కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

‘వినయాన్ని ధరించుకోండి’

‘వినయాన్ని ధరించుకోండి’

‘వినయాన్ని ధరించుకోండి’

ఆయన ఒక ప్రముఖ నగరానికి చెందినవాడు. రోమా పౌరసత్వమున్న ఆయన, బహుశా మంచి పేరున్న కుటుంబం నుండి వచ్చివుంటాడు. ఆయనే సౌలు, ఆయన సా.శ. మొదటి శతాబ్దంలో అందుబాటులోవున్న శ్రేష్ఠమైన విద్యనభ్యసించాడు, ఆయనకు కనీసం రెండు భాషలు తెలుసు. ఆయన పరిసయ్యులనబడే బాగా పేరుపొందిన యూదా మతగుంపుకు చెందినవాడు.

సౌలు సామాన్య ప్రజలను చిన్నచూపు చూడడాన్నేకాక తన నీతినిబట్టి గర్వపడడాన్ని నేర్చుకునివుండవచ్చు. (లూకా 18:11, 12; అపొస్తలుల కార్యములు 26:5) సౌలుతో ఉన్న పరిసయ్యులు, తాము ఇతరులకన్నా గొప్పవారమని భావిస్తూ, పేరుప్రఖ్యాతలను, గొప్పగొప్ప బిరుదులను ఇష్టపడేవారు. (మత్తయి 23:6, 7; లూకా 11:43) అలాంటి వారితో సహవసించడంవల్ల సౌలు అహంకారిగా మారివుండవచ్చు. ఆయన క్రైస్తవులను తీవ్రంగా హింసించేవాడని మనకు తెలుసు. కొన్ని సంవత్సరాల తర్వాత అపొస్తలుడైన పౌలుగా మారిన సౌలు, తాను ఒకప్పుడు ‘దూషకునిగా హింసకునిగా హానికారకునిగా’ ఉండేవాణ్ణని చెప్పాడు.—1 తిమోతి 1:12, 13.

అవును, సౌలు క్రైస్తవునిగా అంటే అపొస్తలుడైన పౌలుగా మారిన తర్వాత ఆయన వ్యక్తిత్వం పూర్తిగా మారిపోయింది. క్రైస్తవ అపొస్తలునిగా ఉన్నప్పుడు, తాను “పరిశుద్ధులందరిలో అత్యల్పుడ[ను]” అని ఆయన వినయంగా చెప్పాడు. (ఎఫెసీయులు 3:8) ఆయన సమర్థుడైన సువార్తికుడే అయినా ఆ ఘనతను తనకు ఆపాదించుకునే బదులు దేవుణ్ణే ఘనపర్చాడు. (1 కొరింథీయులు 3:5-9; 2 కొరింథీయులు 11:7) పౌలే తోటి క్రైస్తవులకు ఇలా ఉపదేశించాడు: “మీరు జాలిగల మనస్సును, దయాళుత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనుడి.”—కొలొస్సయులు 3:12.

మనం జీవించే ఈ 21వ శతాబ్దంలో ఆ సలహా ఆచరణాత్మకమైనదేనా? వినయంగా ఉండడం ప్రయోజనకరమేనా? నిజంగా వినయం ఒక బలంగా ఉండగలదా?

సర్వశక్తిమంతుడైన సృష్టికర్త వినయస్థుడేనా?

వినయం గురించి ఎప్పుడు చర్చించినా దేవుని దృక్కోణాన్ని పరిగణలోకి తీసుకోవాలి. ఎందుకు? ఎందుకంటే ఆయనే సర్వాధిపతి, మన సృష్టికర్త. ఆయనకు భిన్నంగా మనం మన పరిమితులను గుర్తించాలి. మనం ఆయనపై ఆధారపడివున్నాం. ప్రాచీనకాలంలో, జ్ఞానియైన ఎలీహు ఇలా రాశాడు: “సర్వశక్తుడగు దేవుడు మహాత్మ్యముగలవాడు. ఆయన మనకు అగోచరుడు.” (యోబు 37:23) అంతెందుకు, మన చుట్టూవున్న అనంత విశ్వం గురించి ఆలోచించడమే మనల్ని వినయస్థులను చేస్తుంది! “మీ కన్నులు పైకెత్తి చూడుడి. వీటిని ఎవడు సృజించెను? వీటి లెక్కచొప్పున వీటి సమూహములను బయలుదేరజేసి వీటన్నిటికిని పేరులు పెట్టి పిలుచువాడే గదా. తన అధికశక్తిచేతను తనకు కలిగియున్న బలాతిశయముచేతను ఆయన యొక్కటియైనను విడిచిపెట్టడు” అని ప్రవక్తయైన యెషయా చెప్పాడు.—యెషయా 40:26.

యెహోవా దేవుడు సర్వశక్తిమంతుడు మాత్రమే కాదు, ఆయన వినయస్థుడు కూడా. రాజైన దావీదు ఆయనకిలా ప్రార్థించాడు: “నీవు నీ రక్షణ కేడెమును నాకు అందించుదువు నీ సాత్వికము నన్ను గొప్పచేయును.” (2 సమూయేలు 22:36) దేవుడు తనను సంతోషపర్చాలని ప్రయత్నించే దీనులపట్ల శ్రద్ధను, దయను చూపిస్తాడు కాబట్టి ఆయన వినయస్థుడు అని చెప్పవచ్చు. అలంకారార్థ భావంలో చెప్పాలంటే, దైవభయంగలవారితో దయాపూర్వకంగా వ్యవహరించేందుకు యెహోవా పరలోకం నుండి కిందకు వస్తాడు.—కీర్తన 113:5, 6, 8.

అంతేగాక, తన సేవకులు చూపించే వినయాన్ని యెహోవా విలువైనదిగా ఎంచుతాడు. “దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును” అని అపొస్తలుడైన పేతురు రాశాడు. (1 పేతురు 5:5) గర్వం విషయంలో దేవుని దృక్కోణమేమిటో చెబుతూ ఒక బైబిలు రచయిత ఇలా వ్యాఖ్యానించాడు: “గర్వహృదయులందరు యెహోవాకు హేయులు.” (సామెతలు 16:5) మరైతే, వినయం ఒక బలమని ఎలా చెప్పవచ్చు?

వినయమంటే ఏది కాదు?

వినయం కనబరచడం అంటే అవమానించబడడం కాదు. ప్రాచీన సంప్రదాయాల్లో, వినయస్థుడు అంటే అవమానించబడుతూ, బాధాకరమైన స్థితిలోవున్న దీనుడైన ఒక బానిస. దానికి భిన్నంగా, వినయం కనబరచడంవల్ల గౌరవం లభిస్తుందని బైబిలు నొక్కిచెబుతోంది. ఉదాహరణకు, ఒక జ్ఞాని ఇలా రాశాడు: “యెహోవాయందు భయభక్తులు కలిగియుండుట వినయమునకు ప్రతిఫలము ఐశ్వర్యమును ఘనతయు జీవమును దానివలన కలుగును.” (సామెతలు 22:4) అంతేకాక, “యెహోవా మహోన్నతుడైనను ఆయన దీనులను లక్ష్యపెట్టును ఆయన దూరమునుండి గర్విష్ఠులను బాగుగా ఎరుగును” అని కీర్తనలు 138:6 చెబుతోంది.

ఒక వ్యక్తి వినయంగా ఉన్నాడంటే ఆయనకు ఎలాంటి సామర్థ్యాలు లేవనీ లేదా ఆయన ఎలాంటి విజయాలు సాధించలేదనీ దానర్థం కాదు. ఉదాహరణకు, తాను యెహోవాకు అద్వితీయ కుమారుణ్ణి కానని యేసుక్రీస్తు ఎప్పుడూ చెప్పుకోలేదు, భూమిపై తాను చేస్తున్న పరిచర్య ప్రాముఖ్యమైనది కాదన్నట్లు ఎప్పుడూ ప్రవర్తించలేదు. (మార్కు 14:61, 62; యోహాను 6:51) అయితే, తాను చేసిన పనుల విషయంలో తన తండ్రిని ఘనపర్చడం ద్వారానేకాక తన శక్తిని ఇతరులపై అధికారం చెలాయించడానికి, వారిని అణచివేయడానికి ఉపయోగించే బదులు వారికి సేవచేయడానికి, వారికి చేయూతనివ్వడానికి ఉపయోగించడం ద్వారా కూడా యేసు వినయాన్ని చూపించాడు.

వినయం ఒక బలం

యేసుక్రీస్తు తన సమకాలీనులకు ‘మహత్కార్యములు’ చేసేవానిగా తెలుసనడంలో సందేహమే లేదు. (అపొస్తలుల కార్యములు 2:22) అయితే, కొంతమంది దృష్టిలో ఆయన ‘అత్యల్ప మనుష్యుడు.’ (దానియేలు 4:17) ఆయన తన జీవితంలో వినయాన్ని చూపించడమేకాక అనేకసార్లు దానికున్న విలువ గురించి కూడా బోధించాడు. (లూకా 9:48; యోహాను 13:2-16) అయితే, ఆయన వినయం ఆయనను బలహీనుణ్ణి చేయలేదు. ఆయన తన తండ్రి నామాన్ని సమర్థించడంలో, తన పరిచర్య చేయడంలో ధైర్యాన్ని కనపర్చాడు. (ఫిలిప్పీయులు 2:6-8) బైబిల్లో, యేసు ధైర్యంగల సింహముగా వర్ణించబడ్డాడు. (ప్రకటన 5:5) వినయంతోపాటు నైతిక బలాన్ని, దృఢసంకల్పాన్ని కూడా కనబరచవచ్చని యేసు ఉదాహరణ చూపిస్తోంది.

నిజమైన వినయాన్ని అలవర్చుకోవడానికి మనం ప్రయత్నిస్తున్నప్పుడు, దానిని జీవిత విధానంగా చేసుకోవడానికి ఎంతో కృషి అవసరమనే విషయాన్ని మనం గ్రహిస్తాం. అలా చేసుకోవాలంటే, సులువైన పద్ధతిని పాటించకుండా లేదా శారీరక కోరికలకు లొంగిపోకుండా అన్ని సమయాల్లో దేవుని చిత్తానికి విధేయత చూపించాలి. వినయాన్ని అలవర్చుకోవడానికి నైతిక బలం అవసరం, ఎందుకంటే యెహోవాను సేవించడానికి, ఇతరుల ప్రయోజనాలకు నిస్వార్థంగా ప్రాధాన్యతనివ్వడానికి మనం మన స్వప్రయోజనాలను ప్రక్కనపెట్టాలి.

వినయంవల్ల కలిగే ప్రయోజనాలు

వినయాన్ని అలవర్చుకోవాలంటే గర్వాన్ని లేదా అహంకారాన్ని వదులుకోవాలి. మన బలాల బలహీనతల గురించి, మన జయాపజయాల గురించి వాస్తవికంగా విశ్లేషించుకున్నట్లైతే మనం వినయ దృక్పథాన్ని పెంపొందించుకోవచ్చు. పౌలు ఈ విషయంలో చక్కని సలహానిస్తూ ఇలా రాశాడు: ‘తన్ను తాను ఎంచుకొనతగిన దానికంటె ఎక్కువగా ఎంచుకొనవద్దని మీలోనున్న ప్రతి వానితోను చెబుతున్నాను.’ (రోమీయులు 12:3) ఆ సలహాను పాటించేవారే వినయస్థులు.

మనం మన ప్రయోజనాలకన్నా ఇతరుల ప్రయోజనాలకు ప్రాధాన్యతనివ్వడం ద్వారా కూడా వినయాన్ని కనపర్చవచ్చు. పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపించబడిన పౌలు క్రైస్తవులను ఇలా ఉపదేశించాడు: “కక్షచేతనైనను వృథాతిశయముచేతనైనను ఏమియు చేయక, వినయమైన మనస్సుగలవారై యొకనినొకడు తనకంటె యోగ్యుడని యెంచు[కొనుడి].” (ఫిలిప్పీయులు 2:3) యేసు తన అనుచరులకు ఇచ్చిన ఈ ఆజ్ఞతో అది పొందికగా ఉంది: “మీలో అందరికంటె గొప్పవాడు మీకు పరిచారకుడై యుండవలెను. తన్నుతాను హెచ్చించుకొనువాడు తగ్గింపబడును; తన్నుతాను తగ్గించుకొనువాడు హెచ్చింపబడును.”—మత్తయి 23:11, 12.

దేవుడు వినయస్థులను నిజంగానే ఎంతో విలువైనవారిగా ఎంచుతాడు. ఆ విషయాన్ని శిష్యుడైన యాకోబు ఈ మాటలను రాసినప్పుడు నొక్కిచెప్పాడు: “ప్రభువు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకొనుడి, అప్పుడాయన మిమ్మును హెచ్చించును.” (యాకోబు 4:10) దేవునిచేత హెచ్చింపబడాలని ఎవరు మాత్రం కోరుకోరు?

వినయం కనపర్చకపోవడం వివిధ గుంపుల మధ్య, వ్యక్తుల మధ్య గందరగోళానికి, తగవులకు కారణమైంది. మరోవైపు, వినయస్థులుగా ఉండడం మంచి ఫలితాలను తీసుకొస్తుంది. దేవుడు మనల్ని ఆమోదించినప్పుడు మనం సంతోషించవచ్చు. (మీకా 6:8) మనం మనశ్శాంతితో ఉండవచ్చు, ఎందుకంటే గర్విష్టికన్నా వినయస్థుడే మరింత సంతోషంగా, సంతృప్తిగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. (కీర్తన 101:5) కుటుంబంతో, స్నేహితులతోనేకాక తోటి పనివారితో, ఇతరులతో కూడా మన సంబంధాలు మెరుగ్గా, మరింత ఆహ్లాదకరంగా ఉంటాయి. వినయస్థులు ఇతరులతో పొత్తుకుదరనివారిగా, తమ మాటే చెల్లాలని మంకుపట్టుపట్టేవారిగా ప్రవర్తించకుండా జాగ్రత్తపడతారు. ఒకవేళ అలా ప్రవర్తిస్తే అది వ్యక్తుల మధ్య ఆగ్రహావేశాలకు దారితీయవచ్చు, సంబంధాలు పాడవ్వచ్చు, వైరం ఏర్పడవచ్చు.—యాకోబు 3:14-16.

అవును, ఇతరులతో సత్సంబంధాలను కాపాడుకోవడానికి వినయాన్ని అలవర్చుకోవడమే ఒక శ్రేష్ఠమైన మార్గం. పోటీతత్వంతో కూడిన, స్వార్థపూరితమైన ఈ ప్రపంచంలోని సవాళ్లను ఎదుర్కోవడానికి అది మనకు సహాయం చేస్తుంది. అపొస్తలుడైన పౌలు ఒకప్పుడు తనకున్న అహంకారాన్ని, గర్వాన్ని దేవుని సహాయంతో అధిగమించగలిగాడు. అలాగే, మనలో కూడా గర్వపు ఛాయలు ఏమాత్రం కనిపించినా లేదా ఇతరులకన్నా మనమే శ్రేష్ఠులమనే ఆలోచనలు వచ్చినా, వాటిని మొగ్గలోనే త్రుంచివేయాలి. “నాశనమునకు ముందు గర్వము నడచును. పడిపోవుటకు ముందు అహంకారమైన మనస్సు నడచును” అని బైబిలు హెచ్చరిస్తోంది. (సామెతలు 16:18) పౌలు మాదిరిని, ఆయనిచ్చిన సలహాలను పాటించినప్పుడు, ‘వినయాన్ని ధరించుకోవడం’ ఎంత జ్ఞానయుక్తమో మనం గ్రహిస్తాం.—కొలొస్సయులు 3:12.

[4వ పేజీలోని చిత్రం]

పౌలు అహంకారాన్ని, గర్వాన్ని అధిగమించగలిగాడు

[7వ పేజీలోని చిత్రం]

వినయంగా ఉండడంవల్ల మనం ఇతరులతో సత్సంబంధాలను కలిగివుంటాం

[5వ పేజీలోని చిత్రసౌజన్యం]

Anglo-Australian Observatory/David Malin Images