మత్తయి 15:1-39

  • మనుషుల ఆచారాల్ని బట్టబయలు చేయడం  (1-9)

  • అపవిత్రమైనవి హృదయంలో నుండి వస్తాయి (10-20)

  • ఫేనీకే స్త్రీ గొప్ప విశ్వాసం  (21-28)

  • యేసు చాలా రోగాల్ని బాగుచేయడం  (29-31)

  • యేసు 4,000 మందికి ఆహారం పెట్టడం  (32-39)

15  తర్వాత, యెరూషలేము నుండి కొంతమంది పరిసయ్యులు, శాస్త్రులు యేసు దగ్గరికి వచ్చి ఇలా అన్నారు:  “నీ శిష్యులు పూర్వీకుల ఆచారాన్ని ఎందుకు ఉల్లంఘిస్తున్నారు? ఉదాహరణకు, వాళ్లు భోంచేసే ముందు చేతులు కడుక్కోవడం* లేదు.”  అప్పుడు యేసు వాళ్లతో ఇలా అన్నాడు: “మీరు మీ ఆచారం కోసం దేవుని ఆజ్ఞను ఎందుకు ఉల్లంఘిస్తున్నారు?  ఉదాహరణకు, ‘నువ్వు మీ అమ్మానాన్నల్ని గౌరవించు’ అని, ‘అమ్మనైనా, నాన్ననైనా తిట్టేవాడికి* మరణశిక్ష విధించాలి’ అని దేవుడు చెప్పాడు.  కానీ మీరేమో, ‘ఓ వ్యక్తి వాళ్ల అమ్మతో గానీ, నాన్నతో గానీ, “నా దగ్గర ఉన్నవాటిలో నీకు పనికొచ్చేదేదైనా, అది దేవునికి సమర్పించిన కానుక” అని అంటే,  అతను వాళ్ల అమ్మనైనా నాన్ననైనా ఏమాత్రం గౌరవించాల్సిన అవసరం లేదు’ అని చెప్తారు. కాబట్టి మీరు మీ ఆచారం వల్ల దేవుని వాక్యాన్ని నీరుగార్చారు.  వేషధారులారా, మీ గురించి యెషయా సరిగ్గానే ఇలా చెప్పాడు:  ‘ఈ ప్రజలు పెదవులతో నన్ను కీర్తిస్తారు కానీ వీళ్ల హృదయాల్లో నా మీద ప్రేమ లేదు.  వీళ్లు మనుషులు పెట్టిన నియమాల్ని దేవుని బోధలన్నట్టు బోధిస్తారు కాబట్టి వీళ్లు నన్ను ఆరాధిస్తూ ఉండడం వృథా.’” 10  యేసు ఆ మాటలు చెప్పాక, ప్రజల్ని తన దగ్గరికి పిలిచి ఇలా అన్నాడు: “వినండి, నేను చెప్పేది అర్థంచేసుకోండి. 11  మనిషి నోట్లోకి వెళ్లేది అతన్ని అపవిత్రం చేయదు కానీ, మనిషి నోటి నుండి బయటికి వచ్చేదే అతన్ని అపవిత్రం చేస్తుంది.” 12  అప్పుడు శిష్యులు ఆయన దగ్గరికి వచ్చి ఇలా అన్నారు: “నీ మాటలు పరిసయ్యులకు కోపం తెప్పించాయని నీకు తెలుసా?” 13  దానికి యేసు ఇలా అన్నాడు: “పరలోకంలో ఉన్న నా తండ్రి నాటని ప్రతీ మొక్క పెరికివేయబడుతుంది. 14  వాళ్లను పట్టించుకోకండి. వాళ్లే గుడ్డివాళ్లు, కానీ వేరేవాళ్లకు దారి చూపిస్తారు. ఒక గుడ్డివాడు ఇంకో గుడ్డివాడికి దారి చూపిస్తే, వాళ్లిద్దరూ గుంటలో పడతారు.” 15  అప్పుడు పేతురు, “నువ్వు ఇంతకుముందు చెప్పిన ఉదాహరణను మాకు వివరించు” అని అడిగాడు. 16  అందుకు యేసు ఇలా అన్నాడు: “మీకు కూడా ఇంకా అర్థంకాలేదా? 17  నోట్లోకి వెళ్లే ప్రతీది కడుపులోకి వెళ్లి తర్వాత బయటికి వచ్చేస్తుందని మీకు తెలీదా? 18  అయితే నోటి నుండి బయటకు వచ్చేవి ఏవైనా హృదయం నుండి వస్తాయి, అవే మనిషిని అపవిత్రం చేస్తాయి. 19  ఉదాహరణకు దుష్ట ఆలోచనలు, హత్యలు, అక్రమ సంబంధాలు, లైంగిక పాపాలు,* దొంగతనాలు, అబద్ధ సాక్ష్యాలు, దైవదూషణలు హృదయం నుండి వస్తాయి. 20  ఇవే మనిషిని అపవిత్రం చేస్తాయి, అంతేగానీ చేతులు కడుక్కోకుండా* భోంచేయడం మనిషిని అపవిత్రం చేయదు.” 21  యేసు అక్కడి నుండి బయల్దేరి తూరు, సీదోను ప్రాంతాల్లోకి వెళ్లాడు. 22  అప్పుడు ఇదిగో! ఆ ప్రాంతానికి చెందిన ఒక ఫేనీకే వాసురాలు వచ్చి, “ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణించు. మా అమ్మాయికి అపవిత్ర దూత పట్టడంవల్ల విపరీతంగా బాధపడుతోంది” అని కేకలు వేసింది. 23  కానీ యేసు ఆమెతో ఒక్క మాట కూడా మాట్లాడలేదు. కాబట్టి ఆయన శిష్యులు వచ్చి, “ఆమె మన వెనకాలే వస్తూ కేకలు వేస్తోంది, ఆమెను పంపించేయి” అని ఆయన్ని బ్రతిమాలడం మొదలుపెట్టారు. 24  అందుకు యేసు ఇలా అన్నాడు: “తప్పిపోయిన గొర్రెల్లాంటి ఇశ్రాయేలు ప్రజలకు మాత్రమే సహాయం చేయడానికి దేవుడు నన్ను పంపించాడు.” 25  అయితే ఆ స్త్రీ వచ్చి ఆయనకు సాష్టాంగ* నమస్కారం చేసి, “ప్రభువా, నాకు సహాయం చేయి!” అని అడిగింది. 26  అందుకు యేసు ఇలా అన్నాడు: “పిల్లల రొట్టెల్ని తీసుకుని కుక్కపిల్లలకు వేయడం సరికాదు.” 27  దానికి ఆ స్త్రీ, “నిజమే ప్రభువా, కానీ కుక్కపిల్లలు తమ యజమానుల బల్లమీద నుండి కిందపడే ముక్కల్ని తింటాయి కదా” అంది. 28  అప్పుడు యేసు, “అమ్మా, నీ విశ్వాసం గొప్పది; నువ్వు కోరుకున్నట్టే నీకు జరగాలి” అన్నాడు. ఆ క్షణమే ఆమె కూతురు బాగైంది. 29  తర్వాత యేసు అక్కడి నుండి బయల్దేరి గలిలయ సముద్రం దగ్గరికి వచ్చాడు. ఆయన ఒక కొండ మీదకు వెళ్లి అక్కడ కూర్చున్నాడు. 30  అప్పుడు చాలామంది ప్రజలు ఆయన దగ్గరికి వచ్చారు. వాళ్లు కుంటివాళ్లను, వికలాంగుల్ని, గుడ్డివాళ్లను, మూగవాళ్లను, ఇంకా చాలామంది రోగుల్ని తీసుకొచ్చి ఆయన పాదాల దగ్గర ఉంచారు, ఆయన వాళ్లను బాగుచేశాడు. 31  మూగవాళ్లు మాట్లాడడం, వికలాంగులు బాగుపడడం, కుంటివాళ్లు నడవడం, గుడ్డివాళ్లు చూడడం చూసి ప్రజలు చాలా ఆశ్చర్యపోయారు; వాళ్లు ఇశ్రాయేలు దేవుణ్ణి మహిమపర్చారు. 32  అయితే యేసు శిష్యుల్ని దగ్గరికి పిలిచి, “ఈ జనాన్ని చూస్తే నాకు జాలేస్తోంది. గత మూడు రోజులుగా వాళ్లు నాతోనే ఉన్నారు, తినడానికి వాళ్ల దగ్గర ఏమీ లేదు. వాళ్లను ఆకలితో పంపించేయడం నాకు ఇష్టంలేదు, అలా పంపించేస్తే వాళ్లు దారిలోనే కళ్లు తిరిగి పడిపోతారేమో” అన్నాడు. 33  కానీ శిష్యులు, “ఇంతమందికి సరిపడా ఆహారం ఈ మారుమూల ప్రాంతంలో మాకు ఎక్కడ దొరుకుతుంది?” అని ఆయనతో అన్నారు. 34  అందుకు యేసు, “మీ దగ్గర ఎన్ని రొట్టెలు ఉన్నాయి?” అని వాళ్లను అడిగాడు. “ఏడు రొట్టెలు, కొన్ని చిన్న చేపలు ఉన్నాయి” అని వాళ్లు చెప్పారు. 35  అప్పుడు ఆయన జనాన్ని నేలమీద కూర్చోమని చెప్పి, 36  ఆ ఏడు రొట్టెల్ని, చేపల్ని తీసుకున్నాడు. దేవునికి కృతజ్ఞతలు చెప్పాక, ఆయన వాటిని విరిచి తన శిష్యులకు ఇవ్వడం మొదలుపెట్టాడు; శిష్యులు వాటిని ప్రజలకు అందించారు. 37  వాళ్లంతా తృప్తిగా తిన్నారు, శిష్యులు మిగిలిన ముక్కల్ని పోగుచేసినప్పుడు ఏడు పెద్ద గంపలు* నిండాయి. 38  తిన్నవాళ్లలో స్త్రీలు, పిల్లలు కాక దాదాపు 4,000 మంది పురుషులు ఉన్నారు. 39  చివరికి యేసు ఆ ప్రజల్ని పంపించిన తర్వాత, పడవ ఎక్కి మగదాను ప్రాంతంలోకి వెళ్లాడు.

అధస్సూచీలు

అంటే, ఆచార ప్రకారం శుభ్రపర్చుకోవడం.
లేదా “అమ్మ గురించైనా, నాన్న గురించైనా చెడుగా మాట్లాడేవాడికి.”
ఇక్కడ గ్రీకులో పోర్నియా అనే పదానికి బహువచనం ఉపయోగించారు. పదకోశం చూడండి.
అంటే, ఆచార ప్రకారం శుభ్రపర్చుకోకుండా.
లేదా “వంగి.”
లేదా “సామాన్లు పెట్టుకునే పెద్దపెద్ద బుట్టలు.”