మత్తయి 21:1-46

  • యేసు విజయోత్సాహంతో ప్రవేశించడం  (1-11)

  • ఆలయాన్ని యేసు శుభ్రం చేయడం  (12-17)

  • అంజూర చెట్టును శపించడం  (18-22)

  • యేసుకున్న అధికారాన్ని ప్రశ్నించడం  (23-27)

  • ఇద్దరు కొడుకుల ఉదాహరణ  (28-32)

  • హంతకులైన కౌలుదారుల ఉదాహరణ  (33-46)

    • ముఖ్యమైన మూలరాయిని వద్దనుకున్నారు (42)

21  వాళ్లు యెరూషలేము దగ్గర్లోకి వచ్చినప్పుడు, ఒలీవల కొండ మీదున్న బేత్పగేలో ఆగారు. అప్పుడు యేసు ఇద్దరు శిష్యుల్ని పంపిస్తూ,  వాళ్లకు ఇలా చెప్పాడు: “కనిపించే ఆ గ్రామానికి వెళ్లండి. మీరు అక్కడికి వెళ్లగానే కట్టేసివున్న ఒక గాడిద, దానితోపాటు గాడిద పిల్ల మీకు కనిపిస్తాయి. వాటిని విప్పి నా దగ్గరికి తీసుకురండి.  ఎవరైనా మిమ్మల్ని అడిగితే, ‘ఇవి ప్రభువుకు కావాలి’ అని మీరు చెప్పాలి, అప్పుడు అతను వెంటనే వాటిని పంపించేస్తాడు.”  దేవుడు ప్రవక్త ద్వారా తెలియజేసిన ఈ మాటలు నెరవేరడానికే అలా జరిగింది:  “‘ఇదిగో! నీ రాజు సౌమ్యుడిగా,* చిన్న గాడిద మీద కూర్చొని, అవును గాడిద పిల్ల మీద కూర్చొని నీ దగ్గరికి వస్తున్నాడు’ అని సీయోను కూతురితో చెప్పండి.”  కాబట్టి శిష్యులు వెళ్లి యేసు చెప్పినట్టే చేశారు.  వాళ్లు గాడిదను, దాని పిల్లను తీసుకొచ్చి వాటిమీద తమ పైవస్త్రాలు వేశారు; యేసు వాటిమీద కూర్చున్నాడు.  ప్రజల్లో చాలామంది తమ పైవస్త్రాలు దారిలో పరిచారు, ఇంకొంతమంది చెట్ల కొమ్మల్ని నరికి వాటిని దారిలో పరుస్తూ వచ్చారు.  అంతేకాదు ఆయన ముందు వెళ్తున్న ప్రజలు, ఆయన వెనక వెళ్తున్న ప్రజలు ఇలా అరుస్తూ ఉన్నారు: “దేవా, దావీదు కుమారుడిని కాపాడు! యెహోవా* పేరిట వస్తున్న ఈయన దీవెన పొందాలి! పరలోకంలో నివసించే దేవా, ఈయన్ని కాపాడు!” 10  ఆయన యెరూషలేములోకి వచ్చినప్పుడు నగరమంతా అల్లరల్లరిగా ఉంది, “ఈయన ఎవరు?” అని ప్రజలు చెప్పుకుంటున్నారు. 11  “ఈయన ప్రవక్తయైన యేసు, గలిలయలోని నజరేతుకు చెందినవాడు!” అని ప్రజలు అంటూ ఉన్నారు. 12  యేసు ఆలయం లోపలికి వెళ్లి, ఆలయంలో అమ్మేవాళ్లను, కొనేవాళ్లను అందర్నీ బయటికి వెళ్లగొట్టాడు; డబ్బులు మార్చేవాళ్ల బల్లల్ని, పావురాలు అమ్మేవాళ్ల బల్లల్ని తలక్రిందులుగా పడేశాడు. 13  ఆయన వాళ్లతో ఇలా అన్నాడు: “‘నా మందిరం ప్రార్థన మందిరమని పిలవబడుతుంది’ అని లేఖనాలు చెప్తున్నాయి. కానీ మీరు దాన్ని దొంగల గుహగా మారుస్తున్నారు.” 14  ఆ తర్వాత, ఆలయంలో ఆయన దగ్గరికి గుడ్డివాళ్లు, కుంటివాళ్లు వచ్చారు, ఆయన వాళ్లను బాగుచేశాడు. 15  యేసు చేసిన అద్భుతాల్ని, “దేవా, దావీదు కుమారుడిని కాపాడు” అని ఆలయంలో పిల్లలు అరవడాన్ని చూసినప్పుడు ముఖ్య యాజకులకు, శాస్త్రులకు చాలా కోపం వచ్చింది; 16  “వీళ్లు ఏమంటున్నారో వింటున్నావా?” అని వాళ్లు ఆయనతో అన్నారు. అందుకు యేసు, “వింటున్నాను. ‘పిల్లలు, చంటిబిడ్డలు నిన్ను స్తుతించేలా చేశావు’ అనే మాటల్ని మీరు ఎప్పుడూ చదవలేదా?” అని వాళ్లతో అన్నాడు. 17  తర్వాత, ఆయన ఆ నగరం నుండి బేతనియకు వెళ్లాడు, ఆ రాత్రి అక్కడే ఉన్నాడు. 18  పొద్దున్నే నగరానికి తిరిగి వస్తుండగా ఆయనకు ఆకలేసింది. 19  దారిలో ఆయన ఒక అంజూర చెట్టును చూసి దాని దగ్గరికి వెళ్లాడు. అయితే ఆయన దాన్ని చూసినప్పుడు ఆకులు తప్ప ఇంకేమీ కనిపించలేదు. అప్పుడు ఆయన ఆ చెట్టుతో, “ఇంకెప్పుడూ నీకు పండ్లు కాయవు” అన్నాడు. వెంటనే ఆ అంజూర చెట్టు ఎండిపోయింది. 20  శిష్యులు అది చూసినప్పుడు చాలా ఆశ్చర్యపోయి, “ఆ అంజూర చెట్టు వెంటనే ఎలా ఎండిపోయింది?” అన్నారు. 21  అప్పుడు యేసు వాళ్లతో ఇలా అన్నాడు: “నేను నిజంగా మీతో చెప్తున్నాను, మీకు విశ్వాసం ఉంటే, మీరు సందేహపడకపోతే ఆ అంజూర చెట్టుకు నేను చేసినదాన్ని మీరు కూడా చేయగలుగుతారు; అంతేకాదు మీరు ఒకవేళ ఈ కొండతో, ‘నువ్వు లేచి సముద్రంలో పడిపో’ అని చెప్పినా అది జరుగుతుంది. 22  విశ్వాసంతో మీరు వేటికోసం ప్రార్థిస్తారో వాటన్నిటినీ పొందుతారు.” 23  ఆ తర్వాత ఆయన ఆలయంలోకి వెళ్లి బోధిస్తుండగా, ముఖ్య యాజకులు, ప్రజల పెద్దలు ఆయన దగ్గరికి వచ్చి, “నువ్వు ఏ అధికారంతో ఇవి చేస్తున్నావు? ఈ అధికారం నీకు ఎవరిచ్చారు?” అని అడిగారు. 24  అప్పుడు యేసు వాళ్లతో ఇలా అన్నాడు: “నేను కూడా మిమ్మల్ని ఒక విషయం అడుగుతాను. దానికి మీరు సమాధానం చెప్తే, నేను కూడా ఏ అధికారంతో ఇవి చేస్తున్నానో మీకు చెప్తాను. 25  బాప్తిస్మమిచ్చే అధికారం యోహానుకు ఎవరు ఇచ్చారు? దేవుడా,* మనుషులా?” అప్పుడు వాళ్లలోవాళ్లు ఇలా మాట్లాడుకున్నారు: “మనం ‘దేవుడు ఇచ్చాడు’ అని చెప్తే, ‘మరి మీరు అతన్ని ఎందుకు నమ్మలేదు?’ అంటాడు. 26  ఒకవేళ మనం, ‘మనుషులు ఇచ్చారు’ అని చెప్తే, ప్రజలు మనల్ని ఏం చేస్తారో? ఎందుకంటే యోహాను ఒక ప్రవక్త అని వాళ్లందరూ నమ్ముతున్నారు.” 27  కాబట్టి వాళ్లు యేసుతో, “మాకు తెలియదు” అని చెప్పారు. దానికి యేసు వాళ్లతో, “ఏ అధికారంతో ఇవి చేస్తున్నానో నేను కూడా మీకు చెప్పను” అన్నాడు. 28  “మీకేమనిపిస్తుంది? ఒకతనికి ఇద్దరు కొడుకులు ఉన్నారు. అతను పెద్ద కొడుకు దగ్గరికి వెళ్లి, ‘బాబూ, ఈ రోజు ద్రాక్షతోటలోకి వెళ్లి పనిచేయి’ అని చెప్పాడు. 29  అందుకు ఆ పెద్ద కొడుకు, ‘నేను వెళ్లను’ అన్నాడు, కానీ తర్వాత అలా అన్నందుకు బాధపడి వెళ్లాడు. 30  తండ్రి చిన్న కొడుకు దగ్గరికి వెళ్లి అదే మాట చెప్పాడు. అతను, ‘వెళ్తాను నాన్నా’ అన్నాడు కానీ వెళ్లలేదు. 31  ఈ ఇద్దరిలో ఎవరు తండ్రి ఇష్టాన్ని చేశారు?” అప్పుడు వాళ్లు, “పెద్ద కొడుకు” అని జవాబిచ్చారు. యేసు వాళ్లతో ఇలా అన్నాడు: “నేను నిజంగా మీతో చెప్తున్నాను, పన్ను వసూలు చేసేవాళ్లు, వేశ్యలు మీకంటే ముందు దేవుని రాజ్యంలోకి వెళ్తారు. 32  ఎందుకంటే యోహాను నీతి మార్గాన్ని బోధిస్తూ మీ దగ్గరికి వచ్చాడు, కానీ మీరు అతన్ని నమ్మలేదు. అయితే పన్ను వసూలు చేసేవాళ్లు, వేశ్యలు అతన్ని నమ్మారు; మీరు అది చూసి కూడా పశ్చాత్తాపపడలేదు, అతన్ని నమ్మలేదు. 33  “ఇంకో ఉదాహరణ వినండి: ఒక ద్రాక్షతోట యజమాని ద్రాక్షతోట నాటించి, చుట్టూ కంచె వేయించాడు; ఒక ద్రాక్షతొట్టి తొలిపించాడు, కాపలాకు ఓ బురుజు కట్టించాడు; ఆ తర్వాత దాన్ని రైతులకు కౌలుకిచ్చి వేరే దేశానికి వెళ్లిపోయాడు. 34  కోత కోసే కాలం దగ్గర పడినప్పుడు, పంటలో తనకు రావాల్సిన భాగాన్ని తీసుకురావడానికి అతను తన దాసుల్ని ఆ రైతుల దగ్గరికి పంపించాడు. 35  అయితే, ఆ రైతులు అతని దాసుల్ని పట్టుకుని ఒకర్ని కొట్టారు, ఇంకొకర్ని చంపారు, మరొకర్ని రాళ్లతో కొట్టారు. 36  అతను మళ్లీ వేరే దాసుల్ని పంపించాడు, అంతకుముందు కన్నా ఎక్కువమందిని పంపించాడు. కానీ ఆ రైతులు వాళ్ల విషయంలో కూడా అలాగే చేశారు. 37  చివరికి తన కొడుకును వాళ్ల దగ్గరికి పంపించాడు; ‘వాళ్లు నా కొడుకును గౌరవిస్తారు’ అని అతను అనుకున్నాడు. 38  కొడుకును చూసినప్పుడు ఆ రైతులు తమలోతాము ఇలా అనుకున్నారు: ‘ఇతను వారసుడు. రండి, ఇతన్ని చంపేసి, ఇతని ఆస్తిని సొంతం చేసుకుందాం!’ 39  కాబట్టి వాళ్లు అతన్ని పట్టుకొని, ద్రాక్షతోట బయటికి తోసేసి చంపేశారు. 40  మరి ఆ ద్రాక్షతోట యజమాని వచ్చినప్పుడు ఆ రైతుల్ని ఏం చేస్తాడు?” 41  అప్పుడు వాళ్లు ఇలా చెప్పారు: “వాళ్లు చెడ్డవాళ్లు కాబట్టి అతను వాళ్లను చంపి, కోత కాలం వచ్చినప్పుడు పంటలో తనకు రావాల్సిన భాగాన్ని తనకు ఇచ్చే వేరే రైతులకు ఆ ద్రాక్షతోటను కౌలుకిస్తాడు.” 42  యేసు వాళ్లతో ఇలా అన్నాడు: “‘కట్టేవాళ్లు వద్దనుకున్న రాయి ముఖ్యమైన మూలరాయి* అయ్యింది. ఇది యెహోవా* వల్ల జరిగింది, ఇది మన కళ్లకు ఆశ్చర్యంగా ఉంది’ అనే మాటను మీరు లేఖనాల్లో ఎప్పుడూ చదవలేదా? 43  అందుకే నేను మీతో చెప్తున్నాను, దేవుడు తన రాజ్యాన్ని మీ దగ్గరి నుండి తీసివేసి, రాజ్యానికి తగిన ఫలాలను ఫలించే ప్రజలకు ఇస్తాడు. 44  అంతేకాదు, ఆ రాయిమీద పడే వ్యక్తి ముక్కలుముక్కలు అయిపోతాడు. ఆ రాయి ఎవరిమీద పడుతుందో వాళ్లను అది నలగ్గొడుతుంది.” 45  ముఖ్య యాజకులు, పరిసయ్యులు ఆయన చెప్పిన ఉదాహరణలు విన్నప్పుడు, ఆయన తమ గురించే మాట్లాడుతున్నాడని వాళ్లకు అర్థమైంది. 46  వాళ్లు ఆయన్ని బంధించాలని అనుకున్నారు, కానీ ప్రజలు ఆయన్ని ప్రవక్తగా చూస్తున్నారు కాబట్టి వాళ్లకు భయపడ్డారు.

అధస్సూచీలు

లేదా “వినయస్థుడిగా.”
పదకోశం చూడండి.
అక్ష., “పరలోకమా.”
అక్ష., “మూలకు తల.”
పదకోశం చూడండి.