చచ్చినవారు ఏమియు ఎరుగరు.”—ప్రసంగి 9:⁠5.

2 అయితే చనిపోయినవారికి నిరీక్షణ ఏమైనావుందా? ఉంది. వాస్తవానికి, మానవాళిపట్ల దేవుని ఆది సంకల్పం నెరవేరాలంటే చనిపోయినవారికి తప్పకుండా ఒక నిరీక్షణ ఉండాలి. శతాబ్దాలుగా దేవుని యథార్థ సేవకులు, సాతానును నాశనంచేసి అతడు కలిగించిన నష్టాన్ని తొలగించే యెహోవా వాగ్దత్త సంతానంపై విశ్వాసముంచారు. (ఆదికాండము 3:15) వారిలో చాలామంది చనిపోయారు. ఆ వాగ్దానంతోపాటు యెహోవా చేసిన ఇతర వాగ్దానాల నెరవేర్పును వారు చూడాలంటే వారు మృతుల్లోనుండి లేపబడాలి. (హెబ్రీయులు 11:13) అది సాధ్యమౌతుందా? సాధ్యమౌతుంది. అపొస్తలుడైన పౌలు ఇలా చెప్పాడు: “నీతిమంతులకును అనీతిమంతులకును పునరుత్థానము కలుగబోవుచున్నది.” (అపొస్తలుల కార్యములు 24:14-15) పౌలు ఒకసారి, మూడవ అంతస్తు కిటికీలో నుండి క్రిందపడి “చనిపోయిన” ఐతుకు అనే యౌవనుణ్ణి పునరుత్థానం చేశాడు. బైబిల్లో వ్రాయబడిన తొమ్మిది పునరుత్థానాల్లో ఇది చివరిది.​—⁠అపొస్తలుల కార్యములు 20:​7-12. *

3 పౌలు మాటలను నమ్మేందుకు ఆ తొమ్మిది పునరుత్థానాలు ఆధారంగా ఉన్నాయి. అవి యేసు చేసిన ఈ వాగ్దానంపై మన విశ్వాసాన్ని బలపరుస్తాయి: “ఒక కాలము వచ్చుచున్నది; ఆ కాలమున సమాధులలోనున్న వారందరు ఆయన [యేసు] శబ్దము విని . . . బయటికి వచ్చెదరు.” (యోహాను 5:​28, 29) ఆ మాటలు నిజంగా ఎంత సంతోషాన్నిస్తున్నాయో కదా! తమ ప్రియమైనవారిని మరణం ద్వారా పోగొట్టుకున్న లక్షలాదిమందికి అవెంత ఓదార్పునిస్తున్నాయో కదా!

4 పునరుత్థానం చేయబడినవారిలో అధికశాతంమంది దేవుని రాజ్యపాలనలో శాంతి విలసిల్లుతున్న భూమ్మీదికి తిరిగివస్తారు. (కీర్తన 37:​10, 11, 29; యెషయా 11:​6-9; 35:​5, 6; 65:​21-23) అయితే, ఇది జరగడానికి ముందు ఇతర పునరుత్థానాలు జరగాలి. మన పక్షాన దేవునికి తన బలి విలువను సమర్పించేందుకు యేసుక్రీస్తు మొదట పునరుత్థానం చేయబడాలి. యేసు మరణించి సా.శ. 33లో పునరుత్థానం చేయబడ్డాడు.

5 ఆ తర్వాత, “దేవుని ఇశ్రాయేలునకు” చెందిన అభిషిక్త సభ్యులు పరలోక మహిమలో ప్రభువైన యేసుక్రీస్తుతో కలిసి పనిచేయాలి, వారక్కడ “సదాకాలము ప్రభువుతోకూడా” ఉంటారు. (గలతీయులు 6:​16; 1 థెస్సలొనీకయులు 4:​17) అది “మొదటి పునరుత్థానము” అని పిలవబడింది. (ప్రకటన 20:6) ఆ పునరుత్థానం పూర్తైనప్పుడు, పరదైసు భూమిపై నిత్యజీవాన్ని దక్కించుకునే ఉత్తరాపేక్షగల లక్షలాదిమందిని భూమ్మీదికి పునరుత్థానంచేసే సమయం ఆసన్నమౌతుంది. కాబట్టి, మన నిరీక్షణ పరలోక సంబంధమైనదైనా లేక భూసంబంధమైనదైనా, “మొదటి పునరుత్థానము” మనకు కుతూహలం కలిగిస్తుంది. అదెలాంటి పునరుత్థానం? అది ఎప్పుడు జరుగుతుంది?

‘ఎలాంటి శరీరము?’

6 కొరింథీయులకు తాను వ్రాసిన మొదటి పత్రికలో పౌలు మొదటి పునరుత్థానం గురించి ఈ ప్రశ్న లేవదీశాడు: ‘మృతులేలాగు లేతురు? వారెట్టి శరీరముతో వత్తురు?’ ఆ పిమ్మట ఆయనే ఆ ప్రశ్నకిలా సమాధానమిస్తున్నాడు: “నీవు విత్తునది చచ్చితేనే గాని బ్రదికింపబడదు . . . అయితే దేవుడే తన చిత్తప్రకారము నీవు విత్తినదానికి శరీరము ఇచ్చును. . . . ఆకాశ వస్తురూపముల మహిమ వేరు, భూవస్తురూపముల మహిమ వేరు.”​—⁠1 కొరింథీయులు 15:​35-40.

7 పరిశుద్ధాత్మతో అభిషేకించబడిన క్రైస్తవులు తమ పరలోక బహుమానాన్ని అందుకోవడానికి ముందు చనిపోవాలని పౌలు మాటలు చూపిస్తున్నాయి. వారు చనిపోయినప్పుడు వారి భూసంబంధ శరీరాలు తిరిగి మన్నైపోతాయి. (ఆదికాండము 3:​19) దేవుని నిర్ణయకాలంలో వారు పరలోక జీవితానికి తగిన శరీరంతో పునరుత్థానం చేయబడతారు. (1 యోహాను 3:⁠2) దేవుడు వారికి అమర్త్యతను కూడా అనుగ్రహిస్తాడు. అది వారు జన్మతః స్వతంత్రించుకున్నది కాదు. “మర్త్యమైన యీ శరీరము అమర్త్యతను ధరించుకొనవలసియున్నది” అని పౌలు చెబుతున్నాడు. అమర్త్యత దేవుడిచ్చే వరం, మొదటి పునరుత్థానంలో పాలుగలవారు దానిని ‘ధరించుకుంటారు.’​—⁠1 కొరింథీయులు 15:​50, 53; ఆదికాండము 2:⁠7; 2 కొరింథీయులు 5:​1, 2, 8.

8 మొదటి పునరుత్థానంలో 1,44,000 మంది మాత్రమే పాలుపంచుకుంటారు. యెహోవా వారిని యేసు పునరుత్థానం చేయబడిన అనతికాలంలోనే సా.శ. 33 పెంతెకొస్తు నుండి ఎంచుకోవడం ఆరంభించాడు. వారందరి నొసళ్లపై “ఆయన [యేసు] నామమును ఆయన తండ్రి నామమును” లిఖించబడి ఉంటుంది. (ప్రకటన 14:​1, 3) కాబట్టి వారు వివిధ మతాలనుండి ఎంపికజేయబడలేదు. అందరూ క్రీస్తు అనుచరులైయుండి తండ్రియైన యెహోవా నామాన్ని సగర్వంగా ధరించుకున్నవారు. వారు పునరుత్థానం చేయబడినప్పుడు, పరలోకంలో వారికి పని అప్పగించబడుతుంది. అలా నేరుగా దేవుణ్ణి సేవించే ఉత్తరాపేక్ష వారినెంతో పులకరింపజేస్తుంది.

అదిప్పుడు జరుగుతోంది

9 మొదటి పునరుత్థానం ఎప్పుడు జరుగుతుంది? అదిప్పుడు జరుగుతోందని చెప్పేందుకు బలమైన రుజువుంది. ఉదాహరణకు, ప్రకటన గ్రంథములోని రెండు అధ్యాయాలను పోల్చండి. మొదట, ప్రకటన 12వ అధ్యాయం చూడండి. అక్కడ మనం, క్రొత్తగా సింహాసనాసీనుడైన యేసుక్రీస్తు తన పరిశుద్ధ దూతలతో కలిసి సాతానుకు అతని దయ్యాలకు వ్యతిరేకంగా యుద్ధం చేయడం గురించి చదువుతాం. (ప్రకటన 12:​7-9) ఈ పత్రిక తరచూ చూపిస్తున్నట్లుగా ఆ యుద్ధం 1914లో మొదలైంది. * అయితే క్రీస్తు అభిషిక్త అనుచరుల్లో ఏ ఒక్కరూ ఆ పరలోక యుద్ధంలో యేసుతో ఉన్నట్లు చెప్పబడలేదని గమనించండి. ఇప్పుడు ప్రకటన 17వ అధ్యాయం చూడండి. అక్కడ మనం “మహా బబులోను” నాశనం తర్వాత, గొర్రెపిల్ల జనాంగాలను జయించడం గురించి చదువుతాం. ఆ తర్వాత ఇంకా ఇలా చెప్పబడింది: “తనతోకూడ ఉండినవారు పిలువబడినవారై, యేర్పరచబడినవారై, నమ్మకమైనవారై యున్నందునను, ఆయన ఆ రాజులను జయించును.” (ప్రకటన 17:​5, 14) సాతాను లోకాన్ని చివరిసారిగా జయించడానికి వారు యేసుతోపాటు ఉండాలంటే, ‘పిలువబడిన, ఏర్పర్చబడిన, నమ్మకమైనవారు’ అప్పటికే పునరుత్థానమై ఉండాలి. కాబట్టి, అర్మగిద్దోనుకు ముందు చనిపోయే అభిషిక్తులు 1914కు అర్మగిద్దోనుకు మధ్య పునరుత్థానం చేయబడ్డారనడం సహేతుకం.

10 మొదటి పునరుత్థానం ఎప్పుడు ఆరంభమవుతుందో మనం మరింత ఖచ్చితంగా చెప్పగలమా? ఆసక్తికరమైన కీలకం మనకు ప్రకటన 7:9-15లో కనిపిస్తుంది, అక్కడ అపొస్తలుడైన యోహాను “యెవడును లెక్కింపజాలని యొక గొప్పసమూహము” గురించి తనకివ్వబడిన దర్శనాన్ని వర్ణిస్తున్నాడు. ఆ గొప్పసమూహాన్ని గుర్తించడాన్ని 24 మంది పెద్దల్లో ఒకరు యోహానుకు బయల్పర్చాడు, ఈ పెద్దలు తమ పరలోక మహిమలో క్రీస్తుతోడి వారసులైన 1,44,000 మందికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. * (లూకా 22:​28-30; ప్రకటన 4:⁠4) యోహానుకు పరలోక నిరీక్షణ ఉంది; అయితే ఆ పెద్ద యోహానుతో మాట్లాడినప్పుడు యోహాను ఇంకా ఈ భూమ్మీదే ఉన్నాడు కాబట్టి, ఆ దర్శనంలో ఆయన తమ పరలోక బహుమానాన్ని ఇంకా అందుకోని భూమ్మీదవున్న అభిషిక్తులకు ప్రాతినిధ్యం వహిస్తుండాలి.

11 కాబట్టి ఆ 24 మంది పెద్దల్లో ఒకరు యోహానుకు గొప్పసమూహం గురించి చెప్పాడనే వాస్తవాన్నిబట్టి మనమే నిర్ధారణకు రావచ్చు? ఆ 24 మంది పెద్దల గుంపులో పునరుత్థానం చేయబడినవారు నేడు దైవిక సత్యాలను అందజేయడంలో ఇమిడివున్నట్లు అనిపిస్తోంది. అదెందుకు ప్రాముఖ్యం? ఎందుకంటే గొప్పసమూహం గురించిన సరైన గుర్తింపు, భూమ్మీది దేవుని అభిషిక్త సేవకులకు 1935లో బయల్పర్చబడింది. ఆ ప్రాముఖ్యమైన సత్యాన్ని అందజేసేందుకు ఆ 24 మంది పెద్దల్లో ఒకరు ఉపయోగించబడ్డారంటే, ఆయన 1935కి ముందే పరలోకానికి పునరుత్థానం చేయబడి ఉండాలి. అది మొదటి పునరుత్థానం 1914కి 1935కి మధ్య ఆరంభమై ఉండవచ్చని సూచిస్తోంది. మనం మరింత ప్రామాణికంగా లెక్కించడానికి వీలుందా?

12 ఈ సందర్భంలో బైబిలు సమాంతర ఘట్టమని పరిగణించబడేదాన్ని పరిశీలించడం సహాయకరంగా ఉండవచ్చు. సా.శ. 29 శరదృతువులో యేసుక్రీస్తు దేవుని రాజ్యానికి భవిష్యత్‌ రాజుగా అభిషేకించబడ్డాడు. మూడున్నర సంవత్సరాల తర్వాత అంటే సా.శ. 33 వసంత రుతువులో ఆయన శక్తిమంతమైన ఆత్మప్రాణిగా పునరుత్థానం చేయబడ్డాడు. యేసు 1914 శరదృతువులో సింహాసనాసీనుడయ్యాడు కాబట్టి, ఆయన విశ్వసనీయ అభిషిక్త అనుచరుల పునరుత్థానం ఆ తర్వాత మూడున్నర సంవత్సరాలకు అంటే 1918 వసంత రుతువులో ఆరంభమైందని సహేతుకంగా చెప్పవచ్చా? అలా జరగవచ్చనేది ఆసక్తికరమైన విషయం. దీనిని బైబిలు అధారంగా నేరుగా నిర్ధారించడం కుదరకపోయినా, క్రీస్తు ప్రత్యక్షత ఆరంభమైన కొద్దికాలానికే మొదటి పునరుత్థానం ఆరంభమైందని సూచించే ఇతర లేఖనాలకు ఇది విరుద్ధం కాదు.

13 ఉదాహరణకు, పౌలు ఇలా వ్రాశాడు: “మేము ప్రభువుమాటనుబట్టి మీతో చెప్పునదేమనగా, ప్రభువు రాకడవరకు [ఆయన ప్రత్యక్షతా అంతము వరకు కాదు] సజీవులమై నిలిచియుండు మనము నిద్రించినవారికంటె ముందుగా ఆయన సన్నిధి చేరము. ఆర్భాటముతోను, ప్రధానదూత శబ్దముతోను, దేవుని బూరతోను పరలోకమునుండి ప్రభువు దిగివచ్చును; క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము వారితోకూడ ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశమండలమునకు మేఘములమీద కొనిపోబడుదుము. కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడ ఉందుము.” (1 థెస్సలొనీకయులు 4:​15-17) కాబట్టి, క్రీస్తు ప్రత్యక్షతా కాలానికి ముందు చనిపోయిన అభిషిక్త క్రైస్తవులు, క్రీస్తు ప్రత్యక్షతా కాలంలో ఇంకా సజీవులుగావున్న వారికన్నా ముందే పరలోక జీవానికి ఎత్తబడ్డారు. అంటే మొదటి పునరుత్థానం క్రీస్తు ప్రత్యక్షతా కాలారంభంలో మొదలై “క్రీస్తు వచ్చిన” కాలంలోనూ కొనసాగుతుందని దానర్థం. (1 కొరింథీయులు 15:​23) అందరూ ఒకే సమయంలో పునరుత్థానం చేయబడడానికి బదులు, మొదటి పునరుత్థానం కొంతకాల వ్యవధిలో జరుగుతుంది.

“తెల్లని వస్త్రము వారిలో ప్రతివాని కియ్యబడెను”

14 ప్రకటన 6వ అధ్యాయంలో ఇవ్వబడిన రుజువును కూడా పరిశీలించండి. అక్కడ యేసును జయిస్తూ వెళ్తున్న రాజుగా చూడవచ్చు. (ప్రకటన 6:⁠2) దేశాలు భీకరమైన యుద్ధంలో తలమునకలై ఉన్నాయి. (ప్రకటన 6:⁠4) విపరీతమైన కరవు ప్రబలింది. (ప్రకటన 6:​5, 6) ప్రాణాంతక వ్యాధులు మానవాళిని పట్టిపీడిస్తున్నాయి. (ప్రకటన 6:⁠8) ఈ ప్రవచనార్థక సంఘటనలన్నీ 1914 నుండి ప్రపంచ పరిస్థితులను రూఢీపరుస్తున్నాయి. అయితే మరింకేదో జరుగుతోంది. మన అవధానం బలిపీఠంవైపు మళ్లించబడుతోంది. దాని క్రింద “దేవుని వాక్యము నిమిత్తమును, తాము ఇచ్చిన సాక్ష్యము నిమిత్తమును వధింపబడినవారి ఆత్మలు” ఉన్నాయి. (ప్రకటన 6:⁠9) “రక్తము దేహమునకు ప్రాణము” కాబట్టి, బలిపీఠము క్రిందున్నవని చెప్పబడినది నిజానికి ధైర్యంగా, ఉత్సాహంగా సాక్ష్యమిచ్చినందుకు వధించబడిన యేసు నమ్మకమైన సేవకుల రక్తమే.​—⁠లేవీయకాండము 17:​11.

15 నీతిమంతుడైన హేబెలు రక్తంలాగే, ఈ క్రైస్తవ హతసాక్షుల రక్తం న్యాయం కోసం మొరపెడుతోంది. (ఆదికాండము 4:​10) “నాథా, సత్యస్వరూపీ, పరిశుద్ధుడా, యెందాక తీర్పు తీర్చకయు, మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయకయు ఉందువని బిగ్గరగా కేకలువేసిరి.” తర్వాత ఏమి జరుగుతుంది? “తెల్లని వస్త్రము వారిలో ప్రతివాని కియ్యబడెను; మరియు​—⁠వారివలెనే చంపబడబోవువారి సహదాసులయొక్కయు సహోదరులయొక్కయు లెక్క పూర్తియగువరకు ఇంక కొంచెము కాలము విశ్రమింపవలెనని వారితో చెప్పబడెను.”​—⁠ప్రకటన 6:​10, 11.

16 ఈ తెల్లని వస్త్రములు బలిపీఠము క్రిందున్న రక్తపు మడుగులకు ఇవ్వబడ్డాయా? లేదు. ఆ వస్త్రములు బలిపీఠంపై వధించబడిన రీతిలో రక్తం చిందించబడినవారికి ఇవ్వబడ్డాయి. వారు యేసు నామమున తమ జీవితాలు బలి ఇచ్చారు, వారిప్పుడు ఆత్మప్రాణులుగా పునరుత్థానం చేయబడ్డారు. అలాగని మనకెలా తెలుసు? ప్రకటన గ్రంథములో మనం అంతకుముందు ఇలా చదువుతాం: “జయించువాడు ఆలాగున తెల్లని వస్త్రములు ధరించుకొనును; జీవగ్రంథములోనుండి అతని పేరెంతమాత్రమును తుడుపుపెట్టను.” ఆ 24 మంది పెద్దలు కూడా “తెల్లనివస్త్రములు ధరించుకొని, తమ తలలమీద సువర్ణ కిరీటములు పెట్టుకొన్నవారై” ఉన్నారని గుర్తుతెచ్చుకోండి. (ప్రకటన 3:⁠5; 4:⁠4) కాబట్టి యుద్ధం, కరవు, తెగులు భూమిని ధ్వంసం చేయడం ఆరంభించిన తర్వాత, బలిపీఠం క్రిందున్న రక్తంచేత సూచించబడుతున్న 1,44,000 మందిలోని చనిపోయిన సభ్యులు పరలోక జీవానికి పునరుత్థానమై, సూచనార్థకమైన తెల్లని వస్త్రములు ధరించుకున్నారు.

17 అలా క్రొత్తగా పునరుత్థానం చేయబడినవారు ‘విశ్రమించాలి.’ దేవుని ప్రతిదండనా దినంవరకు వారు ఓపికగా వేచివుండాలి. వారి “సహదాసులు,” భూమ్మీది అభిషిక్త క్రైస్తవులు పరీక్షల్లో తమ యథార్థతను ఇంకా నిరూపించుకోవలసి ఉంది. దైవిక తీర్పు సమయం ఆసన్నమైనప్పుడు ‘విశ్రమించే’ ఆ కాలం ముగుస్తుంది. (ప్రకటన 7:⁠3) ఆ సమయంలో, నిర్దోషులైన క్రైస్తవుల రక్తం చిందించినవారితోపాటు దుష్టులను నాశనం చేయడంలో, పునరుత్థానం చేయబడినవారు ప్రభువైన యేసుతోపాటు భాగం వహిస్తారు.​—⁠2 థెస్సలొనీకయులు 1:​7-10.

ఈ విషయాలు మనకెంత ప్రాముఖ్యం?

18 మొదటి పునరుత్థానానికి సంబంధించిన ఖచ్చితమైన తేదీని దేవుని వాక్యం మనకు వెల్లడిచేయడం లేదు, బదులుగా అది క్రీస్తు ప్రత్యక్షతా కాలంలో కొంత కాలవ్యవధిలో జరుగుతుందని మాత్రమే వెల్లడిస్తోంది. క్రీస్తు ప్రత్యక్షత ఆరంభానికి ముందు చనిపోయిన అభిషిక్త క్రైస్తవులు మొదట పునరుత్థానం చేయబడతారు. క్రీస్తు ప్రత్యక్షతా సమయం కొనసాగుతుండగా నమ్మకంగా తాము భూమ్మీద యెహోవాకు చేస్తున్న సేవను ముగించిన అభిషిక్త క్రైస్తవులు “రెప్పపాటున” శక్తిమంతమైన ఆత్మప్రాణులుగా మార్పుచెందుతారు. (1 కొరింథీయులు 15:​51) హార్‌మెగిద్దోను యుద్ధానికి ముందే అభిషిక్తులందరూ తమ పరలోక బహుమానాన్ని అందుకుంటారా? మనకు తెలియదు. కానీ దేవుని నిర్ణయకాలంలో 1,44,000 మందీ పరలోకంలోని సీయోను పర్వతంపై నిలబడతారని మనకు తెలుసు.

19 అలాగే 1,44,000 మందిలో అధికశాతం ఇప్పటికే క్రీస్తుతో ఉన్నారని కూడా మనకు తెలుసు. కొద్దిమంది మాత్రమే ఇంకా భూమ్మీద ఉన్నారు. దేవుని తీర్పు అమలుచేయబడే సమయం వేగంగా సమీపిస్తోందనేందుకు ఇదెంత శక్తివంతమైన సూచనో కదా! త్వరలోనే, సాతాను విధానం మొత్తం నాశనం చేయబడుతుంది. సాతాను అగాధంలో పడవేయబడతాడు. ఆ తర్వాత సాధారణ పునరుత్థానం మొదలై, నమ్మకమైన మానవులందరూ యేసు విమోచన క్రయధన బలి ఆధారంగా ఆదాము పోగొట్టిన పరిపూర్ణతను తిరిగిపొందే అవకాశాన్ని కలిగివుంటారు. ఆదికాండము 3:15లో నమోదుచేయబడిన యెహోవా ప్రవచనం అద్భుతరీతిలో నెరవేరుతోంది. ఈ కాలంలో జీవించడం ఎంత గొప్ప ఆధిక్యతో కదా!

[అధస్సూచీలు]

^ పేరా 13 క్రీస్తు ప్రత్యక్షత 1914లో ఆరంభమైందనే లేఖనాధార రుజువుకోసం, యెహోవాసాక్షులు ప్రచురించిన బైబిలు నిజంగా ఏమి బోధిస్తోంది? పుస్తకంలో 215-18 పేజీలు చూడండి.

^ పేరా 14 ఆ 24 మంది పెద్దలు తమ పరలోక స్థానాల్లో కూర్చున్న అభిషిక్త క్రైస్తవులకు ప్రతీకగా ఉన్నారని మనకెలా తెలుసో అర్థం చేసుకునే అదనపు సమాచారం కోసం యెహోవాసాక్షులు ప్రచురించిన ప్రకటన​—⁠దాని దివ్యమైన ముగింపు సమీపించింది! పుస్తకంలోని 77వ పేజీ చూడండి.

మీరు వివరించగలరా?

మొదటి పునరుత్థాన సమయాన్ని గ్రహించేందుకు ఈ క్రింది లేఖనాలు ఎలా సహాయం చేస్తాయి?

ప్రకటన 12:⁠7; 17:⁠14

ప్రకటన 7:​13, 14

1 కొరింథీయులు 15:​23; 1 థెస్సలొనీకయులు 4:​15-17

ప్రకటన 6:​2, 9-11

[అధ్యయన ప్రశ్నలు]

1, 2. (ఎ) చనిపోయినవారికి ఎలాంటి నిరీక్షణ ఉంది? (బి) దేని ఆధారంగా మీరు పునరుత్థానాన్ని నమ్ముతారు? (అధస్సూచి చూడండి.)

3. యోహాను 5:​28, 29లో వ్రాయబడిన యేసు మాటలనుండి మీరు వ్యక్తిగతంగా ఎలాంటి ఓదార్పు పొందారు, ఎందుకు?

4, 5. బైబిలు ఏ విభిన్న పునరుత్థానాలను పేర్కొంటోంది, ఈ ఆర్టికల్‌లో ఏ పునరుత్థానం చర్చించబడుతుంది?

6, 7. (ఎ) అభిషిక్త క్రైస్తవులు పరలోకానికి వెళ్లకముందు ఏమి జరగాలి? (బి) వారెలాంటి శరీరంతో పునరుత్థానం చేయబడతారు?

8. దేవుడు 1,44,000 మందిని వివిధ మతాలనుండి ఎంపికజేయడని మనకెలా తెలుసు?

9. మొదటి పునరుత్థాన ఆరంభ సమయాన్ని సుమారుగా లెక్కించేందుకు ప్రకటన 12:​7 మరియు 17:⁠14 మనకెలా సహాయం చేస్తాయి?

10, 11. (ఎ) ఆ 24 మంది పెద్దలు ఎవరు, వారిలో ఒకరు యోహానుకు ఏమి బయల్పరిచాడు? (బి) దీనినుండి మనమే నిర్ధారణకు రావచ్చు?

12. మొదటి పునరుత్థానం 1918 వసంత రుతువులో ఆరంభమై ఉండవచ్చని ఎందుకు చెప్పవచ్చో వివరించండి.

13. క్రీస్తు ప్రత్యక్షతా కాలారంభంలో మొదటి పునరుత్థానం ఆరంభమైందని 1 థెస్సలొనీకయులు 4:​15-17 వచనాలు ఏ విధంగా సూచిస్తున్నాయి?

14. (ఎ) ప్రకటన 6వ అధ్యాయంలో వ్రాయబడిన దర్శనాలు ఎప్పుడు నెరవేరాయి? (బి) ప్రకటన 6:⁠9లో ఏమి వర్ణించబడింది?

15, 16. ప్రకటన 6:​10, 11లోని మాటలు మొదటి పునరుత్థానాన్ని ఎందుకు సూచిస్తున్నాయో వివరించండి.

17. తెల్లని వస్త్రములు ధరించుకున్నవారు ఏ భావంలో ‘విశ్రమించాలి’?

18, 19. (ఎ) మొదటి పునురుత్థానం ఇప్పుడు జరుగుతోందని ఏ కారణాలనుబట్టి మీరు నిర్ధారించవచ్చు? (బి) మొదటి పునరుత్థానాన్ని అర్థం చేసుకోవడం మీకెలా అనిపిస్తోంది?

[26వ పేజీలోని చిత్రాలు]

మానవుల సాధారణ పునరుత్థానానికి ముందు ఏ పునరుత్థానాలు జరుగుతాయి?

[29వ పేజీలోని చిత్రం]

చనిపోయిన కొందరికి తెల్లని వస్త్రం ఏ విధంగా ఇవ్వబడింది?