మత్తయి 20:1-34

  • ద్రాక్షతోట పనివాళ్లు, సమానంగా జీతం  (1-16)

  • యేసు చనిపోవడం గురించి మళ్లీ చెప్పడం  (17-19)

  • రాజ్యంలో స్థానాల కోసం అడగడం  (20-28)

    • ఎంతోమంది కోసం విమోచన క్రయధనంగా యేసు (28)

  • ఇద్దరు గుడ్డివాళ్లు బాగవ్వడం  (29-34)

20  “ఎందుకంటే పరలోక రాజ్యం, తన ద్రాక్షతోటలో పనివాళ్లను కూలికి పెట్టుకోవడానికి తెల్లవారుజామునే బయలుదేరిన ఒక ద్రాక్షతోట యజమానిలా ఉంది.  రోజుకు ఒక దేనారం* ఇస్తానని పనివాళ్లతో మాట్లాడుకున్నాక అతను వాళ్లను తన ద్రాక్షతోటలోకి పంపించాడు.  ఉదయం దాదాపు 9 గంటలకు* ఆ యజమాని మళ్లీ బయటికి వెళ్లినప్పుడు, పనిదొరక్క సంతలో నిలబడివున్న కొంతమందిని చూసి  వాళ్లతో, ‘మీరు కూడా ద్రాక్షతోటలోకి వెళ్లండి, మీకు న్యాయంగా ఎంత ఇవ్వాలో అంత ఇస్తాను’ అని చెప్పాడు.  దాంతో వాళ్లు వెళ్లారు. అతను మధ్యాహ్నం దాదాపు 12 గంటలకు* అలాగే దాదాపు 3 గంటలకు* మళ్లీ బయటికి వెళ్లి అలాగే చేశాడు.  చివరిగా అతను, సాయంత్రం దాదాపు 5 గంటలకు* బయటికి వెళ్లి, అక్కడ ఖాళీగా నిలబడివున్న కొంతమందిని చూసి, ‘మీరు పనిచేయకుండా రోజంతా ఎందుకు ఇక్కడ నిలబడివున్నారు?’ అని వాళ్లను అడిగాడు.  అందుకు వాళ్లు, ‘మమ్మల్ని ఎవరూ పనిలో పెట్టుకోలేదు’ అని చెప్పారు; అప్పుడు అతను వాళ్లతో, ‘మీరు కూడా ద్రాక్షతోటలోకి వెళ్లండి’ అన్నాడు.  “సాయంత్రం అయినప్పుడు ద్రాక్షతోట యజమాని తన గృహనిర్వాహకుడితో ఇలా చెప్పాడు: ‘పనివాళ్లను పిలిచి వాళ్లకు కూలి ఇవ్వు; చివర్లో వచ్చినవాళ్లతో మొదలుపెట్టి, మొదట వచ్చినవాళ్ల వరకు అందరికీ ఇవ్వు.’  5 గంటల నుండి పనిచేసినవాళ్లు వచ్చినప్పుడు, వాళ్లలో ఒక్కొక్కరు ఒక్కో దేనారం* పొందారు. 10  కాబట్టి రోజంతా పనిచేసినవాళ్లు వచ్చినప్పుడు, వాళ్లు తమకు ఎక్కువ కూలి వస్తుందని అనుకున్నారు. అయితే వాళ్లు కూడా ఒక్క దేనారం* మాత్రమే పొందారు. 11  వాళ్లు అది తీసుకుని, ద్రాక్షతోట యజమాని మీద సణగడం మొదలుపెట్టారు. 12  వాళ్లు ఇలా అన్నారు: ‘చివర వచ్చిన వీళ్లు ఒక్క గంటే పనిచేశారు; అయినా ఎండలో రోజంతా కష్టపడి పనిచేసిన మమ్మల్ని వీళ్లతో సమానం చేశావు!’ 13  కానీ ఆ యజమాని వాళ్లలో ఒకరితో ఇలా అన్నాడు: ‘స్నేహితుడా, నేను నీకు అన్యాయం చేయలేదు. నువ్వు నా దగ్గర ఒక దేనారానికి* ఒప్పుకున్నావు కదా? 14  నీ కూలి తీసుకుని నువ్వు వెళ్లు. చివర్లో వచ్చిన వీళ్లకు కూడా, నీకు ఇచ్చినంతే ఇవ్వాలని అనుకుంటున్నాను. 15  నా డబ్బుతో నాకు నచ్చినట్టు చేసే హక్కు నాకు లేదా? లేక, నేను మంచిపని చేసినందుకు* నీకు అసూయగా ఉందా?’ 16  అలా, ముందున్నవాళ్లు వెనక్కి వెళ్తారు, వెనకున్నవాళ్లు ముందుకు వస్తారు.” 17  యేసు యెరూషలేముకు వెళ్తుండగా, దారిలో 12 మంది శిష్యుల్ని పక్కకు తీసుకెళ్లి ఇలా చెప్పాడు: 18  “ఇదిగో! మనం యెరూషలేముకు వెళ్తున్నాం. అక్కడ మానవ కుమారుడు ముఖ్య యాజకులకు, శాస్త్రులకు అప్పగించబడతాడు. వాళ్లు ఆయనకు మరణశిక్ష విధిస్తారు; 19  ఆయన్ని ఎగతాళి చేసి, కొరడాలతో కొట్టి, కొయ్యమీద వేలాడదీయడానికి అన్యులకు అప్పగిస్తారు. కానీ మూడో రోజున ఆయన మళ్లీ బ్రతికించబడతాడు.” 20  అప్పుడు, జెబెదయి భార్య తన ఇద్దరు కొడుకులతో యేసు దగ్గరికి వచ్చి, ఆయనకు వంగి నమస్కారం చేసింది. ఆమె ఆయన్ని ఒక విషయం అడగాలనుకుంది. 21  యేసు ఆమెను, “నీకు ఏం కావాలి?” అని అడిగాడు. అప్పుడు ఆమె, “నీ రాజ్యంలో నా ఇద్దరు కొడుకుల్లో ఒకర్ని నీ కుడివైపు, ఒకర్ని నీ ఎడమవైపు కూర్చోబెట్టుకో” అని ఆయన్ని అడిగింది. 22  అందుకు యేసు, “మీరేమి అడుగుతున్నారో మీకు తెలియట్లేదు. నేను తాగబోతున్న గిన్నెలోది మీరు తాగగలరా?” అని అడిగాడు. “మేము తాగగలం” అని వాళ్లు అన్నారు. 23  అప్పుడు యేసు వాళ్లతో ఇలా అన్నాడు: “నా గిన్నెలోది మీరు ఖచ్చితంగా తాగుతారు, కానీ నా కుడివైపు గానీ, నా ఎడమవైపు గానీ కూర్చోబెట్టుకోవడం నా చేతుల్లో లేదు, వాటిని నా తండ్రి ఎవరి కోసం సిద్ధం చేశాడో వాళ్లే ఆ స్థానాల్లో కూర్చుంటారు.” 24  ఈ విషయం గురించి మిగతా పదిమంది విన్నప్పుడు, వాళ్లు ఆ ఇద్దరు అన్నదమ్ముల మీద కోపంతో మండిపడ్డారు. 25  కానీ యేసు వాళ్లను దగ్గరికి పిలిచి ఇలా అన్నాడు: “దేశాల్ని పరిపాలించేవాళ్లు ప్రజలమీద అధికారం చెలాయిస్తారనీ, వాళ్లలో గొప్పవాళ్లు వాళ్లమీద పెత్తనం చేస్తారనీ మీకు తెలుసు కదా. 26  మీమధ్య అలా ఉండకూడదు; మీలో గొప్పవాడిగా ఉండాలనుకునేవాడు మీకు సేవకుడిగా ఉండాలి, 27  మీలో ముందు ఉండాలనుకునేవాడు మీకు దాసుడిగా ఉండాలి. 28  అలాగే మానవ కుమారుడు కూడా సేవ చేయించుకోవడానికి రాలేదు కానీ సేవచేయడానికి, ఎంతోమంది కోసం విమోచన క్రయధనంగా తన ప్రాణాన్ని అర్పించడానికి వచ్చాడు.” 29  వాళ్లు యెరికో నుండి వెళ్తుండగా చాలామంది ప్రజలు ఆయన వెనక వెళ్లారు. 30  అప్పుడు ఇదిగో! దారి పక్కన కూర్చొనివున్న ఇద్దరు గుడ్డివాళ్లు యేసు ఆ దారిలో వెళ్తున్నాడని విని, “ప్రభువా, దావీదు కుమారుడా, మమ్మల్ని కరుణించు!” అని కేకలు వేశారు. 31  కానీ ప్రజలు వాళ్లను నిశ్శబ్దంగా ఉండమని గద్దించారు; అయినా వాళ్లు ఇంకా గట్టిగా, “ప్రభువా, దావీదు కుమారుడా, మమ్మల్ని కరుణించు!” అని అరిచారు. 32  కాబట్టి యేసు ఆగి వాళ్లను పిలిచి, “మీ కోసం నన్ను ఏం చేయమంటారు?” అని అడిగాడు. 33  వాళ్లు, “ప్రభువా, మాకు చూపు తెప్పించు” అని ఆయనతో అన్నారు. 34  యేసు జాలిపడి వాళ్ల కళ్లను ముట్టుకున్నాడు, వెంటనే వాళ్లకు చూపు వచ్చింది; దాంతో వాళ్లు ఆయన్ని అనుసరించారు.

అధస్సూచీలు

పదకోశం చూడండి.
అక్ష., “దాదాపు మూడో గంటకు.”
అక్ష., “దాదాపు ఆరో గంటకు.”
అక్ష., “దాదాపు తొమ్మిదో గంటకు.”
అక్ష., “దాదాపు పదకొండో గంటకు.”
పదకోశం చూడండి.
పదకోశం చూడండి.
పదకోశం చూడండి.
లేదా “ఉదారంగా ఉన్నందుకు.”