కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

5వ కథ

కష్టమైన జీవితం మొదలవడం

కష్టమైన జీవితం మొదలవడం

ఏదెను తోట బయట ఆదాము హవ్వలకు ఎన్నో కష్టాలు ఎదురయ్యాయి. ఆహారం కోసం వాళ్ళు కష్టపడి పని చెయ్యవలసి వచ్చింది. అందమైన ఫలవృక్షాలకు బదులు తమ చుట్టూ ముండ్లపొదలు, గచ్చతుప్పలు పెరగడం వాళ్ళు చూశారు. ఆదాము హవ్వలు దేవునికి అవిధేయత చూపించి ఆయనకు స్నేహితులుగా ఉండడం మానుకున్నప్పుడు అలా జరిగింది.

అంతకంటే దారుణమేమిటంటే, ఆదాము హవ్వలు క్రమేణా చనిపోయే పరిస్థితి వచ్చింది. ఒకానొక చెట్టు పండు తింటే చనిపోతారని దేవుడు వాళ్ళను హెచ్చరించాడని జ్ఞాపకం చేసుకోండి. వారు అలా తిన్న రోజునే చావుకు దగ్గరయ్యారు. వాళ్ళు దేవుని మాట వినకపోవడం ఎంతటి బుద్ధిహీనతో కదా!

ఆదాము హవ్వల పిల్లలు, దేవుడు తమ తలిదండ్రులను ఏదెను తోటనుండి బయటకు పంపించిన తర్వాతే పుట్టారు. అంటే పిల్లలు కూడా ముసలివాళ్ళై చనిపోతారు.

ఆదాము హవ్వలు దేవునికి విధేయత చూపించివుంటే వాళ్ళు, వాళ్ళ పిల్లలు సంతోషంగా జీవించేవారు. వాళ్ళందరూ భూమ్మీద సంతోషంగా నిరంతరం జీవించేవారు. ఎవ్వరూ ముసలి వాళ్ళయ్యేవారు కాదు, రోగులై చనిపోయేవారు కాదు.

ప్రజలు సంతోషంగా నిరంతరం జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఒక రోజు వాళ్ళు అలా తప్పకుండా జీవిస్తారని కూడా దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. భూమంతా అందంగా ఉండడమే కాకుండా ప్రజలందరూ ఆరోగ్యంగా ఉంటారు. భూమ్మీద ప్రతి ఒక్కరు మిగతా అందరికి, అలాగే దేవునికి మంచి స్నేహితులై ఉంటారు.

కానీ హవ్వ ఇక ఎంతమాత్రం దేవునికి స్నేహితురాలు కాదు. అందుకే పిల్లలను కనేటప్పుడు ఆమెకు చాలా కష్టమయ్యింది. ఆమె వేదన అనుభవించింది. యెహోవాకు అవిధేయత చూపించడం ఖచ్చితంగా ఆమెకు ఎంతో దుఃఖాన్ని కలిగించిందని మీరు అంగీకరించరా?

ఆదాము హవ్వలకు చాలామంది కుమారులు, కుమార్తెలు పుట్టారు. వాళ్ళకు మొదటి కుమారుడు పుట్టినప్పుడు అతనికి కయీను అని పేరు పెట్టారు. రెండవ కుమారునికి హేబెలు అని పేరు పెట్టారు. వారికేమి జరిగింది? మీకు తెలుసా?