మత్తయి 28:1-20

  • యేసు పునరుత్థానం  (1-10)

  • అబద్ధం చెప్పేలా సైనికులకు లంచం ఇవ్వడం  (11-15)

  • శిష్యుల్ని చేయమనే ఆజ్ఞ  (16-20)

28  విశ్రాంతి రోజు గడిచిపోయింది. వారం మొదటి రోజు* తెల్లవారుతున్నప్పుడు మగ్దలేనే మరియ, ఇంకో మరియ సమాధిని చూడడానికి వచ్చారు.  అప్పటికే అక్కడ ఓ పెద్ద భూకంపం వచ్చింది! ఎందుకంటే యెహోవా* దూత పరలోకం నుండి వచ్చి సమాధికి అడ్డంగా ఉన్న రాయిని తీసేసి, దాని మీద కూర్చున్నాడు.  ఆ దూత మెరుపులా తళతళ మెరిసిపోతున్నాడు, అతని వస్త్రాలు మంచు అంత తెల్లగా ఉన్నాయి.  కాపలా కాస్తున్నవాళ్లు అతనికి భయపడి వణికిపోయారు; చచ్చినవాళ్లలా అయిపోయారు.  కానీ దేవదూత ఆ స్త్రీలకు ఇలా చెప్పాడు: “భయపడకండి, కొయ్యపై మరణశిక్ష వేయబడిన యేసు కోసం మీరు చూస్తున్నారని నాకు తెలుసు.  ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన బ్రతికించబడ్డాడు. వచ్చి, ఆయన్ని ఉంచిన చోటును చూడండి.  త్వరగా వెళ్లి, ఆయన మృతుల్లో నుండి బ్రతికించబడ్డాడని ఆయన శిష్యులకు చెప్పండి. ఎందుకంటే, ఇదిగో! ఆయన మీకన్నా ముందు గలిలయకు వెళ్తున్నాడు. ఆయన్ని మీరు అక్కడ చూస్తారు. ఈ విషయం చెప్పడానికే నేను వచ్చాను.”  కాబట్టి, వెంటనే శిష్యులకు ఈ విషయం చెప్పడానికి వాళ్లు భయంతో, ఎంతో సంతోషంతో ఆ సమాధి* దగ్గరి నుండి పరుగెత్తుకుంటూ వెళ్లారు.  అప్పుడు ఇదిగో! యేసు ఆ స్త్రీలను కలిసి పలకరించాడు. వాళ్లు ఆయన దగ్గరికి వచ్చి ఆయన పాదాలు పట్టుకొని ఆయనకు సాష్టాంగ* నమస్కారం చేశారు. 10  తర్వాత యేసు వాళ్లతో ఇలా అన్నాడు: “భయపడకండి! మీరు వెళ్లి నా సోదరుల్ని గలిలయకు రమ్మని చెప్పండి, అక్కడ వాళ్లు నన్ను చూస్తారు.” 11  ఆ స్త్రీలు వెళ్తుండగా, కాపలా ఉన్న సైనికుల్లో కొందరు నగరంలోకి వెళ్లి జరిగిన వాటన్నిటి గురించి ముఖ్య యాజకులకు చెప్పారు. 12  వాళ్లు పెద్దలతో సమావేశమై మాట్లాడుకున్న తర్వాత, ఆ సైనికులకు పెద్ద మొత్తంలో వెండి నాణేలు ఇచ్చి, 13  ఇలా అన్నారు: “‘రాత్రిపూట ఆయన శిష్యులు వచ్చి మేము నిద్రపోతున్నప్పుడు ఆయన్ని ఎత్తుకెళ్లిపోయారు’ అని చెప్పండి. 14  ఇది అధిపతి చెవిలో పడితే, అతన్ని ఒప్పించే పూచీ మాది. తర్వాత మీరు కంగారు పడాల్సిన అవసరం ఉండదు.” 15  సైనికులు ఆ వెండి నాణేలు తీసుకొని వాళ్లు చెప్పినట్టే చేశారు. వాళ్లు చెప్పిన కథ యూదుల్లో బాగా వ్యాపించి ఈరోజు వరకు ప్రాచుర్యంలో ఉంది. 16  అయితే, ఆ 11 మంది శిష్యులు మాత్రం గలిలయలో యేసు తమను కలుస్తానని చెప్పిన కొండ దగ్గరికి వెళ్లారు. 17  ఆయన్ని చూసినప్పుడు వాళ్లు సాష్టాంగ* నమస్కారం చేశారు, కొందరు మాత్రం సందేహపడ్డారు. 18  యేసు వాళ్ల దగ్గరికి వచ్చి ఇలా అన్నాడు: “పరలోకంలో, భూమ్మీద నాకు సర్వాధికారం ఇవ్వబడింది. 19  కాబట్టి, మీరు వెళ్లి అన్ని దేశాల ప్రజలను శిష్యుల్ని చేయండి; తండ్రి పేరున, కుమారుడి పేరున, పవిత్రశక్తి పేరున వాళ్లకు బాప్తిస్మం ఇవ్వండి; 20  నేను మీకు ఆజ్ఞాపించిన వాటన్నిటినీ పాటించడం వాళ్లకు నేర్పించండి. ఇదిగో! ఈ వ్యవస్థ* ముగింపు వరకు నేను ఎప్పుడూ మీతోనే ఉంటాను.”

అధస్సూచీలు

ఇది ఆదివారం. యూదులకు వారంలో అది మొదటి రోజు.
పదకోశం చూడండి.
లేదా “స్మారక సమాధి.”
లేదా “వంగి.”
లేదా “వంగి.”
లేదా “యుగం.” పదకోశం చూడండి.