మత్తయి 8:1-34

  • ఒక కుష్ఠురోగి బాగయ్యాడు (1-4)

  • ఒక సైనికాధికారి విశ్వాసం  (5-13)

  • యేసు కపెర్నహూములో చాలామందిని బాగుచేస్తాడు (14-17)

  • యేసును ఎలా అనుసరించాలి  (18-22)

  • యేసు ఒక తుఫానును నిమ్మళింపజేశాడు (23-27)

  • యేసు చెడ్డదూతల్ని పందుల్లోకి పంపించడం  (28-34)

8  యేసు ఆ కొండ దిగి వచ్చాక చాలామంది ప్రజలు ఆయన వెనక వెళ్లారు.  ఇదిగో! ఒక కుష్ఠురోగి వచ్చి ఆయనకు సాష్టాంగ* నమస్కారం చేసి, “ప్రభువా, నీకు ఇష్టమైతే, నన్ను శుద్ధుడిగా చేయగలవు” అని అన్నాడు.  కాబట్టి యేసు తన చెయ్యి చాపి, అతన్ని ముట్టుకుని, “నాకు ఇష్టమే, శుద్ధుడివి అవ్వు” అన్నాడు. వెంటనే అతని కుష్ఠురోగం నయమైంది.  అప్పుడు యేసు అతనితో ఇలా అన్నాడు: “జాగ్రత్త, ఇది ఎవరికీ చెప్పకు. అయితే వెళ్లి యాజకునికి కనిపించి, మోషే ధర్మశాస్త్రం నియమించిన కానుకను అర్పించు. ఇది వాళ్లకు సాక్ష్యంగా ఉంటుంది.”  యేసు కపెర్నహూముకు వచ్చినప్పుడు, ఒక సైనికాధికారి ఆయన దగ్గరికి వచ్చి ఆయన్ని బ్రతిమాలుతూ  ఇలా అన్నాడు: “అయ్యా, నా సేవకుడు పక్షవాతంతో ఇంట్లో పడివున్నాడు, అతను ఎంతో బాధపడుతున్నాడు.”  యేసు అతనితో, “నేను అక్కడికి వచ్చినప్పుడు అతన్ని బాగుచేస్తాను” అన్నాడు.  అప్పుడు ఆ సైనికాధికారి ఇలా అన్నాడు: “అయ్యా, నువ్వు నా ఇంట్లోకి రావడానికి నేను అర్హుణ్ణి కాను. నువ్వు ఒక మాట చెప్పు చాలు, నా సేవకుడు బాగైపోతాడు.  నేను కూడా అధికారం కింద ఉన్నవాడినే; నా కింద సైనికులు ఉన్నారు, నేను ఒకర్ని ‘వెళ్లు!’ అంటే అతను వెళ్తాడు; ఇంకొకర్ని ‘రా!’ అంటే అతను వస్తాడు; నా దాసునితో, ‘ఇది చేయి!’ అంటే చేస్తాడు.” 10  ఈ మాటలు విన్నప్పుడు యేసు చాలా ఆశ్చర్యపోయి, తనను అనుసరిస్తున్న వాళ్లతో ఇలా అన్నాడు: “నేను మీతో నిజం చెప్తున్నాను, ఇశ్రాయేలులో ఇంత గొప్ప విశ్వాసం ఉన్నవాళ్లు నాకు ఎవరూ కనిపించలేదు. 11  కానీ నేను మీతో చెప్తున్నాను, తూర్పు నుండి, పడమర నుండి చాలామంది వచ్చి పరలోక రాజ్యంలో అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులతో పాటు బల్ల దగ్గర కూర్చుంటారు; 12  అయితే రాజ్యంలోకి వెళ్లాల్సినవాళ్లు మాత్రం బయట చీకట్లోకి తోసివేయబడతారు. అక్కడే వాళ్లు ఏడుస్తూ, పళ్లు కొరుక్కుంటూ ఉంటారు.” 13  అప్పుడు యేసు ఆ సైనికాధికారితో, “వెళ్లు, నువ్వు విశ్వాసం చూపించావు కాబట్టి నువ్వు కోరుకున్నది జరుగుతుంది” అన్నాడు. ఆ క్షణంలోనే అతని సేవకుడు బాగయ్యాడు. 14  యేసు పేతురు ఇంటికి వచ్చినప్పుడు, పేతురువాళ్ల అత్త జ్వరంతో పడుకొని ఉండడం చూశాడు. 15  కాబట్టి యేసు ఆమెను ముట్టుకున్నాడు, దాంతో ఆమె జ్వరం పోయింది. ఆమె లేచి ఆయనకు సేవలు చేయడం మొదలుపెట్టింది. 16  సాయంత్రం అయ్యాక, ప్రజలు చెడ్డదూతలు పట్టిన చాలామందిని ఆయన దగ్గరకు తీసుకొచ్చారు; ఆయన ఒక్క మాటతో ఆ దూతల్ని వెళ్లగొట్టాడు, అనారోగ్యంతో ఉన్న వాళ్లందర్నీ బాగుచేశాడు. 17  “ఆయనే మన అనారోగ్యాల్ని, జబ్బుల్ని మోసుకెళ్లాడు” అని యెషయా ప్రవక్త ద్వారా చెప్పబడిన మాటలు అలా నెరవేరాయి. 18  యేసు తన చుట్టూ ప్రజలు ఉండడం చూసినప్పుడు, పడవను అవతలివైపుకు తీసుకెళ్లమని శిష్యులకు ఆజ్ఞాపించాడు. 19  అప్పుడు ఒక శాస్త్రి వచ్చి యేసుతో, “బోధకుడా, నువ్వు ఎక్కడికి వెళ్లినా నీ వెంట వస్తాను” అన్నాడు. 20  కానీ యేసు అతనితో ఇలా అన్నాడు: “నక్కలకు బొరియలు, ఆకాశపక్షులకు గూళ్లు ఉన్నాయి. కానీ మానవ కుమారుడు* తల వాల్చడానికి ఎక్కడా స్థలం లేదు.” 21  తర్వాత ఆయన శిష్యుల్లో ఒకతను, “ప్రభువా, ముందు వెళ్లి నా తండ్రిని పాతిపెట్టడానికి నాకు అనుమతి ఇవ్వు” అని ఆయనతో అన్నాడు. 22  అందుకు యేసు అతనితో ఇలా అన్నాడు: “నువ్వు నన్ను అనుసరిస్తూ ఉండు, మృతులు తమ మృతుల్ని పాతిపెట్టుకోనివ్వు.” 23  తర్వాత యేసు, ఆయన శిష్యులు పడవ ఎక్కి బయల్దేరారు. 24  అప్పుడు ఇదిగో! సముద్రంలో ఒక పెద్ద తుఫాను చెలరేగింది. దాంతో అలల వల్ల పడవలోకి నీళ్లు వస్తూ ఉన్నాయి; కానీ యేసు నిద్రపోతున్నాడు. 25  అప్పుడు శిష్యులు వచ్చి, “ప్రభువా, మమ్మల్ని రక్షించు. మనం చనిపోయేలా ఉన్నాం!”అని అంటూ ఆయన్ని నిద్రలేపారు. 26  కానీ ఆయన వాళ్లతో ఇలా అన్నాడు: “మీరెందుకు ఇంత భయపడుతున్నారు?* మీకు కొంచెం విశ్వాసమే ఉంది.” అప్పుడు ఆయన లేచి గాలుల్ని, సముద్రాన్ని గద్దించాడు; దాంతో అంతా చాలా ప్రశాంతంగా మారిపోయింది. 27  కాబట్టి శిష్యులు ఎంతో ఆశ్చర్యపోయి, “అసలు ఈయన ఎవరు? చివరికి గాలులు, సముద్రం కూడా ఈయనకు లోబడుతున్నాయి” అని చెప్పుకున్నారు. 28  ఆయన అవతలి తీరాన ఉన్న గదరేనువాళ్ల ప్రాంతానికి వచ్చినప్పుడు, చెడ్డదూతలు పట్టిన ఇద్దరు మనుషులు సమాధుల* మధ్య నుండి ఆయనకు ఎదురుగా వచ్చారు. వాళ్లు చాలా క్రూరంగా ఉన్నారు కాబట్టి ఆ దారిలో వెళ్లడానికి ఎవరికీ ధైర్యం లేకపోయింది. 29  అప్పుడు ఇదిగో! వాళ్లు, “దేవుని కుమారుడా, మాతో నీకేం పని? సమయం రాకముందే మమ్మల్ని హింసించాలని ఇక్కడికి వచ్చావా?” అని కేకలు వేశారు. 30  దూరంలో ఒక పెద్ద పందుల మంద మేత మేస్తూ ఉంది. 31  కాబట్టి ఆ చెడ్డదూతలు, “ఒకవేళ నువ్వు మమ్మల్ని వెళ్లగొడితే, ఆ పందుల మందలోకి పంపించు” అని ఆయన్ని వేడుకోవడం మొదలుపెట్టారు. 32  ఆయన, “వెళ్లండి” అన్నాడు, దాంతో ఆ చెడ్డదూతలు బయటికి వచ్చి పందుల్లో దూరారు. అప్పుడు ఇదిగో! ఆ పందులన్నీ కొండ అంచువరకు* పరుగెత్తుకుంటూ వెళ్లి సముద్రంలో పడి, చచ్చిపోయాయి. 33  కానీ వాటిని మేపేవాళ్లు అక్కడినుండి పారిపోయి, నగరంలోకి వెళ్లి జరిగినదంతా చెప్పారు. చెడ్డదూతలు పట్టిన మనుషుల గురించి కూడా చెప్పారు. 34  అప్పుడు ఇదిగో! ఆ నగరంలోని వాళ్లంతా యేసును కలవడానికి వచ్చారు. వాళ్లు ఆయన్ని చూసినప్పుడు, తమ ప్రాంతాన్ని విడిచి వెళ్లమని ఆయన్ని బ్రతిమాలారు.

అధస్సూచీలు

లేదా “వంగి.”
యేసు తన గురించి చెప్పడానికే ఈ పదం వాడాడు. పదకోశం చూడండి.
లేదా “మీ గుండెలో దడ ఎందుకు పుట్టింది?”
లేదా “స్మారక సమాధుల.”
లేదా “ఏటవాలుగా ఉన్న కొన వరకు.”