కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

దేవుని రాజ్యం పరిపాలిస్తుంది

దేవుని రాజ్యం పరిపాలిస్తుంది

అధ్యాయము 10

దేవుని రాజ్యం పరిపాలిస్తుంది

1, 2. మానవ ప్రభుత్వాలు అసమర్థమైనవిగా ఎట్లు నిరూపించుకున్నాయి?

మీరు ఏదైనా వస్తువు కొన్న తర్వాత అది పనిచేయకపోవడం లాంటి అనుభవం మీకు కలిగివుండవచ్చు. మీరు దాన్ని బాగుచేసే వ్యక్తిని పిలిపించారనుకుందాము. అయితే అతడు దాన్ని బాగుచేసిన తర్వాత మళ్లీ అది పాడైపోయింది. అది ఎంత నిరుత్సాహాన్ని కలిగిస్తుందోకదా!

2 మానవ ప్రభుత్వాల విషయం కూడా అలాగే ఉంది. శాంతి సంతోషాలను తీసుకువచ్చే ప్రభుత్వం కొరకు మానవజాతి ఎల్లప్పుడూ ఆకాంక్షించింది. అయినా, సమాజంలోని వైఫల్యాలను బాగుచేసేందుకు జరిగిన గట్టి ప్రయత్నాలన్నీ నిజంగా విజయవంతం కాలేదు. అనేకానేక శాంతి ఒప్పందాలు చేయబడ్డాయి—ఆ తర్వాత అవి విఫలమయ్యాయి. అంతేకాకుండా పేదరికం, దురభిమానం, నేరం, రోగం, పర్యావరణ వినాశనం వంటి వాటిని ఏ ప్రభుత్వం నిర్మూలించగలిగింది? మానవుని పరిపాలన బాగుచేయలేనిది. ఇశ్రాయేలీయుల యొక్క జ్ఞానవంతుడగు రాజైన సొలొమోను కూడా ఇలా అడిగాడు: “తనకు సంభవింపబోవునది యొకడెట్లు తెలిసికొనగలడు?”—సామెతలు 20:24.

3. (ఎ) యేసు ప్రకటనపని యొక్క ముఖ్యాంశమేమిటి? (బి) దేవుని రాజ్యాన్ని కొంతమంది ప్రజలు ఎలా వర్ణిస్తారు?

3 విచారించకండి! ఒక పటిష్ఠమైన ప్రపంచ ప్రభుత్వం కేవలం ఒక కల కాదు. అది యేసు ప్రకటన పని యొక్క ముఖ్యాంశము. ఆయన దాన్ని “దేవుని రాజ్యము” అని పిలిచాడు, దాని కొరకు ప్రార్థించుమని ఆయన తన అనుచరులకు బోధించాడు. (లూకా 11:2; 21:31) నిజమే, దేవుని రాజ్యం కొన్నిసార్లు మత వర్గాల మధ్య ప్రస్తావించబడుతుంది. వాస్తవానికి, కోట్లాదిమంది ప్రతి దినం ప్రభువు ప్రార్థనను (మా తండ్రి లేక మాదిరి ప్రార్థన అని కూడా పిలువబడుతుంది) పునరుచ్ఛరించినప్పుడు దాని కొరకే ప్రార్థిస్తారు. కాని “దేవుని రాజ్యమంటే ఏమిటి?” అని అడిగినప్పుడు ప్రజలు పలువిధాలుగా సమాధానమిస్తారు. “అది మీ హృదయంలో ఉంది” అని కొందరంటారు. ఇతరులు దాన్ని పరలోకమంటారు. మనం చూడబోతున్నట్లు, బైబిలు దానికి స్పష్టమైన సమాధానమిస్తుంది.

సంకల్పం గల రాజ్యం

4, 5. యెహోవా తన సర్వాధిపత్యం యొక్క క్రొత్త సంకల్పాన్ని బయల్పరచేందుకు ఎందుకు ఎంపిక చేసుకున్నాడు, అది దేన్ని సాధిస్తుంది?

4 యెహోవా దేవుడు ఎల్లప్పుడూ విశ్వానికి రాజుగా, లేక సర్వోన్నతమైన పరిపాలకునిగా ఉన్నాడు. ఆయన అన్నింటినీ సృష్టించాడనే వాస్తవం ఆయనను ఆ ఉన్నత స్థానానికి హెచ్చిస్తుంది. (1 దినవృత్తాంతములు 29:11; కీర్తన 103:19; అపొస్తలుల కార్యములు 4:24) కాని యేసు ప్రకటించిన రాజ్యం, దేవుని విశ్వ సర్వాధిపత్యానికి సహాయకారి, లేక రెండవది. ఆ మెస్సీయ రాజ్యానికి ఒక ప్రత్యేక సంకల్పం ఉంది, అయితే అదేమిటి?

5 ఆరవ అధ్యాయంలో వివరించబడినట్లుగా, మొదటి మానవ జంట దేవుని అధికారానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు. లేవదీయబడిన వివాదాంశాల కారణంగా, యెహోవా తన సర్వోన్నతాధిపత్యపు ఓ క్రొత్త సంకల్పాన్ని బయల్పరచేందుకు ఎంపిక చేసుకున్నాడు. సర్పమును అంటే సాతానును చితుకగొట్టి, మానవజాతి యొక్క వారసత్వ పాప ప్రభావాలను తీసివేసే “సంతానాన్ని” ఉత్పన్నం చేసే తన సంకల్పాన్ని దేవుడు ప్రకటించాడు. ఆ ముఖ్య “సంతానం” యేసుక్రీస్తు, “దేవుని రాజ్యము” సాతానుకు ఘోరమైన పరాజయాన్ని కలుగజేసే సాధనం. ఈ రాజ్యం ద్వారా, యేసుక్రీస్తు యెహోవా నామము పేరిట భూమిపై పరిపాలనను పునఃస్థాపించి, దేవుని న్యాయమైన సర్వాధిపత్యాన్ని నిరంతరం మహిమపరుస్తాడు.—ఆదికాండము 3:15; కీర్తన 2:2-9.

6, 7. (ఎ) రాజ్యం ఎక్కడ ఉంది, దాని రాజు మరియు ఆయన సహ పరిపాలకులు ఎవరు? (బి) రాజ్యంలోని పౌరులెవరు?

6 దుష్ట పరిసయ్యులతో యేసు పలికిన మాటలను గూర్చిన ఒక తర్జుమా ప్రకారం, ఆయనిలా అన్నాడు: “దేవుని రాజ్యము మీ మధ్యనే యున్నది.” (లూకా 17:21) రాజ్యము ఆ దుర్మార్గుల దుష్ట హృదయాల్లో ఉందన్నది యేసు భావమా? కాదు. వారి మధ్యనున్న యేసు, అలా తనను తాను భవిష్యత్‌ రాజుగా సూచించుకున్నాడు. దేవుని రాజ్యం ఒక వ్యక్తి తన హృదయంలో కలిగివుండేది కాదుగాని అది ఒక పరిపాలకుడు మరియు పౌరులు కలిగివుండే, వాస్తవమైన పనిచేసే ఒక ప్రభుత్వం. అది ఒక పరలోక ప్రభుత్వం, ఎందుకంటే అది ‘పరలోక రాజ్యం’ అని ‘దేవుని రాజ్యం’ అని రెండుపేర్లతో పిలువబడింది. (మత్తయి 13:11; లూకా 8:10) ‘మనుష్యకుమారునిపోలిన యొకరి’ వంటి దాని పరిపాలకుడు సర్వశక్తిగల దేవుని ఎదుటికి రప్పింపబడి, “సకల జనులును రాష్ట్రములును ఆయా భాషలు మాటలాడువారును ఆయనను సేవించునట్లు ప్రభుత్వమును మహిమయు ఆధిపత్యమును ఆయన కీయ” బడినట్లు ప్రవక్తయైన దానియేలు దర్శనంలో చూశాడు. (దానియేలు 7:13, 14) ఈ రాజు ఎవరు? బైబిలు యేసుక్రీస్తును “మనుష్య కుమారుడు” అని పిలుస్తుంది. (మత్తయి 12:40; లూకా 17:26) అవును, యెహోవా తన కుమారుడైన యేసుక్రీస్తును రాజుగా నియమించాడు.

7 యేసు ఒంటరిగా పరిపాలించడు. ఆయన సహ రాజులుగా, యాజకులుగా ఉండేందుకు “భూలోకములోనుండి కొనబడిన” 1,44,000 మంది కూడా ఆయనతోపాటు ఉంటారు. (ప్రకటన 5:9, 10; 14:1, 3; లూకా 22:28-30) క్రీస్తు నాయకత్వానికి లోబడే భూ కుటుంబంలోని మానవులు దేవుని రాజ్య పౌరులైవుంటారు. (కీర్తన 72:7, 8) అయితే, ఆ రాజ్యం దేవుని సర్వాధిపత్యాన్ని ఉన్నతపరుస్తుందని, మన భూమిపై పరదైసు పరిస్థితులను పునఃస్థాపిస్తుందని మనమెలా నిశ్చయత కలిగివుండగలము?

దేవుని రాజ్యం యొక్క వాస్తవికత

8, 9. (ఎ) దేవుని రాజ్య వాగ్దానాల నమ్మకత్వాన్ని మనం ఎలా ఉదాహరించవచ్చు? (బి) రాజ్య వాస్తవికతను గూర్చి మనమెందుకు నిశ్చయత కలిగివుండగలము?

8 అగ్ని మీ ఇంటిని నాశనం చేసిందనుకోండి. ఇప్పుడు, మీ ఇంటిని మళ్లీ నిర్మించడానికి సహాయం చేస్తానని, మీ కుటుంబానికి ఆహారం ఏర్పాటు చేస్తానని, అలా చేయగల సామర్థ్యమున్న ఒక స్నేహితుడు వాగ్దానం చేస్తాడు. ఒకవేళ ఆ స్నేహితుడు మీకు ఎప్పుడూ నిజమే చెప్పివుంటే, మీరు ఆయనను నమ్మరా? బహుశా మీరు మరునాడు పని నుండి ఇంటికి వచ్చేసరికి, పనివాళ్లు అప్పటికే అగ్ని మూలంగా ఏర్పడిన చెత్తాచెదారాన్ని శుభ్రం చేయడం ప్రారంభించివుండి, మీ కుటుంబం కొరకు ఆహారం తీసుకురాబడి ఉందనుకోండి. చివరికి అన్ని పునఃస్థాపించబడడమేగాక, మునుపటి కంటే ఇప్పుడు అన్ని మరి శ్రేష్ఠంగా ఉంటాయని మీరు నిస్సందేహంగా పూర్తి నమ్మకం కలిగివుండగలుగుతారు.

9 అలాగే, రాజ్య వాస్తవికతను గూర్చి యెహోవా మనకు హామీ ఇస్తున్నాడు. బైబిలు పుస్తకమైన హెబ్రీయులకు వ్రాసిన పత్రికలో చూపబడినట్లుగా, ధర్మశాస్త్రం యొక్క అనేక ఆకృతులు రాజ్య ఏర్పాటుకు ముంగుర్తులుగా ఉన్నాయి. (హెబ్రీయులు 10:1) ఇశ్రాయేలీయుల భూ రాజ్యమందు కూడా దేవుని రాజ్య ప్రవచనార్థక ముంగుర్తులు స్పష్టంగా కన్పించాయి. పరిపాలకులు “యెహోవా సింహాసనమందు” కూర్చుండే వారు గనుక అది సాధారణమైన ప్రభుత్వం కాదు. (1 దినవృత్తాంతములు 29:23) అంతేగాక, ఇలా ప్రవచింపబడింది: “షిలోహు వచ్చువరకు యూదా యొద్దనుండి దండము తొలగదు అతని కాళ్ల మధ్యనుండి రాజదండము తొలగదు ప్రజలు అతనికి విధేయులై యుందురు.” (ఆదికాండము 49:10) * అవును, దేవుని ప్రభుత్వానికి శాశ్వత రాజైన యేసు ఈ యూదా రాజుల వంశంలోనే జన్మించవలసి ఉండెను.—లూకా 1:32, 33.

10. (ఎ) దేవుని మెస్సీయ రాజ్యానికి ఎప్పుడు పునాది వేయబడింది? (బి) యేసు యొక్క భవిష్యత్‌ సహ పరిపాలకులు భూమిపై ఏ ప్రాముఖ్యమైన పనికి నాయకత్వం వహిస్తారు?

10 యేసు యొక్క అపొస్తలుల ఎంపికతో దేవుని మెస్సీయ రాజ్యానికి పునాది వేయబడింది. (ఎఫెసీయులు 2:19, 20; ప్రకటన 21:14) వీరు, పరలోకంలో యేసుక్రీస్తుతోపాటు సహ రాజులుగా పరిపాలించే 1,44,000 మందిలో మొదటివారు. భూమిపైనున్నప్పుడు, ఈ భవిష్యత్‌ సహపరిపాలకులు, యేసుయొక్క ఈ ఆజ్ఞకు అనుగుణంగా, సాక్ష్యమిచ్చే ప్రచారపనికి నాయకత్వం వహించారు, అదేమిటంటే: ‘వెళ్లి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి; తండ్రియొక్కయు కుమారునియొక్కయు పరిశుద్ధాత్మయొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మమియ్యుడి.’—మత్తయి 28:19.

11. నేడు రాజ్య ప్రకటన పని ఎలా కొనసాగింపబడుతోంది, అది దేన్ని సాధిస్తోంది?

11 శిష్యులను చేయుమని ఇవ్వబడిన ఆజ్ఞకు ఇప్పుడు ముందెన్నడూలేని రీతిగా విధేయత చూపించబడుతున్నది. యేసు యొక్క ఈ ప్రవచనార్థక మాటలకు అనుగుణంగా, యెహోవాసాక్షులు రాజ్య సువార్తను భూవ్యాప్తంగా ప్రకటిస్తున్నారు: “ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్ష్యార్థమై లోకమందంతటను ప్రకటింపబడును; అటు తరువాత అంతము వచ్చును.” (మత్తయి 24:14) రాజ్య ప్రకటన పనిలోని ఒక అంకముగా, గొప్ప విద్యాభ్యాస కార్యక్రమం అమలు చేయబడుతున్నది. దేవుని రాజ్య నియమాలకు సూత్రాలకు విధేయులయ్యేవారు, మానవ ప్రభుత్వాలు సాధించలేని సమాధానాన్ని ఐక్యతను ఇప్పటికే అనుభవిస్తున్నారు. దేవుని రాజ్యం వాస్తవమైనదనేందుకు ఇదంతా స్పష్టమైన సాక్ష్యాధారాన్నిస్తుంది!

12. (ఎ) రాజ్య ప్రచారకులను యెహోవాసాక్షులని పిలవడం ఎందుకు సముచితమైనది? (బి) దేవుని రాజ్యం మానవ ప్రభుత్వాల నుండి ఎలా భిన్నమైనది?

12 యెహోవా ఇశ్రాయేలీయులకు ఇలా చెప్పాడు: “మీరును నేను ఏర్పరచుకొనిన నా సేవకుడును నాకు సాక్షులు.” (యెషయా 43:10-12) “నమ్మకమైన సాక్షి” అయిన యేసు రాజ్య సువార్తను ఆసక్తితో ప్రకటించాడు. (ప్రకటన 1:5; మత్తయి 4:17) కాబట్టి ప్రస్తుత దిన రాజ్య ప్రచారకులు, యెహోవాసాక్షులు అనే దైవ నియమిత నామాన్ని కలిగివుండడం సముచితమే. కాని దేవుని రాజ్యాన్ని గూర్చి ఇతరులతో మాట్లాడేందుకు సాక్షులు ఎందుకంత సమయాన్ని, శ్రమను వెచ్చిస్తారు? రాజ్యం మానవజాతి యొక్క ఏకైక నిరీక్షణ గనుక వారలా చేస్తారు. మానవ ప్రభుత్వాలు చివరికి అంతమౌతాయి కాని దేవుని రాజ్యం ఎన్నటికీ అంతం కాదు. యెషయా 9:6, 7 దాని పరిపాలకుడైన యేసును “సమాధానకర్తయగు అధిపతి” అని పిలుస్తూ, ఇంకా ఇలా చెబుతుంది: ‘ఇది మొదలుకొని మితిలేకుండ దానికి వృద్ధియు క్షేమమును కలుగును.’ దేవుని రాజ్యం ఏలికూలే మానవ ప్రభుత్వాల వంటిదికాదు. వాస్తవానికి దానియేలు 2:44 ఇలా చెబుతుంది: “పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యము స్థాపించును. దానికెన్నటికిని నాశనము కలుగదు, ఆ రాజ్యము దాని పొందినవారికి గాక మరెవరికిని చెందదు; . . . అది యుగముల వరకు నిలుచును.”

13. (ఎ) దేవుని రాజ్యం విజయవంతంగా పరిష్కరించే కొన్ని సమస్యలు ఏవి? (బి) దేవుని వాగ్దానాలు నెరవేరతాయని మనమెందుకు నిశ్చయత కలిగి ఉండగలము?

13 యుద్ధం, నేరం, అనారోగ్యం, ఆకలి మరియు నిరాశ్రయత వంటివాటిని ఏ మానవ రాజు నిర్మూలించగలడు? అంతేగాక, మరణించినవారిని ఏ భూ పాలకుడు పునరుత్థానం చేయగలడు? దేవుని రాజ్యము, దాని రాజు వీటిని చేయగలరు. తదేకంగా బాగుచేయవలసివచ్చే, సరిగ్గా పనిచేయని వస్తువు వలె ఆ రాజ్యం లోపంతో కూడినదై ఉండదు. బదులుగా, దేవుని రాజ్యం విజయవంతమౌతుంది, ఎందుకంటే యెహోవా ఇలా వాగ్దానం చేస్తున్నాడు: “నా నోటనుండి వచ్చువచనము నిష్ఫలముగా నాయొద్దకు మరలక అది నాకు అనుకూలమైనదాని నెరవేర్చును నేను పంపిన కార్యమును సఫలముచేయును.” (యెషయా 55:11) దేవుని సంకల్పం విఫలం కాదు, అయితే రాజ్య పరిపాలన ఎప్పుడు ప్రారంభం కావలసియుండెను?

రాజ్యపరిపాలన—ఎప్పుడు?

14. రాజ్యాన్ని గూర్చి యేసు శిష్యులకు ఏ అపోహ ఉండేది, కాని తన పరిపాలన గురించి యేసుకు ఏమి తెలుసు?

14 “ప్రభువా, యీ కాలమందు ఇశ్రాయేలునకు రాజ్యమును మరల అనుగ్రహించెదవా?” యేసు శిష్యులు వేసిన ఈ ప్రశ్న, దేవుని రాజ్య సంకల్పాన్ని గూర్చి మరియు దాని పరిపాలన ప్రారంభమయ్యే నియమిత సమయాన్ని గూర్చి ఆ ప్రశ్నవేసే సమయానికి వారికి తెలియదని బయల్పర్చింది. విషయాన్ని గూర్చి ఊహించవద్దని హెచ్చరిస్తూ, యేసు ఇలా చెప్పాడు: “కాలములను సమయములను తండ్రి తన స్వాధీనమందుంచుకొని యున్నాడు; వాటిని తెలిసికొనుట మీ పనికాదు.” భూమిపై తన పరిపాలన భవిష్యత్తులో అంటే తాను పునరుత్థానమై, పరలోకానికి ఆరోహణమైన తర్వాత చాలా కాలానికి ప్రారంభమౌతుందని యేసుకు తెలుసు. (అపొస్తలుల కార్యములు 1:6-11; లూకా 19:11, 12, 15) లేఖనాలు ఈ విషయాన్ని ముందే తెలియజేశాయి. అదెలా?

15. యేసు పరిపాలనా కాలాన్ని గూర్చి కీర్తన 110:1 మనకు ఎలా వెలుగు ప్రసరింపజేస్తుంది?

15 ప్రవచనార్థకంగా యేసును “ప్రభువు” అని సంబోధిస్తూ, రాజైన దావీదు ఇలా చెప్పాడు: “ప్రభువు నా ప్రభువుతో సెలవిచ్చినవాక్కు—నేను నీ శత్రువులను నీ పాదములకు పీఠముగా చేయువరకు నా కుడి పార్శ్వమున కూర్చుండుము.” (కీర్తన 110:1; అపొస్తలుల కార్యములు 2:34-36 పోల్చండి.) యేసు పరలోకానికి ఆరోహణమైన వెంటనే ఆయన పరిపాలన ప్రారంభం కాదని ఈ ప్రవచనం సూచిస్తుంది. బదులుగా, ఆయన దేవుని కుడిపార్శ్వాన వేచివుంటాడు. (హెబ్రీయులు 10:12, 13) ఈ వేచివుండడం ఎంత వరకు కొనసాగుతుంది? ఆయన పరిపాలన ఎప్పుడు ప్రారంభమౌతుంది? సమాధానాలు కనుగొనడానికి బైబిలు మనకు సహాయం చేస్తుంది.

16. సా.శ.పూ. 607 లో ఏమి జరిగింది, అది దేవుని రాజ్యంతో ఎలా సంబంధాన్ని కలిగివుండెను?

16 భూమియంతటిపైన యెహోవా తన నామాన్ని ఉంచిన పట్టణం యెరూషలేము మాత్రమే. (1 రాజులు 11:36) అది దేవుని పరలోక రాజ్యాన్ని పోలి, దేవుడు అంగీకరించిన భూ రాజ్యానికి ముఖ్యపట్టణం కూడా. గనుక, సా.శ.పూ. 607 లో బబులోనీయులు యెరూషలేమును నాశనం చేయడం చాలా విశేషమైనది. భూమిపైనున్న తన ప్రజలపై దేవుని సూటియైన పరిపాలనకు సుదీర్ఘమైన అంతరాయపు ప్రారంభాన్ని ఈ సంఘటన సూచించింది. దాదాపు ఆరు శతాబ్దాల తర్వాత, అంతరాయం కలుగజేయబడిన ఈ పరిపాలనా కాలం ఇంకా అమలులో ఉందని యేసు సూచించాడు, ఎందుకంటే ఆయనిలా చెప్పాడు: “అన్యజనముల కాలములు సంపూర్ణమగువరకు యెరూషలేము అన్యజనములచేత త్రొక్కబడును.”—లూకా 21:24.

17. (ఎ) “అన్యజనముల కాలములు” అంటే ఏమిటి, అవి ఎంత కాలం ఉండవలసి ఉండెను? (బి) “అన్యజనముల కాలములు” ఎప్పుడు ప్రారంభమయ్యాయి, ఎప్పుడు ముగిశాయి?

17 “అన్యజనముల కాలము”లలో, దేవుడు ఆమోదించిన పరిపాలనకు అంతరాయం కలిగించేందుకు లోక ప్రభుత్వాలు అనుమతించబడతాయి. సా.శ.పూ. 607 లో యెరూషలేము నాశనంతో ఆ కాలం ప్రారంభమయ్యింది, అది “ఏడు కాలములు” కొనసాగుతుందని దానియేలు సూచించాడు. (దానియేలు 4:23-25) అదెంత కాలము? మూడున్నర “కాలములు” అంటే 1,260 దినాలకు సమానమని బైబిలు చూపిస్తుంది. (ప్రకటన 12:6, 14) ఆ కాలం యొక్క రెండింతలు లేక ఏడు కాలములు అంటే 2,520 దినాలు అవుతాయి. కాని ఆ కొద్ది కాలం అంతాన విశేషమైనదేది జరుగలేదు. అయితే దానియేలు ప్రవచనానికి “దినమునకు ఒక సంవత్సరము” అన్వయించి, సా.శ.పూ. 607 నుండి 2,520 సంవత్సరాలు లెక్కిస్తే, మనం సా.శ. 1914వ సంవత్సరానికి చేరుకుంటాము.—సంఖ్యాకాండము 14:34; యెహెజ్కేలు 4:6.

18. రాజ్యాధికారాన్ని పొందిన వెంటనే యేసు ఏమి చేశాడు, ఇది భూమిపై ఏ ప్రభావాన్ని చూపింది?

18 ఆ కాలంలో యేసు పరలోకంలో పరిపాలన ప్రారంభించాడా? ఆయన అలా చేశాడనే దానికి లేఖనాధార కారణాలు తర్వాతి అధ్యాయంలో చర్చించబడతాయి. అయితే యేసు పరిపాలన యొక్క ప్రారంభం వెంటనే భూమిపై సమాధానంతో ఏమీ గుర్తించబడదు. రాజ్యాన్ని పొందిన వెంటనే, యేసు సాతానును, దయ్యాలైన దూతలను పరలోకం నుండి క్రిందికి పడద్రోశాడని ప్రకటన 12:7-12 చూపిస్తుంది. భూమికి శ్రమ అని దీని భావం, కాని అపవాదికి “సమయము కొంచెమే” మిగిలి ఉందని చదవడం సంతోషాన్ని కలిగిస్తుంది. త్వరలోనే దేవుని రాజ్యం పరిపాలిస్తుందనే కాదు, అది భూమికి మరియు విధేయులైన మానవజాతికి ఆశీర్వాదాలను తెస్తుందని కూడా మనం ఆనందించగలుగుతాము. (కీర్తన 72:7, 8) ఇది త్వరలోనే సంభవిస్తుందని మనకెలా తెలుసు?

[అధస్సూచీలు]

^ పేరా 9 షిలోహు అనే పేరుకు “ఎవరి హక్కైయున్నదో అతడు; అది ఎవరికి చెందుతుందో అతడు” అని భావం. తగిన సమయంలో, “షిలోహు” అంటే “యూదా గోత్రపు సింహము” అయిన యేసుక్రీస్తు అని స్పష్టమయ్యింది. (ప్రకటన 5:5) కొన్ని యూదా తర్జుమాలు “షిలోహు” అనే పదానికి మారుగా “మెస్సీయ” లేక “రాజైన మెస్సీయ” అనే పదాలను వాడాయి.

మీ జ్ఞానాన్ని పరీక్షించుకోండి

దేవుని రాజ్యం అంటే ఏమిటి, అది ఎక్కడి నుండి పరిపాలిస్తుంది?

రాజ్య పాలకులెవరు, దాని పౌరులెవరు?

తన రాజ్యం వాస్తవమైందని యెహోవా మనకు ఎలా నిశ్చయత కలుగజేశాడు?

“అన్యజనముల కాలములు” ఎప్పుడు ప్రారంభమయ్యాయి, ఎప్పుడు ముగుస్తాయి?

[అధ్యయన ప్రశ్నలు]

[94వ పేజీలోని బాక్సు]

దేవుని రాజ్యానికి సంబంధించిన కొన్ని ప్రాముఖ్యమైన సంఘటనలు

• అపవాదియగు సాతాను అయిన సర్పం తలను చితుకగొట్టే ‘సంతానాన్ని’ ఉత్పన్నం చేసే తన సంకల్పాన్ని గూర్చి యెహోవా ప్రకటిస్తున్నాడు.—ఆదికాండము 3:15.

• సా.శ.పూ. 1943 లో, ఈ “సంతానము” అబ్రాహాము నుండి వచ్చిన మానవుడైయుంటాడని యెహోవా సూచిస్తున్నాడు.—ఆదికాండము 12:1-3, 7; 22:18.

• సా.శ.పూ. 1513 లో ఇశ్రాయేలీయులకు ఇవ్వబడిన ధర్మశాస్త్రం “రాబోవుచున్న మేలుల ఛాయ”ను అందజేస్తుంది.—నిర్గమకాండము 24:6-8; హెబ్రీయులు 10:1.

• ఇశ్రాయేలీయుల భూ రాజ్యం సా.శ.పూ. 1117 లో ప్రారంభమౌతుంది, ఆ తర్వాత అది దావీదు వంశమందు కొనసాగుతుంది.—1 సమూయేలు 11:15; 2 సమూయేలు 7:8, 16.

• సా.శ.పూ. 607 లో యెరూషలేము నాశనం చేయబడి, “అన్యజనముల కాలములు” ప్రారంభమౌతాయి.—2 రాజులు 25:8-10, 25, 26; లూకా 21:24.

• సా.శ. 29 లో యేసు నియమిత రాజుగా అభిషేకించబడి, తన భూ పరిచర్యను కొనసాగిస్తాడు.—మత్తయి 3:16, 17; 4:17; 21:9-11.

• తన పరిపాలన ప్రారంభమయ్యే వరకు దేవుని కుడిపార్శ్వమున వేచివుండడానికై, యేసు సా.శ. 33 లో పరలోకానికి ఆరోహణమౌతాడు.—అపొస్తలుల కార్యములు 5:30, 31; హెబ్రీయులు 10:12, 13.

• “అన్యజనముల కాలములు” ముగుస్తుండగా, యేసు సా.శ. 1914 లో పరలోక రాజ్యంలో సింహాసనాసీనుడుగా చేయబడతాడు.—ప్రకటన 11:15.

• సాతాను, అతని దయ్యాలు భూమిపైకి పడద్రోయబడి, మానవజాతికి మరింత ఎక్కువ శ్రమను కలుగజేస్తారు.—ప్రకటన 12:9-12.

• దేవుని రాజ్యాన్ని గూర్చిన సువార్త ప్రపంచవ్యాప్తంగా ప్రకటించబడడాన్ని యేసు పర్యవేక్షిస్తున్నాడు.—మత్తయి 24:14; 28:19, 20.