కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

దేవుని సంకల్పంలో యేసు ప్రత్యేక పాత్రను తెలుసుకొని దాన్ని గౌరవించండి

దేవుని సంకల్పంలో యేసు ప్రత్యేక పాత్రను తెలుసుకొని దాన్ని గౌరవించండి

దేవుని సంకల్పంలో యేసు ప్రత్యేక పాత్రను తెలుసుకొని దాన్ని గౌరవించండి

“నేనే మార్గమును, సత్యమును, జీవమును; నా ద్వారానే తప్ప యెవడును తండ్రియొద్దకు రాడు.”​—⁠యోహా. 14:⁠6.

ఎన్నో తరాలుగా, తమ చుట్టూవున్నవారికి భిన్నంగా ఉండాలని చాలామంది ప్రయత్నించారు, కానీ కొద్దిమందే అలా ఉండగలిగారు. ఇతరులతో పోలిస్తే తమకు అనేక ప్రత్యేకతలున్నాయని కొద్దిమందే చెప్పగలుగుతారు. అయితే, దేవుని కుమారుడైన యేసుక్రీస్తుకు మాత్రమే ఎన్నో ప్రత్యేకతలున్నాయి.

2 యేసుకున్న ప్రత్యేక పాత్ర గురించి తెలుసుకునేందుకు ఎందుకు ఇష్టపడాలి? మన పరలోక తండ్రియైన యెహోవాతో మన సంబంధం బాగుండాలంటే ఆయన గురించి తెలుసుకోవాలి! యేసు, “నేనే మార్గమును, సత్యమును, జీవమును; నా ద్వారానే తప్ప యెవడును తండ్రియొద్దకు రాడు” అని అన్నాడు. (యోహా. 14:⁠6; 17:⁠3) యేసు ఏయే విధాలుగా ప్రత్యేకమైనవాడో చూద్దాం. అలా చేయడంవల్ల దేవుని సంకల్పంలో ఆయనకున్న పాత్రను పూర్తిగా అర్థంచేసుకొని, దాన్ని గౌరవించగలుగుతాం.

“అద్వితీయకుమారుడు”

3 సాతాను యేసును శోధించినప్పుడు “దేవుని కుమారుడు” అని పిలిచాడు. యేసు కేవలం దేవుని కుమారుడు మాత్రమే కాదు. (మత్త. 4:​3, 6) ఆయనను ‘దేవుని అద్వితీయకుమారుడు’ అని పిలవడంలో తప్పులేదు. (యోహా. 3:​16, 18) గ్రీకు భాషలో ‘అద్వితీయుడు’ అనే పదానికి “ఆయనవంటివారు ఎవరూ లేరు” లేదా “విశిష్టమైన” వ్యక్తి అనే అర్థాలున్నాయి. యెహోవాకు కోటానుకోట్ల ఆత్మీయ కుమారులున్నారు. అలాంటప్పుడు యేసు ఎలా ఆ కుటుంబంలో “విశిష్టమైన వ్యక్తి” అవుతాడు?

4 యెహోవా ఆయనను మాత్రమే తన స్వహస్తాలతో సృష్టించాడు. ఆయనే మొదటి కుమారుడు. నిజానికి ఆయన “సర్వసృష్టికి ఆదిసంభూతుడు.” (కొలొ. 1:​15) “దేవుని సృష్టికి ఆదియునైనవాడు.” (ప్రక. 3:​14) సృష్టిని చేయడంలో ఈ అద్వితీయ కుమారునికున్న పాత్ర కూడ ప్రత్యేకమైనది. ఆయన సృష్టికర్త కాదు, సృష్టికి మూలంకాదు. కానీ, యెహోవా ఆయనను ఉపయోగించి, లేదా ఆయన ద్వారా సమస్తాన్ని సృష్టించాడు. (యోహాను 1:3 చదవండి.) “ఆకాశమందైనను భూమిమీదనైనను దేవతలనబడినవి యున్నను, మనకు ఒక్కడే దేవుడున్నాడు. ఆయన తండ్రి; ఆయన నుండి సమస్తమును కలిగెను; ఆయన నిమిత్తము మనమున్నాము. మరియు మనకు ప్రభువు ఒక్కడే; ఆయన యేసు క్రీస్తు; ఆయనద్వారా సమస్తమును కలిగెను; మనము ఆయనద్వారా కలిగినవారము” అని అపొస్తలుడైన పౌలు రాశాడు.​—⁠1 కొరిం. 8:⁠6.

5 అయితే, యేసుకు ఇంకా అనేక ప్రత్యేకతలున్నాయి. దేవుని సంకల్పంలో ఆయనకున్న ప్రత్యేకమైన పాత్రను తెలియజేసే అనేక బిరుదుల గురించి లేఖనాలు చెబుతున్నాయి. యేసుకు వర్తించే మరో ఐదు బిరుదులు క్రైస్తవ గ్రీకు లేఖనాల్లో ప్రస్తావించబడ్డాయి. వాటిని మనమిప్పుడు చూద్దాం.

“వాక్యము”

6యోహాను 1:⁠14 చదవండి. యేసుకు “వాక్యము” లేదా లోగోస్‌ అనే పేరు ఎందుకుంది? తెలివిగల ఇతర ప్రాణులు సృష్టించబడినప్పటి నుండి ఆయన నిర్వర్తించిన పాత్రను ఈ బిరుదు సూచిస్తోంది. యెహోవా తన కుమారుణ్ణి ఉపయోగించి భూమ్మీద మానవులకు తన సందేశాన్ని అందించినట్లే ఇతర ఆత్మీయ కుమారులకు సమాచారాన్ని, నిర్దేశాలను అందించాడు. యేసు వాక్యము లేదా దేవుని ప్రతినిధి అన్న విషయం యూదా శ్రోతలకు క్రీస్తు చెప్పిన మాటల్లో స్పష్టమైంది. ఆయన వారితో, “నేను చేయు బోధ నాది కాదు; నన్ను పంపినవానిదే. ఎవడైనను ఆయన చిత్తము చొప్పున చేయ నిశ్చయించుకొనినయెడల, ఆ బోధ దేవునివలన కలిగినదో, లేక నాయంతట నేనే బోధించుచున్నానో, వాడు తెలిసికొనును” అని చెప్పాడు. (యోహా. 7:​16, 17) పరలోకానికి వెళ్లిన తర్వాత కూడ యేసుకు “దేవుని వాక్యము” అనే బిరుదు ఉంది.​—⁠ప్రక. 19:​11, 13, 16.

7 ఆ బిరుదుకున్న అర్థం గురించి ఒకసారి ఆలోచించండి. యేసు యెహోవా సృష్టి అంతటిలో తెలివిగలవాడైనా ఆయన తన సొంత జ్ఞానాన్ని ఉపయోగించలేదు. ఆయన తన తండ్రి ఉపదేశించినట్లు బోధించాడు. ఆయన తనను తాను మహిమపరచుకోకుండా యెహోవాను మహిమపరిచాడు. (యోహా. 12:​50) మనం అనుకరించేందుకు ఆయన ఎంత చక్కని మాదిరి! “ఉత్తమమైనవాటిని గూర్చిన సువార్త ప్రకటించే” అద్భుతమైన అవకాశం మనకూ ఇవ్వబడింది. (రోమా. 10:​15) వినయం చూపించే విషయంలో యేసు ఉదాహరణను గుర్తిస్తే మనం మన సొంత ఆలోచనలను బోధించం. ప్రాణాన్ని రక్షించే సమాచారాన్ని ఇతరులకు తెలియజేస్తున్నప్పుడు మనం “లేఖనముల యందు వ్రాసియున్న సంగతులను అతిక్రమించం” అంటే లేఖనాల్లో లేని విషయాలను బోధించం.​—⁠1 కొరిం. 4:⁠6.

“ఆమేన్‌”

8ప్రకటన 3:⁠14 చదవండి. “ఆమేన్‌” అనే పేరు యేసుకు ఎందుకుంది? “ఆమేన్‌” అనే పదం హెబ్రీ నుండి ఉన్నదున్నట్లుగా అనువదించబడింది. దానికి “అలా జరుగును గాక” లేదా “నిశ్చయము” అని భావం ఉంది. దాని మూల హెబ్రీ పదానికి “నమ్మకంగా ఉండడం” లేదా “నమ్మదగిన” అనే అర్థాలున్నాయి. యెహోవా నమ్మదగినవాడని వివరించేందుకు ఆ పదాలే ఉపయోగించబడ్డాయి. (ద్వితీ. 7:⁠9; యెష. 49:⁠7) అలాంటప్పుడు, యేసు “ఆమేన్‌”గా ప్రస్తావించబడినప్పుడు దానిలో ఏ ప్రత్యేకతవుంది? దానికి 2 కొరింథీయులు 1:​19, 20 ఇలా జవాబిస్తోంది: “మీలో ప్రకటింపబడిన దేవుని కుమారుడగు యేసుక్రీస్తు అవునని చెప్పి కాదనువాడై యుండలేదు గాని ఆయన అవుననువాడై యున్నాడు. దేవుని వాగ్దానములు ఎన్నియైనను అన్నియు క్రీస్తునందు అవునన్నట్టుగానే యున్నవి గనుక . . . దేవునికి మహిమ కలుగుటకై అవి ఆయనవలన నిశ్చయములై [“ఆమేన్‌ అయి,” NW] యున్నవి.”

9 దేవుని వాగ్దానాలన్నిటికీ యేసు “ఆమేన్‌” అన్నట్లుగా ఉన్నాడు. ఆయన భూమ్మీద ఎలాంటి తప్పుచేయకుండా జీవించి తన ప్రాణాన్ని బలిగా అర్పించడం ద్వారా యెహోవా దేవుని వాగ్దానాలన్నీ నెరవేరుతాయని నిరూపించాడు. అవి నెరవేరేందుకు మార్గం తెరిచాడు. అంతేకాక, యేసు నమ్మకంగా ఉండడం ద్వారా యోబు గ్రంథంలో రాయబడినట్లు కష్టాలు, బాధలు, పరీక్షలు ఎదుర్కొన్నప్పుడు దేవుని సేవకులు ఆయనను తిరస్కరిస్తారని సాతాను చేసిన వాదన తప్పని నిరూపించాడు. (యోబు 1:​6-12; 2:​2-7) దేవుని సృష్టి అంతటిలో మొదటి కుమారుడు మాత్రమే సాతాను వేసిన ఆ నిందకు తిరుగులేని జవాబివ్వగలడు. అంతేకాక, యెహోవా విశ్వ సర్వాధిపత్యానికి సంబంధించిన ప్రాముఖ్యమైన వివాదాంశం విషయానికొస్తే ఆయన తన తండ్రిని సమర్థించే విధంగా జీవించి అది సరైనదని చక్కగా నిరూపించాడు.

10 “ఆమేన్‌” అనే ప్రత్యేక పాత్రలో యేసు ఉంచిన మాదిరిని మనం ఎలా అనుకరించవచ్చు? యెహోవాకు నమ్మకంగా ఉంటూ, ఆయన సర్వాధిపత్యాన్ని సమర్థించడం ద్వారా మనం ఆయనను అనుకరించవచ్చు. అలా చేస్తే మనం సామెతలు 27:11లో, “నా కుమారుడా, జ్ఞానమును సంపాదించి నా హృదయమును సంతోషపరచుము అప్పుడు నన్ను నిందించువారితో నేను ధైర్యముగా మాటలాడుదును” అని యెహోవా చేసిన అభ్యర్థనకు అనుకూలంగా స్పందిస్తాం.

“క్రొత్తనిబంధనకు మధ్యవర్తి”

111 తిమోతి 2:​5, 6 చదవండి. యేసు ‘ఒక్కడే దేవునికీ, నరులకూ మధ్యవర్తి.’ ఆయన “క్రొత్తనిబంధనకు మధ్యవర్తి.” (హెబ్రీ. 9:​15; 12:​24) మోషే కూడ మధ్యవర్తే అని లేఖనాలు చెబుతున్నాయి. అయితే, ఆయన ధర్మశాస్త్రానికి మధ్యవర్తి. (గల. 3:​19) అలాంటప్పుడు, మధ్యవర్తిగా యేసు నిర్వర్తించే పాత్ర ఎలా ప్రత్యేకమైనది?

12 మూల భాషలో “మధ్యవర్తి”ని వర్ణించేందుకు న్యాయశాస్త్రానికి సంబంధించిన పదం ఉపయోగించబడింది. యేసు కొత్త నిబంధనకు చట్టబద్ధమైన మధ్యవర్తి అని ఆ పదం సూచిస్తోంది. ఆ కొత్త నిబంధనవల్ల కొత్త జనాంగమైన “దేవుని ఇశ్రాయేలు” ఉనికిలోకి వచ్చింది. (గల. 6:​16) ఆ జనాంగంలో ఆత్మాభిషిక్త క్రైస్తవులున్నారు. వారు పరలోకంలో “రాజులైన యాజకసమూహము”గా ఏర్పడతారు. (1 పేతు. 2:⁠9; నిర్గ. 19:⁠6) ధర్మశాస్త్ర నిబంధన మధ్యవర్తిగా మోషే అలాంటి జనాంగాన్ని తీసుకురాలేకపోయాడు.

13 మధ్యవర్తిగా యేసు ఎలాంటి పాత్ర పోషిస్తాడు? కొత్త నిబంధనలోకి వచ్చేవారికి యేసు రక్త విలువను యెహోవా అన్వయింపజేస్తాడు. అలా యెహోవా చట్టబద్ధంగా వారిని నీతిమంతులుగా తీరుస్తాడు. (రోమా. 3:​24; హెబ్రీ. 9:​15) వారు పరలోకంలో రాజులుగా యాజకులుగా పరిపాలించేలా కొత్త నిబంధనలోకి వచ్చేందుకు అప్పుడే వారిని అర్హులుగా పరిగణించగలుగుతాడు! దేవునితో మంచి సంబంధం కలిగివుండేలా వారి మధ్యవర్తిగా యేసు వారికి ‘సహాయం’ చేస్తాడు.​—⁠హెబ్రీ. 2:​16, ఈజీ-టు-రీడ్‌ వర్షన్‌.

14 కొత్త నిబంధనలో లేనివారి విషయం అంటే పరలోకంలో కాకుండ భూమ్మీద నిరంతరం జీవించే అవకాశమున్నవారి విషయం ఏమిటి? వారు కొత్త నిబంధనలో భాగస్థులు కాకపోయినా, వారు దాని నుండి ప్రయోజనం పొందుతారు. వారి పాపాలు క్షమించబడడమే కాక, దేవుని స్నేహితులుగా వారు నీతిమంతులుగా తీర్చబడ్డారు. (యాకో. 2:​23; ​1 యోహా. 2:​1, 2) మనకు పరలోకానికి వెళ్లే అవకాశమున్నా లేదా భూమ్మీద జీవించే అవకాశమున్నా కొత్త నిబంధనకు మధ్యవర్తిగా యేసు పాత్రను గౌరవించేందుకు మనందరికీ ఎన్నో కారణాలున్నాయి.

“ప్రధానయాజకుడు”

15 గతంలో ఎంతోమంది ప్రధానయాజకులుగా సేవచేసినా, ఆ స్థానంలో యేసు పాత్ర ఎంతో ప్రత్యేకమైనది. ఎలా? పౌలు ఇలా వివరిస్తున్నాడు: “ధర్మశాస్త్రము బలహీనతగల మనుష్యులను యాజకులనుగా నియమించును గాని ధర్మశాస్త్రమునకు తరువాత వచ్చిన ప్రమాణపూర్వకమైన వాక్యము నిరంతరమును సంపూర్ణసిద్ధిపొందిన కుమారుని నియమించెను గనుక, ఈయన ఆ ప్రధానయాజకులవలె మొదట తన సొంత పాపముల కొరకు తరువాత ప్రజల పాపములకొరకును దినదినము బలులను అర్పింపవలసిన అవసరము గలవాడు కాడు; తన్నుతాను అర్పించు కొన్నప్పుడు ఒక్కసారే యీ పనిచేసి ముగించెను.”​​—⁠హెబ్రీ. 7:​27, 28. *

16 పాపం చేయకముందు ఆదాము పరిపూర్ణుడు. యేసు కూడ అలాంటి పరిపూర్ణతతోనే భూమ్మీదకు వచ్చాడు. (1 కొరిం. 15:​45) అందుకే ఆయన మాత్రమే మళ్లీ బలి అర్పించాల్సిన అవసరం లేని విధంగా పరిపూర్ణమైన, సంపూర్ణమైన బలిని అర్పించగలడు. మోషే ధర్మశాస్త్రం అమలులో ఉన్నప్పుడు ప్రతీరోజు బలులను అర్పించేవారు. అయితే, ఆ బలులూ, యాజక సేవలూ యేసు చేసే కార్యాలకు ఛాయగా మాత్రమే ఉన్నాయి. (హెబ్రీ. 8:⁠5; 10:⁠1) ఆయన ఇతర ప్రధానయాజకులకన్నా ఎక్కువ చేయగలగడమేకాక శాశ్వతంగా ఆ స్థానంలో ఉండగలడు కాబట్టి, ప్రధానయాజకునిగా ఆయన స్థానం ప్రత్యేకమైనది.

17 మనం దేవుని ముందు మంచి పేరు కలిగివుండాలంటే ప్రధానయాజకునిగా యేసు సేవలు మనకు అవసరం. మనకు ఎంత మంచి ప్రధానయాజకుడున్నాడు! “మన ప్రధానయాజకుడు మన బలహీనతలయందు మనతో సహానుభవము లేనివాడు కాడు గాని, సమస్త విషయములలోను మనవలెనే శోధింపబడినను, ఆయన పాపము లేనివాడుగా ఉండెను” అని పౌలు రాశాడు. (హెబ్రీ. 4:​15) కృతజ్ఞతాభావంతో దాన్ని గుర్తిస్తే మనం ‘మనకోసం కాక, మన నిమిత్తము మృతిపొందినవాని కోసం జీవిస్తాం.’​—⁠2 కొరిం. 5:​14, 15; లూకా 9:⁠23.

ప్రవచించబడిన “సంతానము”

18 ఏదెను తోటలో మానవులు సమస్తాన్ని అంటే దేవునితో మంచి సంబంధాన్ని, నిరంతర జీవితాన్ని, సంతోషాన్ని, పరదైసును కోల్పోయినట్లు కనిపించినప్పుడు యెహోవా దేవుడు విమోచనకర్త గురించి ప్రవచించాడు. బైబిల్లో ఆ విమోచనకర్త “సంతానము”గా ప్రస్తావించబడ్డాడు. (ఆది. 3:​15) ఎన్నో శతాబ్దాలుగా మర్మంగా ఉన్న ఆ సంతానం అనేక బైబిలు ప్రవచనాల్లో ముఖ్యాంశమైంది. ఆ సంతానం అబ్రాహాము, ఇస్సాకు, యాకోబు వంశం నుండి రావాల్సివుందనీ, దావీదు రాజు వంశానికి చెందినవాడై ఉండాలని ఆ తర్వాత చెప్పబడింది.​—⁠ఆది. 21:​12; 22:​16-18; 28:​14; 2 సమూ. 7:​12-16.

19 వాగ్దానం చేయబడిన ఈ సంతానం ఎవరు? ఈ ప్రశ్నకు జవాబు గలతీయులు 3:16లో (చదవండి.) ఉంది. అయితే, అదే అధ్యాయంలో అపొస్తలుడైన పౌలు అభిషిక్త క్రైస్తవులకు ఇలా చెప్పాడు: “మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రాహాముయొక్క సంతానమైయుండి వాగ్దానప్రకారము వారసులైయున్నారు.” (గల. 3:​29) క్రీస్తు ఆ వాగ్దాన సంతానమైతే ఆయనతోపాటు మరికొందరు ఎలా భాగస్థులౌతారు?

20 లక్షలాదిమంది తాము అబ్రాహాము సంతానమని చెప్పుకున్నారు. కొందరైతే తాము నిజంగానే ప్రవక్తలమన్నట్లు ప్రవర్తించారు. కొన్ని మతాలు తమ ప్రవక్తలు అబ్రాహాము వంశం నుండి వచ్చారని చెప్పుకోవడానికే ప్రాముఖ్యతనిస్తారు. అయితే వారందరూ వాగ్దాన సంతానమా? లేదు. అపొస్తలుడైన పౌలు దైవ ప్రేరణతో చెప్పినట్లు, అబ్రాహాము వంశం నుండి వచ్చినవారందరూ వాగ్దాన సంతానమని చెప్పుకోలేరు. మానవులను ఆశీర్వదించడానికి దేవుడు అబ్రాహాము ఇతర కుమారుల సంతానాన్ని ఉపయోగించలేదు. ఆశీర్వదించబడిన సంతానం ఇస్సాకు వంశం నుండే రావాలి. (హెబ్రీ. 11:​17, 18) ప్రవచించబడిన సంతానంలో ప్రథమభాగం అబ్రాహాము సంతానం నుండి వచ్చిన యేసుక్రీస్తే అని చివరకు తేలింది. ఆయన వంశావళి బైబిల్లో రాయబడింది. * ఇతరులు ‘క్రీస్తు సంబంధులు’ కాబట్టి వారు ఆ తర్వాత అబ్రాహాము సంతానంలో రెండవ భాగమయ్యారు. ఈ ప్రవచనాన్ని నెరవేర్చడంలో యేసు పాత్ర నిజంగానే ప్రత్యేకమైనది.

21 యెహోవా సంకల్పంలో యేసుకున్న ప్రత్యేక పాత్రను క్లుప్తంగా చర్చించిన తర్వాత మనం ఏమి నేర్చుకున్నాం? దేవుని అద్వితీయ కుమారుడు సృష్టించబడినప్పటి నుండి ఎంతో ప్రత్యేకమైన వ్యక్తి. అయితే, ఆ తర్వాత యేసుగా మారిన ఆ ప్రత్యేకమైన కుమారుడు తన సొంత మహిమకోసం ఎప్పుడూ ప్రయత్నించలేదు. కానీ అన్ని సందర్భాల్లో తన తండ్రి ఇష్టప్రకారం ప్రవర్తిస్తూ వినయంతో సేవచేశాడు. (యోహా. 5:​41; 8:​50) ఆయన మనకు ఎంత చక్కని మాదిరి! యేసులాగే మనం “సమస్తమును దేవుని మహిమకొరకు” చేయాలనే లక్ష్యాన్ని పెట్టుకుందాం.​—⁠1 కొరిం. 10:⁠31.

[అధస్సూచీలు]

^ పేరా 22 ఒక బైబిలు విద్వాంసుని ప్రకారం, “ఒక్కసారే” అని అనువదించబడిన పదం “యేసు నిజంగా మరణించాడని, ఆయన మరణం ప్రత్యేకమైనదని, అలాంటి అర్పణ ఎవరూ అర్పించలేదని తెలియజేసే” ప్రాముఖ్యమైన బైబిలు బోధను వివరిస్తుంది.

^ పేరా 28 సా.శ. మొదటి శతాబ్దంలోని యూదులు తాము అబ్రాహాము వంశావళి నుండి వచ్చాం కాబట్టి తమకు దేవుని అనుగ్రహముందని అనుకున్నప్పటికీ, వారు మెస్సీయ లేదా క్రీస్తు కోసం ఎదురుచూశారు.​—⁠యోహా. 1:​25; 7:​41, 42; 8:​39-41.

మీకు జ్ఞాపకమున్నాయా?

• యేసుకున్న బిరుదులను చర్చించిన తర్వాత ఆయన ప్రత్యేక పాత్ర గురించి మీరేమి తెలుసుకున్నారు? (బాక్సు చూడండి.)

• యెహోవా అద్వితీయ కుమారుని ఉదాహరణను మీరు ఎలా అనుకరించవచ్చు?

[అధ్యయన ప్రశ్నలు]

1, 2. దేవుని సంకల్పంలో యేసుకున్న ప్రత్యేక పాత్రను తెలుసుకునేందుకు మనం ఎందుకు ఇష్టపడాలి?

3, 4. (ఎ) అద్వితీయ కుమారునిగా యేసుకున్న పాత్ర ప్రత్యేకమైనదని మనం ఎలా చెప్పవచ్చు? (బి) సృష్టిని చేయడంలో యేసుకున్న పాత్ర ఎలా ప్రత్యేకమైనది?

5. యేసుకున్న ప్రత్యేకత గురించి లేఖనాలు ఏమి తెలియజేస్తున్నాయి?

6. యేసును “వాక్యము” అని పిలవడం ఎందుకు సరైనది?

7. ‘వాక్యంగా’ యేసు చూపించిన వినయాన్ని మనం ఎలా అనుసరించవచ్చు?

8, 9. (ఎ) “ఆమేన్‌” అనే పదానికి అర్థమేమిటి? యేసుకు ఆ పేరు ఎందుకుంది? (బి)  “ఆమేన్‌”గా తన పాత్రను యేసు ఎలా నెరవేర్చాడు?

10. “ఆమేన్‌” అనే ప్రత్యేక పాత్రలో యేసు ఉంచిన మాదిరిని మనం ఎలా అనుకరించవచ్చు?

11, 12. మధ్యవర్తిగా యేసు నిర్వర్తించే పాత్ర ఎలా ప్రత్యేకమైనది?

13. మధ్యవర్తిగా యేసు ఎలాంటి పాత్ర పోషిస్తాడు?

14. పరలోకంలో జీవించే అవకాశమున్నా, భూమ్మీద జీవించే అవకాశమున్నా క్రైస్తవులందరూ ఎందుకు మధ్యవర్తిగా యేసు పాత్రను ఎంతో గౌరవించాలి?

15. ప్రధానయాజకునిగా యేసుకున్న పాత్ర గతంలో ప్రధానయాజకులుగా సేవచేసినవారికి ఎలా భిన్నంగా ఉంది?

16. యేసు బలి ఎందుకు ఎంతో ప్రత్యేకమైనది?

17. మన ప్రధానయాజకునిగా యేసు పాత్రను మనం కృతజ్ఞతాభావంతో ఎందుకు గుర్తించాలి? దాన్ని ఎలా గుర్తించవచ్చు?

18. ఆదాము పాపం చేసిన తర్వాత ఏమని ప్రవచించబడింది? ఈ ప్రవచనానికి సంబంధించి తర్వాత ఏమి చెప్పబడింది?

19, 20. (ఎ) వాగ్దాన సంతానం ఎవరు? (బి) వాగ్దాన సంతానంలో యేసుతోపాటు మరికొందరు ఉన్నారని ఎందుకు చెప్పవచ్చు?

21. యెహోవా సంకల్పానికి సంబంధించి తనకున్న ప్రత్యేక పాత్రను యేసు నిర్వర్తించిన విధానంలో మీకు ఏది నచ్చింది?

[15వ పేజీలోని బాక్సు/చిత్రం]

దేవుని సంకల్పంలో యేసు ప్రత్యేక పాత్రను వివరించే కొన్ని బిరుదులు

అద్వితీయ కుమారుడు. (యోహా. 1:⁠3) యేసు ఒక్కడే దేవుని స్వహస్తాలతో సృష్టించబడ్డాడు.

వాక్యం. (యోహా. 1:​14) ఇతర ప్రాణులకు సమాచారాన్ని, మార్గనిర్దేశాలను ఇవ్వడానికి యెహోవా తన కుమారుణ్ణి ఒక ప్రతినిధిగా ఉపయోగించుకున్నాడు.

ఆమేన్‌. (ప్రక. 3:​14) యేసు భూమ్మీద ఎలాంటి తప్పుచేయకుండా జీవించి తన ప్రాణాన్ని బలిగా అర్పించడంద్వారా యెహోవా దేవుని వాగ్దానాలన్నీ నెరవేరుతాయని నిరూపించాడు. అవి నెరవేరేందుకు మార్గం తెరిచాడు.

కొత్తనిబంధనకు మధ్యవర్తి. (1 తిమో. 2:​5, 6) చట్టబద్ధమైన మధ్యవర్తిగా యేసు కొత్త జనాంగమైన “దేవుని ఇశ్రాయేలు”ను ఉనికిలోకి తీసుకువచ్చాడు. పరలోకంలో “రాజులైన యాజకసమూహము”గా ఏర్పడే ఆత్మాభిషిక్త క్రైస్తవులు ఆ జనాంగంలో ఉన్నారు.​—⁠గల. 6:​16; 1 పేతు. 2:⁠9.

ప్రధానయాజకుడు. (హెబ్రీ. 7:​27, 28) మళ్లీ బలి అర్పించాల్సిన అవసరంలేని విధంగా పరిపూర్ణమైన బలిని యేసు మాత్రమే అర్పించగలిగాడు. ఆయన మన పాపాలను కడిగివేసి, దానివల్ల వచ్చే మరణాన్ని ​తీసివేయగలడు.

వాగ్దానంచేయబడిన సంతానం. (ఆది. 3:​15) యేసుక్రీస్తు ఒక్కడే ప్రవచించబడిన సంతానంలోని ప్రథమ భాగం. ఆ తర్వాత అబ్రాహాము సంతానంలోకి రెండవ భాగంగా వచ్చిన ఇతరులు “క్రీస్తు సంబంధులు.”​—⁠గల. 3:​29.