మత్తయి 9:1-38

  • యేసు పక్షవాతం ఉన్న వ్యక్తిని బాగుచేయడం  (1-8)

  • యేసు మత్తయిని పిలవడం  (9-13)

  • ఉపవాసం గురించి ప్రశ్న (14-17)

  • యాయీరు కూతురు; యేసు పైవస్త్రాల్ని ఒక స్త్రీ ముట్టుకోవడం  (18-26)

  • యేసు గుడ్డివాళ్లను, మూగవాళ్లను బాగుచేయడం  (27-34)

  • పంట చాలా ఉంది కానీ పనివాళ్లు కొంతమందే ఉన్నారు (35-38)

9  యేసు పడవ ఎక్కి, సముద్రం అవతలి వైపున్న తన సొంత ఊరికి వచ్చాడు.  అప్పుడు ఇదిగో! కొంతమంది పక్షవాతం ఉన్న ఒక వ్యక్తిని మంచం మీద ఆయన దగ్గరికి తీసుకొస్తున్నారు. యేసు వాళ్ల విశ్వాసం చూసి, పక్షవాతం ఉన్న వ్యక్తితో, “బాబూ, ధైర్యం తెచ్చుకో! నీ పాపాలు క్షమించబడ్డాయి” అన్నాడు.  అప్పుడు కొంతమంది శాస్త్రులు, “ఈయన దేవుణ్ణి దూషిస్తున్నాడు” అని తమలో తాము అనుకున్నారు.  యేసు వాళ్ల ఆలోచనల్ని పసిగట్టి ఇలా అన్నాడు: “మీరెందుకు ఇలా చెడుగా ఆలోచిస్తున్నారు?  ‘నీ పాపాలు క్షమించబడ్డాయి’ అని చెప్పడం తేలికా? ‘లేచి, నడువు’ అని చెప్పడం తేలికా?  అయితే, భూమ్మీద పాపాలు క్షమించే అధికారం మానవ కుమారునికి ఉందని మీరు తెలుసుకోవాలి.” తర్వాత, ఆయన పక్షవాతం ఉన్న వ్యక్తితో ఇలా అన్నాడు: “లేచి, నీ పరుపు తీసుకొని మీ ఇంటికి వెళ్లు.”  అప్పుడు అతను లేచి తన ఇంటికి వెళ్లాడు.  జరిగింది చూసి ప్రజలు చాలా భయపడ్డారు; అంతేకాదు మనుషులకు ఇంత గొప్ప అధికారం ఇచ్చిన దేవుణ్ణి మహిమపర్చారు.  ఆ తర్వాత యేసు అక్కడి నుండి వెళ్తూ, పన్ను వసూలు చేసే కార్యాలయంలో కూర్చొనివున్న మత్తయిని చూసి అతనితో, “నా శిష్యుడివి అవ్వు” అన్నాడు. అప్పుడు అతను లేచి ఆయన్ని అనుసరించాడు. 10  తర్వాత యేసు అతని ఇంట్లో భోంచేస్తున్నప్పుడు* ఇదిగో! చాలామంది పన్ను వసూలుదారులు, పాపులు అక్కడికి వచ్చారు; వాళ్లు యేసుతో, ఆయన శిష్యులతో కలిసి భోంచేస్తున్నారు.* 11  పరిసయ్యులు అది చూసి యేసు శిష్యులతో ఇలా అన్నారు: “మీ బోధకుడు పన్ను వసూలు చేసేవాళ్లతో, పాపులతో కలిసి ఎందుకు భోంచేస్తున్నాడు?” 12  వాళ్ల మాటల్ని విని యేసు ఇలా అన్నాడు: “ఆరోగ్యంగా ఉన్నవాళ్లకు వైద్యుడు అవసరంలేదు, రోగులకే అవసరం. 13  కాబట్టి వెళ్లి, ‘నేను కరుణనే కోరుకుంటున్నాను కానీ బలిని కాదు’ అనే మాటకు అర్థం ఏమిటో తెలుసుకోండి. ఎందుకంటే నేను నీతిమంతుల్ని పిలవడానికి రాలేదు కానీ పాపుల్ని పిలవడానికే వచ్చాను.” 14  అప్పుడు యోహాను శిష్యులు యేసు దగ్గరికి వచ్చి, “మేము, పరిసయ్యులు తరచూ ఉపవాసం ఉంటాం, మరి నీ శిష్యులు ఎందుకు ఉపవాసం ఉండరు?” అని అడిగారు. 15  అందుకు యేసు వాళ్లతో ఇలా అన్నాడు: “పెళ్లికొడుకు తమతో ఉన్నంతకాలం, అతని స్నేహితులు దుఃఖపడాల్సిన అవసరం ఉండదు కదా? అయితే పెళ్లికొడుకును వాళ్ల దగ్గర నుండి తీసుకెళ్లిపోయే రోజులు వస్తాయి, అప్పుడు వాళ్లు ఉపవాసం ఉంటారు. 16  పాత వస్త్రానికి అతుకు వేయడానికి కొత్త గుడ్డముక్కను ఎవ్వరూ ఉపయోగించరు. అలా చేస్తే, ఆ కొత్త గుడ్డముక్క ముడుచుకుపోయి పాత వస్త్రం నుండి విడిపోతుంది, చిరుగు ఇంకా పెద్దదౌతుంది. 17  అలాగే, ప్రజలు కొత్త ద్రాక్షారసాన్ని పాత తోలుసంచుల్లో పోయరు. ఒకవేళ పోస్తే, తోలుసంచులు పిగిలిపోయి ద్రాక్షారసం కారిపోతుంది; తోలుసంచులు కూడా పాడౌతాయి. అందుకే ప్రజలు, కొత్త ద్రాక్షారసాన్ని కొత్త తోలుసంచుల్లోనే పోస్తారు, అప్పుడు ఆ రెండూ పాడవకుండా ఉంటాయి.” 18  ఆయన వాళ్లకు ఈ విషయాలు చెప్తుండగా, ఇదిగో! ఒక అధికారి వచ్చి ఆయనకు సాష్టాంగ* నమస్కారం చేసి, “ఇప్పటికల్లా మా అమ్మాయి చనిపోయి ఉంటుంది, అయినా నువ్వు వచ్చి ఆమె మీద చేయి ఉంచు, ఆమె బ్రతుకుతుంది” అన్నాడు. 19  దాంతో యేసు లేచి అతని వెంట వెళ్లాడు, ఆయన శిష్యులు కూడా ఆయనతోపాటు వెళ్లారు. 20  అప్పుడు ఇదిగో! 12 ఏళ్లుగా రక్తస్రావంతో బాధపడుతున్న ఒకామె, వెనుక నుండి వచ్చి ఆయన పైవస్త్రం అంచును ముట్టుకుంది. 21  ఎందుకంటే, “నేను ఆయన పైవస్త్రాన్ని ముట్టుకుంటే చాలు బాగౌతాను” అని ఆమె అనుకుంటూ ఉంది. 22  యేసు వెనక్కి తిరిగి ఆమెను చూసి, “అమ్మా,* ధైర్యంగా ఉండు! నీ విశ్వాసం నిన్ను బాగుచేసింది” అన్నాడు. వెంటనే ఆమె బాగైంది. 23  యేసు ఆ అధికారి ఇంటికి వచ్చినప్పుడు, పిల్లనగ్రోవి* ఊదేవాళ్లను, పెద్దగా ఏడుస్తున్న ప్రజల్ని చూసి, 24  “ఇక్కడినుండి వెళ్లండి. పాప చనిపోలేదు, నిద్రపోతోంది అంతే” అన్నాడు. ఆ మాట విన్నప్పుడు వాళ్లు వెటకారంగా నవ్వడం మొదలుపెట్టారు. 25  వాళ్లు వెళ్లిపోగానే యేసు లోపలికి వెళ్లి ఆ పాప చేతిని పట్టుకున్నాడు, దాంతో ఆ అమ్మాయి లేచి కూర్చుంది. 26  అయితే ఈ విషయం గురించి ఆ ప్రాంతమంతా తెలిసిపోయింది. 27  యేసు అక్కడి నుండి వెళ్తుండగా ఇద్దరు గుడ్డివాళ్లు ఆయన వెనుక వెళ్తూ, “దావీదు కుమారుడా, మమ్మల్ని కరుణించు” అని అరుస్తున్నారు. 28  ఆయన ఒక ఇంట్లోకి వెళ్లినప్పుడు, ఆ గుడ్డివాళ్లు ఆయన దగ్గరికి వచ్చారు. అప్పుడు యేసు, “నేను మీకు చూపు తెప్పించగలనని మీకు నమ్మకం ఉందా?” అని వాళ్లను అడిగాడు. వాళ్లు, “ఉంది ప్రభువా” అన్నారు. 29  తర్వాత ఆయన వాళ్ల కళ్లను ముట్టుకొని, “మీ నమ్మకం ప్రకారం మీకు జరగాలి” అన్నాడు. 30  అప్పుడు వాళ్లకు చూపు వచ్చింది. అయితే, “ఈ విషయం గురించి ఎవరికీ తెలియనివ్వకండి” అంటూ యేసు వాళ్లను గట్టిగా హెచ్చరించాడు. 31  కానీ వాళ్లు ఆ ఇంట్లో నుండి బయటికి వచ్చాక, దాని గురించి ఆ ప్రాంతమంతా తెలియజేశారు. 32  వాళ్లు వెళ్లిపోతున్నప్పుడు, ఇదిగో! చెడ్డదూత పట్టిన ఒక మూగవాణ్ణి ప్రజలు యేసు దగ్గరికి తీసుకొచ్చారు. 33  యేసు ఆ చెడ్డదూతను వెళ్లగొట్టిన తర్వాత ఆ మూగవాడు మాట్లాడాడు. అప్పుడు ప్రజలు ఎంతో ఆశ్చర్యపోయి, “మనం ఇశ్రాయేలులో ఇలాంటిది ఎప్పుడూ చూడలేదే” అని అనుకున్నారు. 34  అయితే పరిసయ్యులు, “చెడ్డదూతల నాయకుడి శక్తితోనే ఇతను చెడ్డదూతల్ని వెళ్లగొడుతున్నాడు” అని అంటూ ఉన్నారు. 35  తర్వాత యేసు అన్ని నగరాల్లో, గ్రామాల్లో ప్రయాణించడం మొదలుపెట్టాడు. ఆయన అలా వెళ్తూ వాళ్ల సభామందిరాల్లో బోధిస్తూ, రాజ్యం గురించిన మంచివార్త ప్రకటిస్తూ, అన్నిరకాల జబ్బుల్ని, అనారోగ్యాల్ని బాగుచేస్తూ ఉన్నాడు. 36  ఆయన ప్రజల్ని చూసినప్పుడు వాళ్లమీద జాలిపడ్డాడు, ఎందుకంటే వాళ్లు చర్మం ఒలిచేయబడి, విసిరేయబడిన కాపరిలేని గొర్రెల్లా ఉన్నారు. 37  అప్పుడు ఆయన తన శిష్యులతో ఇలా చెప్పాడు: “అవును, కోయాల్సిన పంట చాలా ఉంది, కానీ పనివాళ్లు కొంతమందే ఉన్నారు. 38  కాబట్టి తన పంట కోయడానికి పనివాళ్లను పంపించమని పంట యజమానిని వేడుకోండి.”

అధస్సూచీలు

లేదా “భోజనం బల్ల దగ్గర ఆనుకొని కూర్చున్నప్పుడు.”
లేదా “భోజనం బల్ల దగ్గర ఆనుకొని కూర్చున్నారు.”
లేదా “వంగి.”
అక్ష., “కుమారీ.”
అంటే, ఫ్లూటు.