తప్పిపోయిన దానిని వెదకుట
అధ్యాయము 85
తప్పిపోయిన దానిని వెదకుట
వినయముతో దేవుని సేవించు వారిని వెదకి కనుగొనుటకు యేసు ఆశిస్తున్నాడు. కావుననే ఆయన వెదకుచు పేరుమోసిన పాపులతో సహా ప్రతివారితోను రాజ్యమునుగూర్చి మాట్లాడును. అటువంటి వ్యక్తులు ఇప్పుడు ఆయన బోధవినుటకు ఆయన దగ్గరకు వచ్చుదురు.
దీనిని గమనించి, పరిసయ్యులు శాస్త్రులు తాము అనర్హులని తలంచిన ప్రజలతో యేసు సహవసించుట చూసి విమర్శింతురు. వారు, “ఇతడు పాపులను చేర్చుకొని వారితోకూడ భోజనము చేయుచున్నాడని చాల సణుగుకొనిరి.” వారి హోదాకు అది ఎంతతక్కువో! పరిసయ్యులు శాస్త్రులు సామాన్యప్రజలను తమ పాదధూళిగా పరిగణించెడివారు. వాస్తవానికి, అటువంటి వారియెడల వారికున్న ఏవగింపును చూపుటకై, “మట్టి [నేల] మనుష్యులను,” భావముగల ‘ఆమ్హారెట్స్, అను హెబ్రీపదమును వారు ఉపయోగించెడివారు.
మరోవైపున, యేసు ప్రతివారిని గౌరవము, దయ, కనికరములతో చూచును. తత్ఫలితముగా, తప్పిదము చేయువారని పేరుపోయిన వారితోసహా, దీనులైన అనేకులు ఆయన బోధ వినుటకు ఆతురపడుదురు. అయితే పరిసయ్యులు అనర్హులని పరిగణించు వారి పక్షముగా యేసు చేయుచున్న ప్రయత్నములను గూర్చి వారుచేసే విమర్శ విషయమేమిటి?
యేసు ఒక ఉపమానమును ఉపయోగించుటద్వారా వారి అభ్యంతరమునకు సమాధానమిచ్చును. తామే నీతిమంతులమని, దేవుని దొడ్డిలో సురక్షితంగా ఉన్నామని, పనికిరాని ‘ఆమ్హారెట్స్, దారితప్పిపోయిన స్థితిలో ఉన్నారని తలంచే పరిసయ్యుల దృక్కోణములోనే ఆయన మాట్లాడును. ఆయన చెప్పుదానిని వినుము:
“మీలో ఏ మనుష్యునికైనను నూరు గొర్రెలు కలిగియుండగా వాటిలో ఒకటి తప్పిపోయిన యెడల అతడు తొంబది తొమ్మిదింటిని అడవిలో విడిచిపెట్టి, తప్పిపోయినది దొరకువరకు దానిని వెదక వెళ్లడా? అది దొరకినప్పుడు సంతోషముతో దానిని తన భుజములమీద వేసికొని యింటికివచ్చి తన స్నేహితులను పొరుగువారిని పిలిచి ‘మీరు నాతోకూడ సంతోషించుడి; తప్పిపోయిన నా గొర్రె దొరకినదని’ వారితో చెప్పును గదా.”
ఆ పిమ్మట యేసు తన కథను అన్వయిస్తూ ఇలా వివరించుచున్నాడు: “అటువలె మారుమనస్సు అక్కరలేని తొబంది తొమ్మిదిమంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషముకంటె మారుమనుస్సు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషము కలుగును.”
పరిసయ్యులు తాము నీతిమంతులమని, ఆ విధముగా మారుమనస్సు అవసరము లేదని అనుకొందురు. సుంకరులతో పాపులతో భోజనము చేయుచున్నాడని ఓ రెండు సంవత్సరముల క్రితం కొందరు యేసును విమర్శించినప్పుడు, ఆయన వారికిట్లు చెప్పెను: “నేను పాపులను పిలువవచ్చితినిగాని నీతిమంతులను పిలువరాలేదు.” మారుమనస్సు పొందవలసిన తమ అవసరతను గ్రహించలేని, స్వనీతిపరులైన పరిసయ్యులు, పరలోకమందు ఎటువంటి సంతోషమును కలిగించరు, గానీ నిజముగా మారుమనస్సు నొందిన పాపులు కలిగింతురు.
తప్పిపోయిన పాపుల పునరుద్ధరణ గొప్ప ఆనందమునకు కారణమగునను అంశమును రెండింతలుగా నొక్కిచెప్పుటకు, యేసు మరియొక ఉపమానము చెప్పును. ఆయన ఇట్లనును: “ఏ స్త్రీకైనను పది వెండి నాణెములుండగా వాటిలో ఒక నాణెము పోగొట్టుకొంటే ఆమె దీపము వెలిగించి ఇల్లు ఊడ్చి అది దొరకువరకు జాగ్రత్తగా వెదకదా? అది దొరకినప్పుడు తన చెలికత్తెలను పొరుగువారిని పిలిచి, నాతోకూడ సంతోషించుడి, నేను పోగొట్టుకొనిన నాణెము దొరకినదని వారితో చెప్పును గదా.”
ఆ పిమ్మట యేసు అదేవిధముగా అన్వయించును. ఆయన ఇంకను తెల్పునదేమనగా, “అటువలె మారుమనస్సు పొందు ఒక పాపి విషయమై దేవుని దూతలయెదుట సంతోషము కలుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.”
తప్పిపోయిన పాపుల పునరుద్ధరణ విషయంలో దేవుని దూతలుచూపు ప్రేమపూర్వకమైన ఈ శ్రద్ధ ఎంత శ్రేష్ఠమైనది! ప్రత్యేకముగా, ఒకప్పుడు దీనులైన, ఏవగించుకొనబడిన ‘ఆమ్హారెట్స్, చివరకు దేవుని పరలోకరాజ్య సభ్యత్వపు వరుసలోనికి వచ్చుచున్నందున ఇది నిజమైయున్నది. దాని ఫలితముగా, వారు పరలోకములో దేవదూతలకంటె ఉన్నతమైన స్థానములను పొందుదురు! అయితే ఈర్ష్యచెందుటకు లేక అలక్ష్యపరచ బడితిమని భావించుటకు బదులు ఆ దేవదూతలు, పాపులైన ఈ మానవులు సానుభూతిగల, కనికరముగల పరలోక రాజులుగా, యాజకులుగా వారిని తీర్చిదిద్దిన జీవన పరిస్థితులను ఎదుర్కొని వాటిని అధిగమించి వచ్చిరని, వినయముతో ప్రశంసింతురు. లూకా 15:1-10; మత్తయి 9:13; 1 కొరింథీయులు 6:2, 3; ప్రకటన 20:6.
▪ యేసు పేరుమోసిన పాపులతో ఎందుకు సహవాసము చేయును, కాగా ఆయన పరిసయ్యులనుండి ఎటువంటి విమర్శను నెదుర్కొనును?
▪ పరిసయ్యులు సామాన్యప్రజలను ఎట్లు దృష్టింతురు?
▪ యేసు ఏ ఉపమానములను ఉపయోగించును, మరియు వాటినుండి మనమేమి నేర్చుకొనగలము?
▪ దూతల ఆనందము ఎందుకు శ్రేష్ఠమైనది?