కంటెంట్‌కు వెళ్లు

కృంగిన వారికి ఓదార్పు

కృంగిన వారికి ఓదార్పు

కృంగిన వారికి ఓదార్పు

“సృష్టి యావత్తు ఇదివరకు ఏకగ్రీవముగా మూలుగుచు ప్రసవవేదనపడుచునున్నదని యెరుగుదుము.” (రోమీయులు 8:22) పందొమ్మిది వందల సంవత్సరాల క్రితం ఆ మాటలు వ్రాసినప్పుడు మానవుని బాధ చాలా విపరీతంగా ఉంది. చాలా మంది ప్రజలు కృంగిపోయారు. అందుకే క్రైస్తవులు ఇలా ఉద్బోధించబడ్డారు: “ధైర్యము చెడినవారిని ధైర్యపరచుడి.”—1 థెస్సలొనీకయులు 5:14.

ఈనాడు మానవుని చింత మునుపటికంటే మరీ ఎక్కువై, అనేక ప్రజానీకం మునుపెన్నటికంటే అధికంగా కృంగిపోతున్నారు. కాని అది మనల్ని ఆశ్చర్యపరచాలా? అవసరంలేదు, ఎందుకంటే ఇవి “అంత్యదినాలు” అని బైబిలు చూపిస్తోంది, మరి వాటిని “అపాయకరమైన కాలములు” అని అంటోంది. (2 తిమోతి 3:1-5) ఈ అంత్యదినాలలో “కలవరపడిన జనములు” . . . “లోకము మీదికి రాబోవుచున్న వాటి విషయమై భయముకలిగి, మనుష్యులు ఎదురుచూచుచు ధైర్యముచెడి కూలుదురు.” అని క్రీస్తు ప్రవచించాడు.—లూకా 21:7-11, 25-27; మత్తయి 24:3-14.

జనులు దీర్ఘకాల ఆందోళన, భయం, వేదన, లేక అలాంటి ఇతర ప్రతికూల భావోద్రేకాలను అనుభవించినప్పుడు, సామాన్యంగా వారు కృంగిపోతారు. ప్రియమైనవారి మరణం, విడాకులు, ఉద్యోగం ఊడిపోవడం, లేక కోలుకోలేని అనారోగ్యం కృంగుదలకు లేక విపరీతమైన దుఃఖానికి కారణం కావచ్చు. తాము చేసింది విఫలమై, అందరినీ నిరుత్సాహపరిచామన్న భావనతో, మేమెందుకూ పనికిరామన్న భావనను పెంచుకోవడం వల్లకూడా ప్రజలు కృంగిపోతుంటారు. ఒత్తిళ్లను బట్టి ఎవరైనా పూర్తిగా నీరుగారి పోవచ్చు, కానీ అట్టి దురవస్థనుండి బైటపడే మార్గం కనిపించకపోయి, నిరాశా భావాన్ని వృద్ధిచేసుకుంటే, తీవ్రమైన మానసిక కృంగుదల కలుగవచ్చును.

పూర్వమున్న ప్రజలుకూడా ఇలాంటి భావాలనే వ్యక్తపరిచారు. యోబు అనారోగ్యాన్ని, వ్యక్తిగత దౌర్భాగ్యాన్ని అనుభవించాడు. దేవుడతనిని విడిచిపెట్టాడనుకుని, జీవితంపై విరక్తిని వ్యక్తపర్చాడు. (యోబు 10:1; 29:2, 4,5) యాకోబు తన కొడుకు ఆకస్మికంగా మరణించడం వలన కృంగిపోయి, ఓదార్పు పొందడానికి కూడా నిరాకరించి, చనిపోవాలని కోరుకున్నాడు. (ఆదికాండము 37:33-35) గంభీరమైన తప్పిదానికి దోషినని భావించి, రాజైన దావీదు విలపిస్తూ ఇలా అన్నాడు: “దినమెల్ల దుఃఖాక్రాంతుడనై సంచరించుచున్నాను. నేను సొమ్మసిల్లి . . . యున్నాను.”—కీర్తన 38:6, 8; 2 కొరింథీయులు 7:5,6.

ఈనాడు, అనేకులు వారి మానసిక, భావోద్రేక, శారీరక శక్తులకు మించిన దైనందిన కార్యక్రమాలందు మునిగిపోవుటకు ప్రయత్నిస్తూ, అధికభారంతో కృంగిపోతారు. స్పష్టంగా, ఒత్తిడి అనేది ప్రతికూల ఆలోచనలు, భావోద్రేకాలతోపాటు, శరీరాన్ని ప్రభావితం చేసి, మెదడులో రసాయనిక అసమతౌల్యాన్ని కలుగజేసి కృంగుదలకు నడుపుతుంది.—సామెతలు 14:30 పోల్చండి.

వారికవసరమైన సహాయము

ఫిలిప్పీకి చెందిన మొదటి శతాబ్దపు క్రైస్తవుడు, ఎపఫ్రొదితు, తాను “రోగి యాయెనని” అతని స్నేహితులు ‘విన్నారని తెలుసుకొని . . . విచారపడుచుండెను.’ అపొస్తలుడైన పౌలుకు సహాయకారిగా ఉండటానికే తన స్నేహితులవలన రోమాకు పంపించబడిన తర్వాత రోగగ్రస్తుడైన ఎపఫ్రొదితు, బహుశ తాను తన స్నేహితులను నిరాశ పరిచాడనే భావనతో తాను విఫలుడైనట్లుగా ఎంచుకున్నాడు. (ఫిలిప్పీయులు 2:25-27; 4:18) మరి అపొస్తలుడైన పౌలు అతనికెలా సహాయం చేశాడు.

పౌలు, ఎపఫ్రొదితును ఇంటికి పంపుతూ ఫిలిప్పీలోని స్నేహితులకు అతనితో ఒక ఉత్తరం పంపించాడు. అందులో ఇలా రాశాడు: “పూర్ణానందముతో ప్రభువునందు అతనిని చేర్చుకొని అట్టివారిని ఘనపర్చుడి.” (ఫిలిప్పీయులు 2:28-30) పౌలు అతని గూర్చి గొప్పగా మాట్లాడినందుకు ఫిలిప్పీయులు ఎపిఫ్రోదితును ప్రేమతో, ఉత్సాహంతో ఆహ్వానించి, ఎపఫ్రోదితుకు తప్పకుండా ఊరటనందించి, తన కృంగుదలనుండి బైటపడడానికి వారు సహాయపడివుంటారు.

“ధైర్యము చెడినవారిని ధైర్యపరచుడి” అన్న బైబిల్‌ సూత్రం నిశ్చయంగా శ్రేష్ఠమైనది. “ఇతరులు మిమ్మల్ని లక్ష్యపెడుతున్నారని మీరు తెలుసుకోవాల్సిన అవసరముందని” కృంగిపోయిన ఒక స్త్రీ అన్నది. “‘నాకు తెలుసు. ఏం పర్వాలేదు, మీరు కోలుకుంటారు,’ అని ఎవరో ఒకరు మనతో అనడం మనం వినాలి.”

తన్ను అర్థం చేసుకునే వ్యక్తి దగ్గర తన హృదయాన్ని విప్పడానికి కృంగిన వ్యక్తే అనేకసార్లు ముందుకు రావాల్సివుంటుంది. ఇతడు చక్కగా వినేవాడు, చాలా ఓపిక గలవాడైవుండాలి. అప్పుడతడుగాని, ఆమెగాని ‘నువ్విలా అనుకోకూడదు’ లేక, ‘అది తప్పుడు వైఖరి’ అని తీర్పు తీర్చడం, లేక ప్రసంగాలివ్వడం మానుకోవాలి. కృంగినవారి భావోద్రేకాలు అస్థిరంగావుంటాయి, అలాంటప్పుడు విమర్శనాత్మక వ్యాఖ్యానాలు అతన్ని మరింత బాధపెడతాయి తప్ప ఓదార్చవు.

కృంగిన వ్యక్తికి తానెందుకు పనికిరాడనే భావన కలుగుతుంది. (యోనా 4:3) అయినప్పటికి, అసలు అవసరమైందల్లా దేవుడు వారినెలా దృష్టిస్తున్నాడన్న విషయమేనని ఒక వ్యక్తి జ్ఞాపకముంచుకోవాలి. మనుష్యులు యేసుక్రీస్తును “తృణీకరించబడిన” వానిగా ఎంచారు, అయినా అది దేవుని ఎదుట ఆయన విలువను ఏమాత్రం తగ్గించలేదు. (యెషయా 53:3) దేవుడు తన ప్రియమైన కుమారున్ని ఎలా ప్రేమించాడో అలాగే మిమ్మల్ని కూడా ప్రేమిస్తాడన్న అభయాన్నందుకోండి.—యోహాను 3:16.

కృంగినవారి మీద యేసు జాలిపడ్డాడు, వ్యక్తిగా తమ విలువను గుర్తించేలా సహాయం చేయడానికి ప్రయత్నించాడు. (మత్తయి 9:36; 11:28-30; 14:14) అల్పమైన పిచ్చుకలకు సహితం దేవుడు విలువనిస్తాడని ఆయన వివరించాడు. “వాటిలో ఒక్కటైనను దేవుని యెదుట మరువబడదు” అని ఆయన అన్నాడు. మరి ఆయన చిత్తం చేయడానికి ప్రయత్నించే మనుష్యులకు ఎంతో విలువనిస్తాడు! “మీ తల వెండ్రుకలన్నియు లెక్కింపబడియున్నవి” అని యేసు వీరినిగూర్చి అన్నాడు.—లూకా 12:6,7.

నిజమే, తన బలహీనతలను, తప్పులను గూర్చి విపరీతంగా కృంగిపోయిన వానికి, దేవుడు తనకు అంత విలువనిస్తాడని నమ్మడం కష్టంగానే ఉండవచ్చు. దేవుని ప్రేమకు, శ్రద్ధకు తాను తగడని అతను నిశ్చయంగా భావించవచ్చు. “మన హృదయము . . . మనయందు దోషారోపణ చేయును,” అని దేవుని వాక్యము చెబుతోంది. అయితే నిర్ణయించేది హృదయమేనా? కాదు అదికాదు. పాపులైన మానవులు ప్రతికూలంగా ఆలోచిస్తారనీ, తమ్మును తాము నిందించుకుంటారని కూడా దేవునికి తెలుసు. అందుకనే ఆయన వాక్యం వారిని ఇలా ఓదారుస్తోంది: “దేవుడు మన హృదయముకంటే అధికుడై, సమస్తమును ఎరిగియున్నాడు.”—1 యోహాను 3:19, 20.

అవును, మన పరలోకపు తండ్రి మన పాపాలు, తప్పులకన్నా మేలైన వాటినే చూస్తాడు. మన బలహీనతలు, మన పూర్తి జీవన విధానం, మన ఉద్దేశాలు, దృక్పథాలు గూర్చి ఆయనకు తెలుసు. మనకు పాపం, రోగం, మరణం సంప్రాప్తమైందని, అందువల్ల మనకెన్నో హద్దులున్నాయని ఆయనకు తెలుసు. మనలోమనం దుఃఖపడుతూ క్షోభిస్తున్నామంటేనే, మనకు పాపం చేయడం ఇష్టం లేదని, మనమింకా హద్దులు మీరలేదని రుజువైయున్నది. మన చిత్తానికి విరుద్ధంగా “వ్యర్ధపరచ” బడ్డామని బైబిలు అంటోంది. అందుకని మన నికృష్ట దుర్దశపై దేవుడు కనికరము చూపించి, కరుణతో మన బలహీనతలను పరిగణలోకి తీసుకుంటాడు.—రోమీయులు 5:12; 8:20.

“యెహోవా దయాదాక్షిణ్య పూర్ణుడు,” అనే అభయం మనకుంది. “పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమములను మనకు అంత దూరపరచియున్నాడు. మనము నిర్మింపబడిన రీతి ఆయనకు తెలిసేయున్నది. మనము మంటివారమని ఆయన జ్ఞాపకము చేసికొనుచున్నాడు.” (కీర్తన 103:8, 12, 14) నిజంగా, యెహోవా “సమస్తమైన ఆదరణను అనుగ్రహించు దేవుడు . . . శ్రమ అంతటిలో . . . ఆదరించుచున్నాడు.”—2 కొరింథీయులు 1:3, 4.

కృపాసంపన్నుడైన తమ దేవుని దగ్గరకు చేరి, ‘మీ భారము ఆయన మీద మోపుడని’ చెప్పిన ఆయన ఆహ్వానాన్ని అంగీకరించడం వలన కృంగిన వారికి మంచి సహాయం లభిస్తుంది. (కీర్తన 55:22; యెషయా 57:15) కాబట్టి, “ఆయన మిమ్మునుగూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయనమీద వేయుడి” అని అంటూ దేవుని వాక్యము ప్రార్థనను ప్రోత్సహిస్తోంది. (1 పేతురు 5:7) అవును, ప్రార్థన విజ్ఞాపనముల ద్వారా దేవునికి దగ్గరై “దేవుని సమాధానము . . . మీతలంపులకును కావలియుండు” టను మీరు అనుభవిస్తారు.—ఫిలిప్పీయులు 4:6, 7; కీర్తన 16:8.

తన జీవిత సరళిలో ఆచరణయోగ్యమైన మార్పులు చేసుకోవడం అటువంటి కృంగిన మనస్సును మార్చుకోడానికి సహాయపడుతుంది. శారీరక వ్యాయామం, మంచి ఆహారాన్ని భుజించడం, స్వచ్ఛమైన గాలిని శ్వాసించి, కావలసినంత విశ్రాంతిని తీసుకోవడం, ఎక్కువగా టివిని చూడకుండ ఉండటం అన్నీ చాల అవసరమైనవే. ఒక స్త్రీ, కృంగినవారిని చమటోడ్చి నడవమని ప్రోత్సహించడం ద్వారా వారికి సహాయపడింది. “నేను ఇప్పుడు నడవడానికి వెళ్లను” అని మానసికంగా కృంగినావిడ అన్నప్పుడు, ఆ స్త్రీ మృదువుగానే, కాని దృఢంగా “లేదు, నీవు వెళ్తున్నావు” అని అన్నది. ‘మేము ఆరు కిలోమీటర్లు నడిచాం. తిరిగి వచ్చేప్పటికి ఆమె అలిసిపోయింది కానీ, ఆమెకు హాయిగావున్నట్లు అనిపించింది. బాగా వ్యాయామం చేయడం ఎంతమేరకు సహాయకరమో, చేసేంతవరకూ తెలియదు,’ అని ఆ స్త్రీ నివేదించింది.

అయినప్పటికీ, కొన్నిసార్లు వైద్య చికిత్సతో సహా అన్నిటిని ప్రయత్నించిన తర్వాతకూడా కృంగుదలను పూర్తిగా తీసివేయడం అసాధ్యమౌతుంది. “నేను అన్నిటిని ప్రయత్నించాను, కాని ఆ కృంగుదలమాత్రం పోవడంలేదు,” అని ఆ మధ్యవయస్కురాలు అన్నది. అలాగే ఈనాడు గ్రుడ్డివారిని, చెవిటివారిని, లేక కుంటివారిని స్వస్థపరచడం సహజంగా అసాధ్యమౌతుంది. అయినా, మానవ రుగ్మతలన్నిటి నుండి శాశ్వత విమోచన కలుగుతుందనే నిరీక్షణనిచ్చే దేవుని వాక్యాన్ని క్రమంగా చదవడంవల్ల కృంగినవారు నిరీక్షణను, ఓదార్పును పొందగలరు.—రోమీయులు 12:12; 15:4.

మరలా ఎవ్వరూ ఎన్నడూ కృంగని సమయములో

అంత్యదినాలలో భూమి మీద జరగబోయే భయంకరమైన విషయాలను గూర్చి యేసు చెబుతూ ఆయనింకా, “ఇవి జరుగ నారంభించినప్పుడు మీరు ధైర్యము తెచ్చుకొని మీ తలలెత్తికొనుడి, మీ విడుదల సమీపించుచున్నదనెను.” (లూకా 21:28) “సృష్టి, నాశనమునకు లోనయిన దాస్యములోనుండి విడిపింపబడి, దేవుని పిల్లలు పొందబోవు మహిమగల స్వాతంత్ర్యము పొందు” దేవుని నీతియుక్తమైన నూతన లోకములోని విడుదలను గూర్చే యేసు మాట్లాడాడు.—రోమీయులు 8:20, 21.

అన్ని భారాలనుండి విడుదలపొంది, దైనందిన కార్యక్రమాలు నిర్వహించడానికి ప్రతి ఉదయం నిర్మలమైన మనస్సుతో లేవడం మానవ జాతికెంత ఉపశమనం కల్గిస్తుందో! ఈ మానసిక కృంగుదల ఇక ఎన్నడూ ఎవ్వరినీ కూడా అడ్డగించదు. “వారి కన్నుల ప్రతి బాష్పబిందువును తుడిచివేయును, మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదనయైనను ఇక ఉండదు, మొదటి సంగతులు గతించిపోయెనని” దేవుడు మానవజాతికి చేసిన నిజమైన వాగ్దానముంది.—ప్రకటన 21:3, 4.

ప్రత్యేకంగా సూచించబడని లేఖనములు బైబిలు సొసైటి ఆఫ్‌ ఇండియా బెంగుళూరు వారి తెలుగు బైబిలు నుండి వ్రాయబడినవి