కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మానవజాతిని రక్షించుటకు దేవుడేమి చేశాడు

మానవజాతిని రక్షించుటకు దేవుడేమి చేశాడు

అధ్యాయము 7

మానవజాతిని రక్షించుటకు దేవుడేమి చేశాడు

1, 2. (ఎ) దేవుని కుమారుడెవరు అనే విషయాన్ని ఒక రోమా శతాధిపతి ఎలా గుణగ్రహించగలిగాడు? (బి) యేసు మరణించడానికి యెహోవా ఎందుకు అనుమతించాడు?

దాదాపు 2,000 సంవత్సరాల క్రితం ఒక వసంతకాల మధ్యాహ్నవేళ ముగ్గురు వ్యక్తులు మెల్లిగా, వేదనభరితమైన మరణాన్ని పొందడం ఒక రోమా శతాధిపతి చూశాడు. ఆ సైనికుడు అలా మరణించిన వారిలో ఒకరైన యేసుక్రీస్తును ప్రాముఖ్యంగా గమనించాడు. యేసు ఒక మ్రానుకు మేకులతో కొట్టబడ్డాడు. ఆయన మరణ సమయం ఆసన్నమైనప్పుడు మధ్యాహ్న సమయంలో ఆకాశం నల్లగా మారింది. ఆయన మరణించినప్పుడు, భూమి భయంకరంగా కంపించింది, సైనికుడు ఇలా అన్నాడు: “నిజముగా ఈ మనుష్యుడు దేవుని కుమారుడే.”—మార్కు 15:39.

2 దేవుని కుమారుడా! ఆ సైనికుడు చెప్పింది నిజమే. భూమ్మీద మరింకెప్పుడూ జరుగబోని అత్యంత ప్రాముఖ్యమైన సంఘటనను ఆయన ఇప్పుడే చూశాడు. అంతకు ముందు, దేవుడు తానే యేసును తన ప్రియ కుమారుడని పిలిచాడు. (మత్తయి 3:17; 17:5) యెహోవా తన కుమారుడు మరణించడాన్ని ఎందుకు అనుమతించాడు? ఎందుకంటే, మానవజాతిని పాపమరణాల నుండి రక్షించడానికి ఇది దేవుని మార్గమైయుండెను.

ఒక ప్రత్యేకమైన సంకల్పం కొరకు ఎన్నుకొనబడ్డాడు

3. మానవజాతికి సంబంధించి ఒక ప్రత్యేకమైన సంకల్పం కొరకు దేవుని అద్వితీయ కుమారుడే ఎన్నుకోబడడం ఎందుకు తగినదైయుండెను?

3 మనం ఈ పుస్తకంలో ముందు నేర్చుకొన్నట్లుగా, యేసుకు మానవ పూర్వపు ఉనికి ఉంది. యెహోవా ఆయనను స్వయంగా సృష్టించాడు గనుక ఆయన దేవుని ‘అద్వితీయ కుమారుడు’ అని పిలువబడ్డాడు. ఆ తర్వాత దేవుడు ఇతర వాటన్నిటినీ ఉనికిలోకి తేవడానికి యేసును ఉపయోగించుకున్నాడు. (యోహాను 3:18; కొలొస్సయులు 1:16) యేసు మానవజాతి ఎడల ప్రత్యేకంగా అభిమానం కలిగివుండేవాడు. (సామెతలు 8:30, 31) మానవజాతి మరణశిక్ష క్రిందకు వచ్చినప్పుడు, ఒక ప్రత్యేకమైన సంకల్పాన్ని నెరవేర్చడానికి యెహోవా తన అద్వితీయ కుమారున్ని ఎన్నుకోవడంలో ఆశ్చర్యం లేదు!

4, 5. యేసు భూమ్మీదికి రాకముందు, మెస్సీయ సంబంధిత సంతానాన్ని గూర్చి బైబిలు ఏమి బయల్పర్చింది?

4 ఏదెను తోటలో ఆదాము, హవ్వ మరియు సాతానుపై తీర్పుతీరుస్తున్నప్పుడు, దేవుడు భవిష్యత్‌ విమోచకున్ని “సంతానము” అని అన్నాడు. “ఆది సర్పమైన” అపవాదియగు సాతాను తీసుకువచ్చిన భయంకరమైన వేదనలను ఈ సంతానం తీసివేస్తుంది. వాస్తవానికి, వాగ్దానం చేయబడిన సంతానం సాతానును, అతన్ని అనుసరించిన వారినందరిని నలుగగొడుతుంది.—ఆదికాండము 3:15; 1 యోహాను 3:8; ప్రకటన 12:9.

5 శతాబ్దాల కాలంలో, మెస్సీయ అని కూడా పిలువబడిన సంతానాన్ని గూర్చి దేవుడు క్రమేణ బయల్పరిచాడు. పేజీ 37 లోని చార్టునందు చూపబడినట్లుగా, అనేకానేక ప్రవచనాలు భూమిపై ఆయన జీవితంలోని అనేక అంశాలను గూర్చిన వివరాలను అందించాయి. ఉదాహరణకు, దేవుని సంకల్పంలో తన పాత్రను నిర్వహించడానికి ఆయన తీవ్రమైన బాధను సహించవలసి వచ్చింది.—యెషయా 53:3-5.

మెస్సీయ ఎందుకు మరణిస్తాడు

6. దానియేలు 9:24-26 ప్రకారం, మెస్సీయ ఏమి సాధించగలడు, ఎలా?

6 దేవుని అభిషిక్తుడైన మెస్సీయ ఒక గొప్ప సంకల్పాన్ని నెరవేరుస్తాడని దానియేలు 9:24-26 నందు వ్రాయబడిన ప్రవచనం ముందే తెలియజేసింది. ఆయన “తిరుగుబాటును మాన్పుటకును, పాపమును నివారణ చేయుటకును, దోషము నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకును,” నిరంతరం “నీతిని బయలు పరచుటకును” భూమ్మీదికి వస్తాడు. మెస్సీయ విశ్వాసంగల మానవజాతి నుండి మరణ శిక్షను తొలగిస్తాడు. అయితే ఆయన దీన్నెలా చేస్తాడు? ఆయన “నిర్మూలము” చేయబడతాడని లేక చంపబడతాడని ప్రవచనం వివరిస్తుంది.

7. యూదులు జంతు బలులను ఎందుకు అర్పించేవారు, ఇవి దేనికి ముంగుర్తులు?

7 దోషము నిమిత్తము ప్రాయశ్చిత్తం చేయాలనే విషయం ప్రాచీన ఇశ్రాయేలీయులకు బాగా తెలుసు. మోషే ద్వారా దేవుడు వారికిచ్చిన ధర్మశాస్త్రం క్రింద తమ ఆరాధనలో క్రమంగా వాళ్లు జంతుబలులను అర్పించేవారు. తమ పాపములకు ప్రాయశ్చిత్తము చేయడానికి, లేక వాటి పరిహారానికి మానవులకు ఏదైనా అవసరమని ఇవి ఇశ్రాయేలు ప్రజలకు జ్ఞాపకం చేసేవి. అపొస్తలుడైన పౌలు ఆ సూత్రాన్ని ఇలా క్లుప్తీకరించాడు: ‘రక్తము చిందింపకుండ పాపక్షమాపణ కలుగదు.’ (హెబ్రీయులు 9:22) క్రైస్తవులు, బలుల వంటివి అవసరమైన ధర్మశాస్త్రం క్రింద లేరు. (రోమీయులు 10:4; కొలొస్సయులు 2:16, 17) జంతు బలులు పాపాలకు శాశ్వతమైన, పరిపూర్ణమైన క్షమాపణను తీసుకురాలేవని కూడా వారికి తెలుసు. బదులుగా, ఈ బలి అర్పణలు మరెంతో విలువైన బలికి, అంటే మెస్సీయ లేక క్రీస్తు బలికి ముంగుర్తులుగా ఉండెను. (హెబ్రీయులు 10:4, 10; గలతీయులు 3:24 పోల్చండి.) అయినప్పటికీ, మీరిలా అడుగవచ్చు, ‘మెస్సీయ మరణించడం నిజంగా అవసరమైయుండెనా?’

8, 9. ఆదాము హవ్వలు ఏ అమూల్యమైన వాటిని పోగొట్టుకున్నారు, వారి చర్యలు వారి వంశస్థులను ఎలా ప్రభావితం చేశాయి?

8 అవును, మానవజాతి రక్షించబడాలంటే మెస్సీయ మరణించవలసి ఉండెను. అలా ఎందుకో అర్థం చేసుకోవడానికి, మనం ఏదెను తోటను గుర్తు తెచ్చుకొని, ఆదాము హవ్వలు దేవునికి ఎదురు తిరిగినప్పుడు వాళ్లు కోల్పోయినదాని తీవ్రతను గ్రహించడానికి ప్రయత్నించాలి. వారి ఎదుట నిరంతర జీవం ఉంచబడింది! దేవుని పిల్లలుగా వాళ్లు, ఆయనతో నేరుగా సంబంధాన్ని కూడా కల్గియుండేవారు. కాని వాళ్లు యెహోవా పరిపాలనను నిరాకరించినప్పుడు, వాళ్లు అదంతా కోల్పోయి, మానవజాతి మీదికి పాపమరణాలను తీసుకువచ్చారు.—రోమీయులు 5:12.

9 మన మొదటి తలిదండ్రులు పెద్ద సంపదను దుర్వినియోగం చేసి, తమను తాము విపరీతమైన అప్పుల ఊబిలో పడవేసుకున్నట్లుగా ఉంది. ఆదాము హవ్వలు ఆ అప్పును తమ సంతానానికి సంక్రమింపజేశారు. మనం పరిపూర్ణులుగా, పాపం లేకుండా జన్మించలేదు గనుక, మనలో ప్రతి ఒక్కరం పాపం గలవారము, మరణిస్తున్నాము. మనం అనారోగ్యులమైనప్పుడు లేక మనం వెనక్కు తీసుకోగలిగితే బాగుండు ననుకొనేలాంటి గాయపర్చే మాటేదైనా అన్నప్పుడు, మనం వారసత్వంగా పొందిన అప్పు అంటే మానవ అపరిపూర్ణతా ప్రభావాన్ని అనుభవిస్తున్న వారిగా ఉంటాము. (రోమీయులు 7:21-25) ఆదాము కోల్పోయిన దాన్ని తిరిగిపొందడమే మన ఏకైక నిరీక్షణ. అయితే, మనం పరిపూర్ణ మానవ జీవితాన్ని సంపాదించుకోలేము. అపరిపూర్ణ మానవులందరూ పాపం చేస్తారు గనుక, మనమందరం జీవాన్ని కాదుగాని మరణాన్ని సంపాదించుకుంటాము.—రోమీయులు 6:23.

10. ఆదాము పోగొట్టుకున్నదాన్ని తిరిగి పొందడానికి ఏమి అవసరమై యుండెను?

10 అయినప్పటికీ, ఆదాము పోగొట్టుకున్న జీవానికి మారుగా ఏదైనా అర్పించబడగలదా? దేవుని న్యాయ ప్రమాణానికి సమతుల్యత అవసరం, అదే “ప్రాణమునకు ప్రాణము.” (నిర్గమకాండము 21:23) కాబట్టి, పోగొట్టుకొనబడిన జీవం కొరకు మరో జీవం అర్పించబడాలి. కేవలం ఏ మానవుని జీవమైనా సరిపోదు. అపరిపూర్ణ మానవుల గురించి కీర్తన 49:7-9 ఇలా చెబుతుంది: “ఎవడును ఏ విధముచేతనైనను తన సహోదరుని విమోచింపలేడు . . . వాని నిమిత్తము దేవుని సన్నిధిని ప్రాయశ్చిత్తము చేయగలవాడు ఎవడును లేడు (వారి ప్రాణవిమోచన ధనము బహు గొప్పది అది ఎన్నటికిని తీరక అట్లుండవలసినదే).” కాబట్టి పరిస్థితి నిరాశాజనకంగా ఉందా? నిశ్చయంగా అలా లేదు.

11. (ఎ) హెబ్రీ భాషలో “విమోచన” దేన్ని సూచిస్తుంది? (బి) ఎవరు మాత్రమే మానవజాతిని విడిపించగలరు, ఎందుకు?

11 హెబ్రీ భాషలో, “విమోచన క్రయధనము” అనే పదం చెరపట్టబడిన వ్యక్తిని విడిపించడానికి కట్టే సొమ్మును సూచిస్తుంది, సరిసమానమైన అనే భావాన్ని కూడా ఇస్తుంది. ఆదాము కోల్పోయిన దానికి సమానమైనదాన్ని పరిపూర్ణ మానవజీవం గల మనిషి మాత్రమే అర్పించగలడు. ఆదాము తర్వాత, భూమిపై జన్మించిన పరిపూర్ణమైన మనిషి యేసుక్రీస్తు మాత్రమే. అందుకే బైబిలు యేసును “కడపటి ఆదాము” అని పిలుస్తూ, క్రీస్తు “అందరికొరకు విమోచన క్రయధనముగా తన్నుతానే సమర్పించుకొనెను” అని మనకు ధైర్యాన్నిస్తుంది. (1 కొరింథీయులు 15:45; 1 తిమోతి 2:5, 6) ఆదాము తన పిల్లలకు మరణాన్ని అందిస్తే, యేసు మాత్రం నిత్యజీవాన్నిచ్చాడు. మొదటి కొరింథీయులు 15:22 ఇలా వివరిస్తుంది: “ఆదామునందు అందరు ఏలాగు మృతిపొందుచున్నారో, ఆలాగుననే క్రీస్తునందు అందరు బ్రదికింపబడుదురు.” కాబట్టి యుక్తంగానే యేసు “నిత్యుడగు తండ్రి” అని పిలువబడ్డాడు.—యెషయా 9:6, 7.

విమోచన క్రయధనం ఎలా చెల్లించబడింది

12. యేసు ఎప్పుడు మెస్సీయ అయ్యాడు, ఆ తర్వాత ఆయన ఎటువంటి జీవిత విధానాన్ని అనుసరించాడు?

12 సా.శ. 29 ముగింపులో, బాప్తిస్మం తీసుకొని, తద్వారా దేవుని చిత్తాన్ని చేయడానికి తనను తాను సమర్పించుకొనేందుకు యేసు తన బంధువైన యోహాను దగ్గరికి వెళ్లాడు. ఆ సందర్భంలో యెహోవా యేసును పరిశుద్ధాత్మతో అభిషేకించాడు. అలా యేసు మెస్సీయ లేక దేవునిచే అభిషేకించబడిన క్రీస్తు అయ్యాడు. (మత్తయి 3:16, 17) ఆ తర్వాత యేసు తన మూడున్నర సంవత్సరాల పరిచర్యను ప్రారంభించాడు. ఆయన దేవుని రాజ్యాన్ని గూర్చి ప్రకటిస్తూ, నమ్మకమైన అనుచరులను సమకూరుస్తూ తన స్వదేశమందంతటా ప్రయాణించాడు. అయినా ముందుగా ప్రవచించబడినట్లుగా, త్వరలోనే ఆయనకు వ్యతిరేకత ఎదురైంది.—కీర్తన 118:22; అపొస్తలుల కార్యములు 4:8-11.

13. యేసు యథార్థవంతుడుగా మరణించడానికి ఏ సంఘటనలు నడిపించాయి?

13 యేసు మతనాయకుల వేషధారణను ధైర్యంగా బహిర్గతం చేశాడు, వాళ్లు ఆయనను చంపాలని ప్రయత్నించారు. చివరికి వాళ్లు, మోసగించడం, అనుచితమైన నిర్బంధం, చట్టవ్యతిరేకమైన శిక్ష, రాజద్రోహానికి సంబంధించిన అబద్ధ ఆరోపణ వంటివి ఇమిడివున్న అసహ్యమైన పథకాన్ని రూపొందించారు. యేసు కొట్టబడ్డాడు, మీద ఉమ్మివేయబడ్డాడు, అపహాస్యం చేయబడ్డాడు, ఆయన శరీరాన్ని చీల్చడానికి తయారుచేయబడిన కొరడాతో కొట్టబడ్డాడు. రోమా అధిపతియైన పొంతి పిలాతు ఆ తర్వాత ఆయనకు హింసాకొయ్యపై మరణశిక్ష విధించాడు. ఆయన ఒక కొయ్య స్తంభానికి మేకులతో కొట్టబడి, అక్కడ నిలువుగా వ్రేలాడదీయబడ్డాడు. ప్రతి శ్వాస వేదనభరితమైనదిగా ఉంది, ఆయన మరణించడానికి కొన్ని గంటల సమయం పట్టింది. యేసు ఆ కష్టసమయమంతటిలో దేవుని ఎడల పరిపూర్ణమైన యథార్థతను కనబర్చాడు.

14. తన కుమారుడు బాధపడి, మరణించడానికి దేవుడు ఎందుకు అనుమతించాడు?

14 అలా, సా.శ. 33 నీసాను 14న యేసు “అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా” తన జీవితాన్ని ఇచ్చాడు. (మార్కు 10:45; 1 తిమోతి 2:5, 6) తన ప్రియకుమారుడు బాధపడి, మరణించడాన్ని యెహోవా పరలోకం నుండి చూడగలిగాడు. అలాంటి భయంకరమైన సంగతి జరగడానికి దేవుడు ఎందుకు అనుమతించాడు? ఆయన మానవజాతిని ప్రేమించాడు గనుక అలా చేశాడు. యేసు ఇలా చెప్పాడు: “దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. కాగా ఆయన తన అద్వితీయకుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను.” (యోహాను 3:16) యేసు మరణం యెహోవా పరిపూర్ణ న్యాయంగల దేవుడని కూడా మనకు బోధిస్తుంది. (ద్వితీయోపదేశకాండము 32:4) దేవుడు ప్రాణానికి ప్రాణాన్ని కోరే తన న్యాయ సూత్రాలను వదిలేసి, ఆదాము పాపానికి మూల్యాన్ని చెల్లించకుండా ఎందుకు విడిచిపెట్టలేదు అని కొందరు ఆలోచించవచ్చు. కారణమేమిటంటే, యెహోవా చివరికి తానే గొప్ప మూల్యం చెల్లించవలసి వచ్చినప్పటికీ ఎల్లప్పుడూ తన సూత్రాలకు కట్టుబడి ఉంటూ వాటిని ఉన్నతపరుస్తాడు.

15. యేసు ఉనికి శాశ్వతంగా అంతమొందడాన్ని అనుమతించడం అన్యాయమై ఉండేది గనుక, యెహోవా ఏమి చేశాడు?

15 యెహోవా యొక్క న్యాయం, యేసు మరణానికి సంతోషభరితమైన ఫలితాన్ని కోరింది. అయితే, నమ్మకమైన యేసును మరణమందు నిరంతరం నిద్రించడానికి అనుమతించడంలో న్యాయం ఉండగలదా? ఉండదు! దేవుని నమ్మకమైనవాడు సమాధిలోనే ఉండిపోడని హెబ్రీ లేఖనాలు ప్రవచించాయి. (కీర్తన 16:10; అపొస్తలుల కార్యములు 13:35) ఆయన పాక్షికంగా మూడు దినాలపాటు మరణమందు నిద్రించాడు, ఆ తర్వాత యెహోవా దేవుడు ఆయనను బలమైన ఆత్మగానున్న ప్రాణిగా పునరుత్థానం చేశాడు.—1 పేతురు 3:18.

16. పరలోకానికి తిరిగి వెళ్లిన తర్వాత యేసు ఏమి చేశాడు?

16 యేసు తన మరణమందు తన మానవ జీవితాన్ని శాశ్వతంగా అప్పగించాడు. పరలోకంలో జీవానికి లేపబడడం ద్వారా ఆయన జీవాన్నిచ్చే ఆత్మ అయ్యాడు. అంతేగాక, యేసు విశ్వంలోనే అత్యంత పరిశుద్ధమైన స్థలానికి ఆరోహణమైనప్పుడు, ఆయన తన ప్రియమైన తండ్రితో మళ్లీ కలుసుకొని తన పరిపూర్ణ మానవ జీవిత విలువను ఆయనకు పద్ధతిప్రకారం అందజేశాడు. (హెబ్రీయులు 9:23-28) అప్పుడు ఆ అమూల్యమైన జీవితం యొక్క విలువ విధేయులైన మానవజాతికి అన్వయించబడగలదు. మీకు దాని భావం ఏమైవుంది?

క్రీస్తు విమోచన క్రయధనం మరియు మీరు

17. క్రీస్తు విమోచన క్రయధన బలి ఆధారంగా మనమెలా క్షమాపణ పొందగలము?

17 ఇప్పుడు కూడా క్రీస్తు యొక్క విమోచన క్రయధన బలి మీకు ప్రయోజనకరం కాగల మూడు మార్గాలను పరిశీలించండి. మొదటిగా, అది పాపాలకు క్షమాపణ తెస్తుంది. చిందింపబడిన యేసు రక్తమందు విశ్వాసముంచడం ద్వారా, మనకు “విమోచనము,” అవును “మన అపరాధములకు క్షమాపణ” కలుగుతుంది. (ఎఫెసీయులు 1:7) కాబట్టి మనం ఒకవేళ గంభీరమైన పాపం చేసినప్పటికీ, మనం యేసు నామమున క్షమాపణ కొరకు దేవున్ని అడుగవచ్చు. మనం నిజంగా పశ్చాత్తాపపడితే, యెహోవా మనకు తన కుమారుని విమోచన క్రయధన బలి విలువను అన్వయిస్తాడు. పాపం చేయడం ద్వారా మనంపొందే మరణశిక్షను అమలుచేసే బదులు దేవుడు మనకు మంచి మనస్సాక్షి అనే ఆశీర్వాదాన్నిస్తూ, మనల్ని క్షమిస్తాడు.—అపొస్తలుల కార్యములు 3:19; 1 పేతురు 3:21.

18. యేసు బలి మనకు ఏ విధంగా నిరీక్షణను అందజేస్తుంది?

18 రెండవదిగా, క్రీస్తు విమోచన క్రయధన బలి మన భవిష్యత్తు కొరకైన నిరీక్షణకు ఆధారాన్ని అందిస్తుంది. “యెవడును లెక్కింపజాలని యొక గొప్ప సమూహము” ఈ విధానం యొక్క రాబోతున్న నాశనకరమైన అంతాన్ని తప్పించుకొంటుందని అపొస్తలుడైన యోహాను దర్శనంలో చూశాడు. దేవుడు అనేకమైన ఇతరులను నాశనం చేస్తున్నప్పుడు వాళ్లు ఎందుకు తప్పించుకుంటారు? గొప్ప సమూహము వారు, “గొఱ్ఱెపిల్ల” అయిన యేసుక్రీస్తు “రక్తములో తమ వస్త్రములను ఉదుకుకొని వాటిని తెలుపుచేసికొనిరి” అని ఒక దేవదూత యోహానుకు చెప్పాడు. (ప్రకటన 7:9, 14) చిందింపబడిన యేసుక్రీస్తు రక్తమందు మనం విశ్వాసముంచి, దైవిక నియమాలకు అనుగుణంగా జీవించినంత వరకు మనం దేవుని దృష్టిలో పరిశుభ్రంగా ఉండి, నిత్యజీవ నిరీక్షణను కలిగివుండగలము.

19. తాను, తన తండ్రి మిమ్మల్ని ప్రేమిస్తున్నారని క్రీస్తు బలి ఎలా నిరూపించింది?

19 మూడవదిగా, విమోచన క్రయధన బలి యెహోవా ప్రేమకు అత్యుత్తమ నిదర్శనము. క్రీస్తు మరణం విశ్వ చరిత్రలో ప్రేమకు సంబంధించిన రెండు అతి గొప్ప క్రియలను వెల్లడిపర్చింది: (1) మన నిమిత్తం మరణించడానికి తన కుమారున్ని పంపడంలోని దేవుని ప్రేమ; (2) విమోచన క్రయధనంగా తనను తాను ఇష్టపూర్వకంగా సమర్పించుకోవడంలోని యేసు ప్రేమ. (యోహాను 15:13; రోమీయులు 5:8) ఒకవేళ మనం నిజంగా విశ్వాసం కలిగివుంటే, ఈ ప్రేమ మనలో ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది. అపొస్తలుడైన పౌలు ఇలా చెప్పాడు: ‘దేవుని కుమారుడు నన్ను ప్రేమించి, నా కొరకు తన్నుతాను అప్పగించుకొనెను.’—గలతీయులు 2:20; హెబ్రీయులు 2:9; 1 యోహాను 4:9, 10.

20. యేసు విమోచన క్రయధన బలియందు మనమెందుకు విశ్వాసం కలిగి ఉండాలి?

20 గనుక, యేసు విమోచన క్రయధన బలియందు విశ్వాసముంచడం ద్వారా, దేవుడు మరియు క్రీస్తు ప్రదర్శించిన ప్రేమ ఎడల మన కృతజ్ఞతను చూపిద్దాము. అలా చేయడం నిత్యజీవానికి నడిపిస్తుంది. (యోహాను 3:36) అయినప్పటికీ, ఈ భూమిపై యేసు జీవితానికి మరియు మరణానికి మన రక్షణే అత్యంత ప్రాముఖ్యమైన కారణం కాదు. ఆయన శ్రద్ధ కలిగివున్నది మరింత గొప్ప అంశాన్ని గూర్చి అంటే విశ్వానికి సంబంధించిన ఒక అంశాన్ని గూర్చి. మనం తర్వాతి అధ్యాయంలో చూడబోతున్నట్లుగా, ఆ అంశం మనందరికీ సంబంధించినది, ఎందుకంటే దేవుడు ఈ లోకంలో దుష్టత్వాన్ని, బాధను ఇంత కాలం ఎందుకు ఉండనిచ్చాడో అది చూపిస్తుంది.

మీ జ్ఞానాన్ని పరీక్షించుకోండి

మానవజాతిని రక్షించడానికి యేసు ఎందుకు మరణించవలసి ఉండెను?

విమోచన క్రయధనం ఎలా చెల్లించబడింది?

విమోచన క్రయధనం నుండి మీరు ఏయే విధాలుగా ప్రయోజనం పొందగలరు?

[అధ్యయన ప్రశ్నలు]

[67వ పేజీలో పూర్తి-పేజీ చిత్రం ఉంది]