కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

53వ కథ

యెఫ్తా వాగ్దానం

యెఫ్తా వాగ్దానం

మీరు ఎప్పుడైనా ఒక వాగ్దానం చేసిన తర్వాత దానిని నిలబెట్టుకోవడం కష్టంగా ఉన్నట్లు భావించారా? ఈ చిత్రంలోని వ్యక్తికి అలాగే జరిగింది, అందుకే ఆయన చాలా దుఃఖిస్తున్నాడు. ఆ వ్యక్తి యెఫ్తా అనే పేరుగల ధైర్యవంతుడైన ఇశ్రాయేలు న్యాయాధిపతి.

యెఫ్తా ఇశ్రాయేలీయులు యెహోవాను ఆరాధించడం మానుకున్న కాలంలో జీవించాడు. ఇశ్రాయేలీయులు మళ్ళీ చెడ్డ పనులు చేయడం ప్రారంభించారు. కాబట్టి వాళ్ళను అమ్మోనీయులు బాధపెట్టేందుకు యెహోవా అనుమతించాడు. అప్పుడు ఇశ్రాయేలీయులు, ‘మేము నీకు వ్యతిరేకముగా పాపము చేశాం. దయచేసి మమ్మల్ని రక్షించు!’ అని యెహోవాకు మొరపెట్టుకున్నారు.

ప్రజలు తాము చేసిన చెడ్డ పనుల విషయంలో బాధపడ్డారు. వాళ్ళు మళ్ళీ యెహోవాను ఆరాధించడం ద్వారా తమ సంతాపాన్ని తెలియజేశారు. కాబట్టి మళ్ళీ యెహోవా వాళ్ళకు సహాయం చేశాడు.

చెడ్డ ప్రజలైన అమ్మోనీయులతో యుద్ధం చేయడానికి ఇశ్రాయేలీయులు యెఫ్తాను ఎన్నుకున్నారు. యుద్ధంలో యెహోవా తనకు సహాయం చేయాలని యెఫ్తా ఎంతగానో కోరుకున్నాడు. కాబట్టి ఆయన యెహోవాకు ఇలా వాగ్దానం చేశాడు: ‘అమ్మోనీయులపై నువ్వు నాకు విజయం చేకూరిస్తే, విజయోత్సాహంతో నేను తిరిగి వెళ్ళినప్పుడు నన్ను కలవడానికి నా ఇంట్లోనుండి వచ్చే మొదటి వ్యక్తిని నేను నీకు అర్పిస్తాను.’

యెహోవా యెఫ్తా వాగ్దానాన్ని అంగీకరించి ఆయన విజయం పొందేలా సహాయం చేశాడు. యెఫ్తా ఇంటికి వెళ్ళినప్పుడు ఆయనను కలవడానికి బయటికి వచ్చిన మొదట వ్యక్తి ఎవరో మీకు తెలుసా? ఆయన ఒక్కగానొక్క కుమార్తే వచ్చింది. ‘నా కుమారీ! నాకు ఎంత దుఃఖాన్ని కలుగజేస్తున్నావు. నేను యెహోవాకు వాగ్దానం చేశాను, దానిని నేను వెనుకకు తీసుకోలేను’ అని యెఫ్తా విలపించాడు.

యెఫ్తా కుమార్తె ఆ వాగ్దానం గురించి విన్నప్పుడు మొదట ఆమె కూడా దుఃఖించింది. ఎందుకంటే ఆమె తన తండ్రిని, స్నేహితులను విడిచి వెళ్ళాలి. ఆమె తన మిగతా జీవితాన్నంతా షిలోహులో యెహోవా మందిరంలో ఆయనకు సేవచేస్తూ గడపాలి. కాబట్టి ఆమె తన తండ్రితో ‘నువ్వు యెహోవాకు వాగ్దానం చేస్తే దాన్ని నిలబెట్టుకోవాలి’ అన్నది.

ఆ విధంగా యెఫ్తా కుమార్తె షిలోహుకు వెళ్ళి తన మిగతా జీవితాన్నంతా యెహోవాను సేవిస్తూ ఆయన మందిరంలోనే గడిపింది. ఇశ్రాయేలు స్త్రీలు సంవత్సరంలో నాలుగు రోజులు ఆమెను దర్శించడానికి వెళ్ళి, ఆమెతో సంతోషంగా సమయం గడిపేవారు. యెఫ్తా కుమార్తె యెహోవాకు చాలా మంచి సేవకురాలు కాబట్టి ప్రజలు ఆమెను ఎంతగానో ప్రేమించారు.