కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

యోబు యెహోవా నామాన్ని ఘనపర్చాడు

యోబు యెహోవా నామాన్ని ఘనపర్చాడు

యోబు యెహోవా నామాన్ని ఘనపర్చాడు

“యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక.”​—⁠యోబు 1:⁠21.

ఫరో తనను చంపుతాడని తెలుసుకున్న మోషే ఐగుప్తు దేశం నుండి తప్పించుకొని మిద్యానుకు వెళ్లాడు. అప్పుడు ఆయనకు దాదాపు 40 ఏళ్లు. (అపొ. 7:23) ఆయన అక్కడ ఉన్నప్పుడే సమీప ఊజు దేశంలో నివసిస్తున్న యోబుకు ఎదురైన పరీక్షల గురించి వినుంటాడు. కొన్నేళ్ల తర్వాత అంటే ఇశ్రాయేలీయులను నడిపిస్తూ ఊజు దేశానికి సమీపంలో ఉన్న ప్రదేశానికి మోషే వచ్చినప్పుడు యోబు జీవితంలోని చివరి రోజుల గురించి తెలుసుకొనివుంటాడు. అప్పుడు అరణ్యంలో ప్రయాణం చేస్తున్న ఇశ్రాయేలీయులు వాగ్దాన దేశానికి దగ్గర్లో ఉన్నారు. యూదుల నమ్మకాల ప్రకారం, యోబు గ్రంథాన్ని యోబు మరణించిన కొంతకాలానికి మోషే రాశాడు.

2 యోబు గ్రంథం మనకాలంలోని దేవుని సేవకుల విశ్వాసాన్ని బలపరుస్తోంది. ఏయే విధాలుగా బలపరుస్తోంది? ఈ గ్రంథంవల్ల మనం పరలోకంలో జరిగిన అతి ప్రాముఖ్యమైన సంఘటనలను అర్థం చేసుకోగలుగుతాం, దేవుని విశ్వసర్వాధిపత్యానికి సంబంధించిన అత్యంత ప్రాముఖ్యమైన వివాదాంశానికున్న ప్రాధాన్యతను తెలుసుకోగలుగుతాం. అంతేకాక, ఈ గ్రంథాన్ని అధ్యయనం చేస్తే దేవునికి యథార్థంగా ఉండాలంటే ఏమి చేయాలో బాగా అర్థం చేసుకోగలుగుతాం. శ్రమలు అనుభవించేందుకు కొన్నిసార్లు యెహోవా తన సేవకులను ఎందుకు అనుమతిస్తాడో గ్రహించగలుగుతాం. అపవాది అయిన సాతానే యెహోవా ప్రధాన శత్రువు, మానవుల విరోధి అని అది చూపిస్తోంది. తీవ్ర పరీక్షలు ఎదురైనా యోబులాంటి అపరిపూర్ణ మానవులు యెహోవాకు యథార్థంగా ఉండగలరని కూడ ఈ గ్రంథం చూపిస్తోంది. దానిలో వివరించబడిన కొన్ని సంఘటనలను మనం ఇప్పుడు చూద్దాం.

యోబును పరీక్షించిన సాతాను

3 యోబు ధనవంతుడు, పలుకుబడివున్న వ్యక్తి, మంచి నాయకత్వం వహించిన కుటుంబ పెద్ద. ఆయన సలహాకు ప్రజలు ఎంతో ప్రాముఖ్యతనిచ్చేవారు, ఆయన కష్టాల్లో ఉన్నవారిని ఆదుకొనేవాడు. అన్నింటికన్నా ప్రాముఖ్యంగా, యోబు దేవునిపట్ల భయభక్తులు కలిగిన వ్యక్తి. ఆయన ‘యథార్థవర్తనుడు, న్యాయవంతుడు, దేవునిపట్ల భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించినవాడు’ అని బైబిలు చెబుతోంది. యోబుకున్న సంపద, పలుకుబడినిబట్టి కాక ఆయనకున్న దైవభక్తినిబట్టి అపవాది అయిన సాతాను ఆయనమీద దాడిచేశాడు.​—⁠యోబు 1:1; 29:​7-16; 31:⁠1.

4 యోబు గ్రంథంలోని ప్రారంభ మాటలు పరలోకంలో జరిగిన ఓ సమావేశాన్ని వర్ణిస్తున్నాయి. దానికి దేవదూతలందరూ యెహోవా సన్నిధికి వచ్చారు. సాతాను కూడ వచ్చాడు. అతడు అక్కడ యోబుమీద నిందలువేశాడు. (యోబు 1:​6-11 చదవండి.) సాతాను యోబుకున్న ఆస్తి గురించి ప్రస్తావించినప్పటికీ ప్రధానంగా అతడు యోబు యథార్థతనే ప్రశ్నించాడు. “యథార్థత” అనే మాటకు నిజాయితీగా, నిందారహితంగా, నీతియుక్తంగా, నిష్కల్మషంగా ప్రవర్తించడం అనే అర్థాలున్నాయి. బైబిల్లో యథార్థత అనే మాట యెహోవాను హృదయపూర్వకంగా ఆరాధించడం అనే భావంతో ఉపయోగించబడింది.

5 యోబు దేవుణ్ణి యథార్థతతో కాక, స్వార్థంతో ఆరాధిస్తున్నాడని సాతాను ఆరోపించాడు. యోహోవా యోబును ఆశీర్వదించి, సంరక్షించినంతవరకు ఆయన దేవునికి యథార్థంగా ఉంటాడని సాతాను వాదించాడు. దానికి జవాబు ఇవ్వడానికి యెహోవా ఆ నమ్మకమైన వ్యక్తిమీద దాడిచేసేందుకు సాతానును అనుమతించాడు. దాంతో ఆయన పశువులు దొంగిలించబడ్డాయి లేదా నాశనంచేయబడ్డాయి, ఆయన సేవకులు చంపబడ్డారు, ఆయన పదిమంది పిల్లలు చనిపోయారు. ఒక్కరోజులోనే ఈ వార్తలన్నీ యోబు విన్నాడు. (యోబు 1:​13-19) సాతాను దాడికి యోబు తన యథార్థతను కోల్పోయాడా? తనకు నష్టం జరిగినప్పుడు యోబు ఇలా అన్నాడని బైబిలు చెబుతోంది: “యెహోవా ఇచ్చెను యెహోవా తీసికొని పోయెను, యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక.”​—⁠యోబు 1:⁠21.

6 ఆ తర్వాత పరలోకంలో మరో సమావేశం జరిగింది. సాతాను యోబుమీద మళ్లీ నిందలు వేస్తూ ఇలా అన్నాడు: “చర్మము కాపాడుకొనుటకై చర్మమును, తన ప్రాణమును కాపాడుకొనుటకై తనకు కలిగినది యావత్తును నరుడిచ్చును గదా. ఇంకొకసారి నీవు చేయి చాపి అతని యెముకను అతని దేహమును మొత్తినయెడల అతడు నీ ముఖము ఎదుటనే దూషించి నిన్ను విడిచి పోవును.” సాతాను యోబునే కాక ఇతరులను కూడ నిందించాడన్న విషయాన్ని గమనించండి. “తన ప్రాణమును కాపాడుకొనుటకై తనకు కలిగినది యావత్తును నరుడిచ్చును గదా” అని చెప్పడం ద్వారా అపవాది యోబు యథార్థతనే కాక, యెహోవాను ఆరాధించే ‘నరులందరి’ యథార్థతను ప్రశ్నించాడు. ఆ తర్వాత, యోబును బాధాకరమైన వ్యాధితో మొత్తేందుకు దేవుడు సాతానును అనుమతించాడు. (యోబు 2:​1-8) అయితే, యోబుకు ఎదురైన పరీక్షలు అంతటితో ఆగిపోలేదు.

యోబు ప్రవర్తించిన తీరు నుండి మనం ఏమి నేర్చుకోవచ్చు?

7 ప్రారంభంలో యోబుకు వచ్చినన్ని కష్టాలు ఆయన భార్యకూ వచ్చాయి. తమ పిల్లలు మరణించడాన్ని, తాము ఆస్తి కోల్పోవడాన్ని చూసి ఆమె ఎంతో బాధపడివుంటుంది. బాధాకరమైన వ్యాధితో తన భర్త పడుతున్న యాతనను చూసి ఆమె ఎంతో నొచ్చుకొనివుంటుంది. అందుకే ఆమె యోబుతో, “నీవు ఇంకను యథార్థతను వదలకయుందువా? దేవుని దూషించి మరణము కమ్ము” అని యోబుతో అంది. ఆ తర్వాత యోబును ఓదార్చడానికి ఎలీఫజు, బిల్దదు, జోఫరు అనే ముగ్గురు స్నేహితులు వచ్చారు. వారు ఆయనను ఓదార్చే బదులు మోసపూరితంగా తర్కించి తాము ‘బాధకే కర్తలుగాని ఆదరణకు కర్తలుకారు’ అని రుజువుచేసుకున్నారు. ఉదాహరణకు, యోబు పిల్లలు తప్పుచేశారు కాబట్టే వారికలా జరిగిందని బిల్దదు అన్నాడు. యోబు గతంలో చేసిన పాపాలకు శిక్ష అనుభవిస్తున్నాడని ఎలీఫజు పరోక్షంగా చెప్పాడు. అంతేకాక, యథార్థవంతులవల్ల దేవునికి ఏమైనా ప్రయోజనముందా అని ఆయన ప్రశ్నించాడు. (యోబు 2:​9, 11; 4:8; 8:4; 16:2; 22:​2, 3) అంత తీవ్రమైన ఒత్తిడి ఎదురైనా యోబు తన యథార్థతను కాపాడుకున్నాడు. నిజమే, ‘దేవునికన్నా తానే నీతిమంతుడైనట్లు చెప్పుకొని’ ఆయన తప్పుచేశాడు. (యోబు 32:⁠2) అయినా, ఆయన తన పరీక్షలన్నిటిలో దేవునికి నమ్మకంగా ఉన్నాడు.

8 ఆ తర్వాత యోబును చూడడానికి వచ్చిన ఏలీహు గురించి మనం చదువుతాం. మొదట ఆయన యోబు, ఆయన ముగ్గురు స్నేహితుల వాదనలను విన్నాడు. ఆయన ఆ నలుగురికన్నా చిన్నవాడైనప్పటికీ ఎంతో వివేకంతో ప్రవర్తించాడు. ఆయన యోబుకు గౌరవాన్నిస్తూ మాట్లాడాడు. యోబు నీతియుక్తంగా ప్రవర్తించాడని ఆయనను మెచ్చుకున్నాడు. అయితే, తాను ఎలాంటి తప్పూచేయలేదని నిరూపించుకోవడానికే యోబు ఎక్కువగా ప్రయత్నించాడని కూడ ఏలీహు చెప్పాడు. ఆ తర్వాత, దేవుణ్ణి నమ్మకంగా సేవించడం ఎల్లప్పుడు ప్రయోజనకరమేనని ఆయన యోబుకు అభయాన్నిచ్చాడు. (యోబు 36:​1, 11 చదవండి.) మనకాలంలో ఇతరులకు ఉపదేశమిచ్చేవారికి ఆయన ఎంత చక్కని మాదిరి! ఏలీహు ఓపికతో యోబు చెప్పినవన్నీ శ్రద్ధగా విన్నాడు. యోబులోవున్న మంచి గుణాలను మెచ్చుకొని, ఆయనకు ప్రోత్సాహాన్నిచ్చే ఉపదేశాన్నిచ్చాడు.​—⁠యోబు 32:6; 33:⁠32.

9 చివరగా, యెహోవా యోబుతో మాట్లాడినప్పుడు ఆయనకు అద్భుతమైన అనుభవం ఎదురైంది! “యెహోవా సుడిగాలిలోనుండి ఈలాగున యోబునకు ప్రత్యుత్తరమిచ్చెను” అని బైబిలు చెబుతోంది. యెహోవా యోబును వరుసగా ప్రశ్నలడుగుతూ ఆయనకున్న తప్పుడు అభిప్రాయాన్ని దయతో సరిదిద్దాడు. యోబు ఇష్టపూర్వకంగా ఆ దిద్దుబాటును అంగీకరించి, ఇలా ఒప్పుకున్నాడు: “నేను నీచుడను . . . ధూళిలోను బూడిదెలోను పడి పశ్చాత్తాపపడుచున్నాను.” యోబు ముగ్గురు స్నేహితులు “యుక్తమైనది పలుకలేదు” కాబట్టి యెహోవా యోబుతో మాట్లాడిన తర్వాత వారిని కోపగించుకున్నాడు. ఆ తర్వాత వారికోసం ప్రార్థించమని యెహోవా యోబుకు చెప్పాడు. “యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమస్థితిని మరల అతనికి దయచేసెను. మరియు యోబునకు పూర్వము కలిగిన దానికంటె రెండంతలు అధికముగా యెహోవా అతనికి దయచేసెను.”​—⁠యోబు 38:1; 40:4; 42:​6-10.

మనం యెహోవాను ఎంత గాఢంగా ప్రేమిస్తున్నాం?

10 యెహోవా విశ్వానికి సృష్టికర్త, సర్వాధిపతి. అలాంటప్పుడు ఆయన అపవాది నిందను పట్టించుకోకుండా ఉండాల్సింది కదా? సాతానును పట్టించుకోకుండా ఉన్నా లేదా అతణ్ణి నాశనం చేసినా అతడు లేవదీసిన వివాదాంశం పరిష్కారమయ్యేది కాదని దేవునికి తెలుసు. యెహోవాకు యథార్థంగా సేవచేసిన యోబు ఆర్థిక పరిస్థితి క్షీణిస్తే ఆయన యెహోవాను విడిచిపెడతాడని అపవాది ఆరోపించాడు. పరీక్షలు ఎదురైనా యోబు యథార్థంగా ఉన్నాడు. శారీరక బాధలను ఎదుర్కొంటే ఏ మానవుడైనా దేవునికి దూరమౌతాడని సాతాను ఆ తర్వాత వాదించాడు. యోబు బాధలను అనుభవించినా సాతాను వాదించినట్లు తన యథార్థతనైతే కోల్పోలేదు. యోబు అపరిపూర్ణుడైనప్పటికీ దేవునికి నమ్మకంగా ఉన్నాడు. అలా ఆ దేవుని సేవకుని విషయంలో సాతాను అబద్ధికుడని నిరూపించబడ్డాడు. దేవుని ఇతర సేవకుల విషయమేమిటి?

11 సాతాను ఎలాంటి కష్టాలు తీసుకొచ్చినా యథార్థంగా ఉండడం ద్వారా ప్రతీ యెహోవా సేవకుడూ ఆ క్రూరుడైన శత్రువు చేసిన ఆరోపణలు తన విషయంలో తప్పని నిరూపిస్తాడు. యేసు భూమ్మీదకు వచ్చి సాతాను అబద్ధికుడని స్పష్టంగా నిరూపించాడు. ఆయన మన మొదటి తండ్రియైన ఆదాములా పరిపూర్ణుడు. ఆయన తన మరణంవరకు నమ్మకంగా ఉండడం ద్వారా సాతాను అబద్ధికుడనీ అతడి ఆరోపణలు తప్పనీ తిరుగులేని విధంగా నిరూపించాడు.​—⁠ప్రక. 12:⁠10.

12 అయినా, సాతాను యెహోవా ఆరాధకులను పరీక్షిస్తూనే ఉంటాడు. యథార్థంగా ఉండడం ద్వారా మనం యెహోవాను స్వార్థంతోకాక ప్రేమతో ఆరాధిస్తున్నామని చూపించే అవకాశం మనలో ప్రతీ ఒక్కరికీ ఉంది, అలా చూపించడం మనందరి బాధ్యత కూడ. ఆ బాధ్యతను మనం ఎలా పరిగణిస్తాం? దాన్ని మనకు లభించిన గౌరవంగా పరిగణిస్తాం. అంతేకాక, పరీక్షలను సహించేందుకు కావాల్సిన శక్తి యెహోవా మనకు ఇస్తాడనీ యోబు విషయంలో జరిగినట్లే యెహోవా వాటికి పరిమితులు పెడతాడనీ తెలుసుకొని మనం ఓదార్పుపొందుతాం.​—⁠1 కొరిం. 10:⁠13.

తిరుగుబాటుదారుడగు శత్రువూ విశ్వాసఘాతకుడూ అయిన సాతాను

13 యెహోవాను సవాలు చేయడంలో, మానవులను పక్కదారి పట్టించడంలో సాతాను సిగ్గుకరమైన పాత్ర గురించి హెబ్రీ లేఖనాలు చెబుతున్నాయి. సాతాను యెహోవాను ఏయే విధాలుగా వ్యతిరేకించాడనే దాని గురించి క్రైస్తవ గ్రీకు లేఖనాల్లో మరింత సమాచారముంది. యెహోవా సర్వాధిపత్యం సరైనదని నిరూపించబడి, సాతాను శాశ్వతంగా నాశనం చేయబడతాడని ప్రకటన గ్రంథం చెబుతోంది. యోబు పుస్తకం నుండి సాతాను తిరుగుబాటు స్వభావం గురించి మరింత తెలుసుకుంటాం. యెహోవాను స్తుతించాలనే ఉద్దేశంతో సాతాను పరలోకంలో జరిగిన సమావేశాలకు వెళ్లలేదు. క్రూరమైన, హానికరమైన ఉద్దేశాలతోనే అతడు అక్కడికి వెళ్లి, యోబుమీద ఆరోపణలు చేశాడు. యోబును పరీక్షించడానికి అనుమతి పొందిన తర్వాత సాతాను, “యెహోవా సన్నిధినుండి బయలు వెళ్లెను.”​—⁠యోబు 1:12; 2:⁠7.

14 అందుకే, సాతాను మానవులకు వ్యతిరేకంగా ఉన్న క్రూరుడైన శత్రువు అని యోబు గ్రంథం వివరిస్తోంది. యోబు 1:6లో ప్రస్తావించబడిన సమావేశానికీ యోబు 2:1లో ప్రస్తావించబడిన సమావేశానికీ మధ్య ఎంతకాలం గడిచిందో మనకు తెలియదు. ఆ మధ్యకాలంలో యోబు క్రూరంగా పరీక్షించబడ్డాడు. యోబు నమ్మకంగా ఉన్నాడు కాబట్టే యెహోవా సాతానుతో “నిష్కారణముగా అతనిని పాడుచేయుటకు నీవు నన్ను ప్రేరేపించినను అతడు [యోబును] ఇంకను తన యథార్థతను వదలక నిలకడగా నున్నాడు” అని చెప్పాడు. అయినా, యోబుమీద తాను చేసిన ఆరోపణలు తప్పని సాతాను ఒప్పుకోలేదు. బదులుగా, మరో తీవ్రమైన పరీక్షను యోబు ఎదుర్కొనేందుకు అనుమతించాలని పట్టుబట్టాడు. అలా యోబును అటు ధనవంతునిగా ఉన్నప్పుడూ ఇటు దిక్కులేనివానిగా ఉన్నప్పుడూ అపవాది పరీక్షించాడు. చివరకు పేదవారిపట్ల, విపత్తులను ఎదుర్కొన్నవారిపట్ల కూడా సాతానుకు కనికరంలేదని దీన్నిబట్టి తెలుస్తుంది. అతడికి యథార్థవంతులంటే ఇష్టంలేదు. (యోబు 2:​3-5) ఏదేమైనా, యోబు నమ్మకంగా ఉండడం ద్వారా సాతాను అబద్ధికుడని నిరూపించాడు.

15 విశ్వాసఘాతకుడిగా మారిన మొదటి వ్యక్తి సాతానే. మనకాలంలో మతభ్రష్టులు కూడ అపవాదిలాగే ప్రవర్తిస్తున్నారు. సంఘంలోనివారిపట్ల, క్రైస్తవ పెద్దలపట్ల, పరిపాలక సభపట్ల విమర్శనాత్మక ధోరణిని పెంపొందించుకొని వారు తమ మనసులను విషపూరితం చేసుకొనివుండవచ్చు. కొంతమంది మతభ్రష్టులు యెహోవా దేవుని పేరు ఉపయోగించకూడదని వాదిస్తారు. వారు యెహోవా గురించి తెలుసుకోవడానికి గానీ ఆయనను సేవించడానికి గానీ ఇష్టపడరు. తమ తండ్రియైన సాతానులా వారు యథార్థవంతులను తమ లక్ష్యంగా చేసుకుంటారు. (యోహా. 8:44) అందుకే యెహోవా సేవకులు అలాంటి వారికి దూరంగా ఉంటారు!​—⁠2 యోహా. 10, 11.

యోబు యెహోవా నామాన్ని ఘనపర్చాడు

16 యోబు యెహోవా నామాన్ని ఉపయోగించి దాన్ని ఘనపర్చాడు. తన పిల్లల మరణవార్త ఆయనను కలచివేసినా దేవుణ్ణి నిందించలేదు. అయితే, యోబు దేవుడే తనకు నష్టం కలుగజేశాడని తప్పుగా మాట్లాడినా, యెహోవా నామాన్నైతే ఘనపర్చాడు. యోబు ఉపమాన రీతిలో చెప్పిన ఒకానొక మాట ఇలా ఉంది: ‘యెహోవాయందలి భయభక్తులే జ్ఞానము, దుష్టత్వము విడుచుటయే వివేకము.’​—⁠యోబు 28:⁠28.

17 యథార్థతను కాపాడుకోవడానికి యోబుకు ఏది సహాయం చేసింది? విపత్తులు ముంచుకురాకముందే ఆయన యెహోవాతో దగ్గరి సంబంధాన్ని ఏర్పరచుకున్నాడు. సాతాను యెహోవాను సవాలు చేశాడన్న విషయం యోబుకు తెలుసనడానికి ఏ రుజువులూ లేవు. ఆయనకు ఆ విషయం తెలియకపోయినా ఆయన మాత్రం చివరివరకు యథార్థంగా ఉండాలనుకున్నాడు. “మరణమగువరకు నేనెంతమాత్రమును యథార్థతను విడువను” అని ఆయన అన్నాడు. (యోబు 27:⁠5) యెహోవాతో అంత దగ్గరి సంబంధాన్ని యోబు ఎలా పెంచుకున్నాడు? తన దూరపు బంధువులైన అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులతో దేవుడు వ్యవహరించిన తీరు గురించి తాను విన్నదాన్ని ఆయన ఖచ్చితంగా గుర్తుంచుకొనివుంటాడు. అంతేకాక, సృష్టిని పరిశీలించడం ద్వారా యోబు యెహోవాకున్న అనేక లక్షణాలను గ్రహించివుంటాడు.​—⁠యోబు 12:​7-9, 13, 16 చదవండి.

18 యోబు వాటి గురించి తెలుసుకున్నప్పుడు యెహోవాను సంతోషపెట్టాలనే కోరిక ఆయనలో పుట్టింది. యెహోవా ఇష్టపడనిదేదైనా తన కుటుంబ సభ్యులు చేశారేమోనని లేదా ‘తమ హృదయాల్లో దేవుణ్ణి దూషించారేమోనని’ ఆయన క్రమంగా బలులు అర్పించేవాడు. (యోబు 1:⁠5) తీవ్రమైన పరీక్షలు ఎదురైనా యెహోవా గురించి ఆయన చెడుగా మాట్లాడలేదు. (యోబు 10:12) ఆయన ఎంత చక్కని మాదిరినుంచాడు! మనం కూడ యోహోవా గురించిన, ఆయన ఉద్దేశాల గురించిన ఖచ్చితమైన జ్ఞానాన్ని క్రమంగా సంపాదించుకోవాలి. దేవునితో మన సంబంధాన్ని బలపర్చుకునేందుకు బైబిలు అధ్యయనం చేయాలి, కూటాలకు హాజరుకావాలి, ప్రార్థించాలి, సువార్త ప్రకటించాలి. అంతేకాక, యెహోవా నామాన్ని ఇతరులకు తెలియజేయడానికి శాయశక్తులా కృషిచేయాలి. యెహోవా యోబు యథార్థతను చూసి సంతోషించినట్లే, నేడు తన సేవకుల యథార్థతను చూసి ఎంతో సంతోషిస్తాడు. దీని గురించి మనం తర్వాతి ఆర్టికల్‌లో చర్చిస్తాం.

మీకు జ్ఞాపకమున్నాయా?

• అపవాది అయిన సాతాను యోబును ఎందుకు లక్ష్యంగా చేసుకున్నాడు?

• యోబు ఏ పరీక్షలను సహించాడు? దానికి ఆయనెలా స్పందించాడు?

• యోబులా మనం యథార్థతను కాపాడుకోవాలంటే ఏమి చేయాలి?

• సాతాను గురించి యోబు గ్రంథం నుండి మనం ఏమి తెలుసుకోవచ్చు?

[అధ్యయన ప్రశ్నలు]

1. యోబు గ్రంథాన్ని ఎవరు రాసుంటారు? ఎప్పుడు రాసుంటారు?

2. యోబు గ్రంథం మన కాలంలోని యెహోవా సేవకుల విశ్వాసాన్ని ఏయే విధాలుగా బలపరుస్తోంది?

3. యోబు గురించి మనకు ఏమి తెలుసు? సాతాను ఆయనమీద ఎందుకు దాడిచేశాడు?

4. యథార్థత అంటే ఏమిటి?

5. యోబు గురించి సాతాను ఏమని ఆరోపించాడు?

6. (ఎ) పరలోకంలో దేవదూతలు మరోసారి సమావేశమైనప్పుడు ఏమి జరిగింది? (బి)  సాతాను ఎవరిని మనసులో ఉంచుకొని యెహోవాపట్ల యోబుకున్న యథార్థతను ప్రశ్నించాడు?

7. యోబు భార్య, ఆయనను చూడడానికి వచ్చిన స్నేహితులు ఆయన మీద ఏయే విధాలుగా ఒత్తిడి తీసుకువచ్చారు?

8. మన కాలంలో ఇతరులకు ఉపదేశమిచ్చేవారికి ఏలీహు ఎలాంటి మంచి మాదిరిని ఉంచాడు?

9. యెహోవా యోబుకు ఎలా సహాయం చేశాడు?

10. యెహోవా సాతాను నిందను ఎందుకు పరిగణలోకి తీసుకున్నాడు లేదా అతణ్ణి ఎందుకు నాశనం చేయలేదు?

11. సాతాను అబద్ధికుడని యేసు ఎలా స్పష్టంగా నిరూపించాడు?

12. ప్రతీ యెహోవా సేవకునికి ఏ అవకాశం, బాధ్యత ఉన్నాయి?

13. సాతాను గురించి యోబు గ్రంథం ఏమి చెబుతోంది?

14. సాతాను యోబు విషయంలో ఎలా వ్యవహరించాడు?

15. మనకాలంలోని మతభ్రష్టులు సాతానులా ఎలా ప్రవర్తిస్తున్నారు?

16. యెహోవా విషయంలో యోబు ఎలా ప్రవర్తించాడు?

17. తన యథార్థతను కాపాడుకోవడానికి యోబుకు ఏది సహాయం చేసింది?

18. (ఎ) తనకు యెహోవాను సంతోషపెట్టాలనే కోరికవుందని యోబు ఎలా చూపించాడు? (బి) మనం ఏయే విధాలుగా యోబు మంచి మాదిరిని అనుకరించవచ్చు?

[4వ పేజీలోని చిత్రం]

దేవుని విశ్వసర్వాధిపత్యానికి సంబంధించిన అత్యంత ప్రాముఖ్యమైన వివాదాంశం గురించి యోబు గ్రంథం మనకు తెలియజేస్తుంది

[6వ పేజీలోని చిత్రం]

ఎలాంటి పరిస్థితుల్లో మీ యథార్థత పరీక్షించబడవచ్చు?