కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

పరిపూర్ణ నాయకుడైన క్రీస్తును అనుసరించాలి

పరిపూర్ణ నాయకుడైన క్రీస్తును అనుసరించాలి

పరిపూర్ణ నాయకుడైన క్రీస్తును అనుసరించాలి

మానవ పరిపాలకులను అనుసరించే వాళ్లకు తరచూ నిరాశే ఎదురౌతుంది. దానికి భిన్నంగా, క్రీస్తు నాయకత్వానికి లోబడేవాళ్లకు దానివల్ల ఎంతో ప్రయోజనం ఉంటుంది. యేసు ఇలా చెప్పాడు, “ప్రయాసపడి భారము మోసికొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి; నేను మీకు విశ్రాంతి కలుగజేతును. నేను సాత్వికుడను దీనమనస్సు గలవాడను గనుక మీమీద నా కాడి ఎత్తికొని నాయొద్ద నేర్చుకొనుడి. అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరకును.” (మత్త. 11:28, 29) యేసు నాయకత్వం వల్ల సంతృప్తి, సంతోషం కలుగుతాయి. దీనుల మీద, పీడిత ప్రజల మీద ఆయనకు ఎంతో ఆసక్తి ఉంది, ఆయన వాళ్లను తన కాడి క్రిందికి రమ్మని ఆహ్వానిస్తున్నాడు. ఆయన కాడిని మోయడం ఎంతో సులువు. అయితే, యేసు నాయకత్వాన్ని అనుసరించాలంటే మనమేమి చేయాలి?

‘క్రీస్తు మీకొరకు బాధపడి, మీరు తన అడుగుజాడల్లో నడుచుకొనునట్లు మీకు మాదిరి ఉంచిపోయెను’ అని అపొస్తలుడైన పేతురు రాశాడు. (1 పేతు. 2:21) యేసు అడుగుజాడల్లో నడుచుకోవడం ఎంత ప్రాముఖ్యం? మందుపాతర్లు పెట్టిన స్థలాన్ని సురక్షితంగా ఎలా దాటి వెళ్లాలో మీ గుంపులో కేవలం ఒకే వ్యక్తికి తెలుసనుకోండి, అలాంటప్పుడు మీరు ఆ వ్యక్తి అడుగువేసిన చోటే జాగ్రత్తగా అడుగువేస్తూ ఆయన అడుగుజాడల్లో నడవాలనుకుంటారు కదా? అలాగే, యేసు మాదిరిని మన జీవితంలో ఎంత బాగా అనుసరించగలిగితే మన భవిష్యత్తు అంత సురక్షితంగా ఉంటుంది. దానికోసం మనం ఆయన చెప్పేది వినాలి, దాని ప్రకారం నడుచుకోవాలి, ఆయనకు ప్రాతినిధ్యం వహించేవాళ్లతో సహకరించాలి.

చెప్పేది వినండి, దాని ప్రకారం నడుచుకోండి

కొండమీది ప్రసంగం చివర్లో యేసు ఇలా చెప్పాడు, “ఈ నా మాటలు విని వాటిచొప్పున చేయు ప్రతివాడును బండమీద తన యిల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలియుండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ యింటిమీద కొట్టెను గాని దాని పునాది బండమీద వేయబడెను గనుక అది పడలేదు.”—మత్త. 7:24, 25.

తను చెప్పేది విని, దాని ప్రకారం నడుచుకునే వ్యక్తి ‘బుద్ధిమంతుడు’ అని యేసు అన్నాడు. మనం మనస్ఫూర్తిగా విధేయత చూపించడం ద్వారా క్రీస్తు మాదిరిని గౌరవిస్తున్నామనీ దానిని విలువైనదిగా ఎంచుతున్నామనీ చూపిస్తున్నామా లేదా యేసు ఇచ్చిన ఆజ్ఞల్లో సులువుగా, అనుకూలంగా ఉండేవాటిని మాత్రమే పాటించడానికి ఇష్టపడుతున్నామా? “[దేవునికి] ఇష్టమైన కార్యము నేనెల్లప్పుడును చేయుదును” అని యేసు చెప్పాడు. (యోహా. 8:29) మనందరం ఆయన మాదిరిని అనుసరించడానికి కృషిచేద్దాం.

మొదటి శతాబ్దంలో, క్రీస్తు నాయకత్వానికి లోబడే విషయంలో అపొస్తలులు మంచి మాదిరి ఉంచారు. ఒక సందర్భంలో పేతురు యేసుతో, “ఇదిగో, మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమి” అన్నాడు. (మార్కు 10:28) యేసు నాయకత్వాన్ని అపొస్తలులు ఎంత విలువైనదిగా ఎంచారంటే వాళ్లు ఆయనను అనుసరించడానికి మిగతా వాటిని ఇష్టపూర్వకంగా విడిచిపెట్టేశారు.—మత్త. 4:18-22.

క్రీస్తుకు ప్రాతినిధ్యం వహించేవాళ్లతో సహకరించండి

యేసు తన మరణానికి కొద్దికాలం ముందు, తన నాయకత్వానికి లోబడడానికి మరో మార్గం చెప్పాడు. ఆయన ఇలా అన్నాడు, “నేనెవని పంపుదునో వాని చేర్చుకొనువాడు నన్ను చేర్చుకొనువాడగును.” (యోహా. 13:20) యేసు తనకు ప్రాతినిధ్యం వహించే అభిషిక్తులను తన “సహోదరులు” అన్నాడు. (మత్త. 25:40) యేసు పునరుత్థానం చేయబడి పరలోకానికి వెళ్లిన తర్వాత, ఆయన “సహోదరులు” ఆయన స్థానంలో పనిచేయడానికి నియమించబడ్డారు. వాళ్లు ‘క్రీస్తుకు రాయబారులుగా’ పనిచేస్తూ యెహోవా దేవునితో సమాధానపడమని ఇతరులను ఆహ్వానిస్తున్నారు. (2 కొరిం. 5:18-20) మనం క్రీస్తు నాయకత్వానికి లోబడాలంటే ఆయన ‘సహోదరులకు’ లోబడాలి.

బైబిలు ఆధారంగా మనం ప్రచురించే ప్రచురణల్లో వచ్చే సమయానుకూలమైన లేఖన ఉపదేశాలకు ఎలా స్పందిస్తున్నామో పరిశీలించుకుంటే మంచిది. లేఖనాలను అధ్యయనం చేస్తున్నప్పుడు, సంఘ కూటాలకు హాజరైనప్పుడు క్రీస్తు మాటలు మనకు గుర్తు చేయబడతాయి. (2 పేతు. 3:1, 2) ఇలా అందించబడుతున్న ఆధ్యాత్మిక ఆహారాన్ని క్రమంగా తీసుకోవడం ద్వారా దాన్ని ఎంతో విలువైనదిగా ఎంచుతున్నామని చూపిస్తాం. అయితే, ఏదైనా ఒక ఉపదేశం అప్పుడప్పుడు మళ్లీమళ్లీ ఇవ్వబడుతుంటే దానికి మనం ఎలా స్పందించాలి? ఉదాహరణకు, “ప్రభువునందు మాత్రమే” పెళ్లి చేసుకోవాలని దేవుని వాక్యం క్రైస్తవులకు ఉపదేశిస్తోంది. (1 కొరిం. 7:39) వందకన్నా ఎక్కువ సంవత్సరాలుగా, ఈ అంశం కావలికోట పత్రికలో అప్పుడప్పుడు చర్చించబడింది. క్రీస్తు సహోదరులు ఈ అంశంపైన మరితర ప్రేరేపిత ఉపదేశంపైన శీర్షికలను ప్రచురించడం ద్వారా, మన ఆధ్యాత్మిక సంక్షేమం విషయంలో వాళ్లకు ప్రేమపూర్వక శ్రద్ధ ఉందని నిజంగా చూపిస్తున్నారు. మనకు గుర్తుచేయబడుతున్న వాటి ప్రకారం నడుచుకోవడం ద్వారా మనం మన పరిపూర్ణ నాయకుడైన యేసుక్రీస్తును అనుసరిస్తున్నామని చూపించవచ్చు.

“పట్టపగలగువరకు వేకువ వెలుగు తేజరిల్లునట్లు నీతిమంతుల మార్గము అంతకంతకు తేజరిల్లును” అని సామెతలు 4:18 చెబుతోంది. యేసు నాయకత్వం కింద క్రైస్తవ సంఘం అంతకంతకూ అభివృద్ధి చెందుతోంది. “నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన దాసుడు” ప్రచురిస్తున్నట్లు, లేఖన సత్యాలకు సంబంధించి మన అవగాహనలో వస్తున్న మార్పులకు సానుకూలంగా స్పందించడం ద్వారా కూడా మనం క్రీస్తు ‘సహోదరులతో’ సహకరించవచ్చు.—మత్త. 24:45.

క్రైస్తవ సంఘంలోవున్న నియమిత పర్యవేక్షకులతో సహకరించడం ద్వారా కూడా మనం క్రీస్తు ‘సహోదరులకు’ లోబడివున్నామని చూపిస్తాం. ‘మీపైని నాయకులుగా ఉన్నవారు మీ ఆత్మలను కాయుచున్నారు కాబట్టి వారి మాట విని, వారికి లోబడియుండుడి’ అని అపొస్తలుడైన పౌలు చెప్పాడు. (హెబ్రీ. 13:17) ఉదాహరణకు ఒక సంఘ పెద్ద, క్రమంగా కుటుంబ ఆరాధన చేసుకోవడం ప్రాముఖ్యమని చెబుతూ మనల్ని ప్రోత్సహించవచ్చు లేదా క్షేత్ర పరిచర్యకు సంబంధించిన ఏదైనా ఒక విషయం గురించి మనకు సూచనలు ఇవ్వవచ్చు. ఒక ప్రయాణ పర్యవేక్షకుడు, క్రైస్తవ జీవితానికి సంబంధించిన ఏదైనా ఒక అంశం మీద సహాయకరమైన కొన్ని లేఖన ఉపదేశాలను ఇవ్వవచ్చు. అలాంటి ఉపదేశాలను మనం ఇష్టపూర్వకంగా పాటించినప్పుడు మన నాయకుడైన యేసును అనుసరిస్తున్నామని చూపిస్తాం.

విచారకరంగా ఈ లోకంలో సమర్థులైన నాయకులు కరువయ్యారు. అయితే, ప్రేమగల నాయకుడైన క్రీస్తును అనుసరించడం ఎంతో సేదదీర్పునిస్తుంది! అందుకే, మన నాయకుడు చెప్పింది చేస్తూ, ఆయన నేడు ఉపయోగించుకుంటున్న వాళ్లతో సహకరించడం మంచిది.

[27వ పేజీలోని చిత్రాలు]

అవిశ్వాసులను పెళ్లిచేసుకోకూడదనే లేఖన ఉపదేశం ప్రకారం నడుచుకుంటారా?