మార్కు 10:1-52

  • పెళ్లి, విడాకులు (1-12)

  • యేసు పిల్లల్ని దీవిస్తాడు (13-16)

  • ఒక ధనవంతుడు అడిగిన ప్రశ్న (17-25)

  • రాజ్యం కోసం త్యాగాలు (26-31)

  • యేసు మరణం గురించి ఇంకోసారి ముందే చెప్పబడింది  (32-34)

  • యాకోబు, యోహానుల మనవి  (35-45)

    • ఎంతోమంది కోసం విమోచన క్రయధనంగా యేసు (45)

  • కళ్లులేని బర్తిమయి బాగవ్వడం  (46-52)

10  యేసు అక్కడ నుండి బయల్దేరి యొర్దాను అవతల ఉన్న యూదయ సరిహద్దులకు* వచ్చాడు. మళ్లీ జనం గుంపులు గుంపులుగా ఆయన దగ్గరికి వచ్చారు. అలవాటు ప్రకారం ఆయన మళ్లీ బోధించడం మొదలుపెట్టాడు.  పరిసయ్యులు ఆయన్ని పరీక్షించాలనే ఉద్దేశంతో ఆయన దగ్గరికి వచ్చి, ఒక వ్యక్తి తన భార్యకు విడాకులు ఇవ్వడం న్యాయమేనా అని అడిగారు.  అప్పుడు ఆయన వాళ్లను ఇలా అడిగాడు: “మోషే మీకు ఏమని ఆజ్ఞాపించాడు?”  అందుకు వాళ్లు, “విడాకుల పత్రం రాసిచ్చి ఆమెను వదిలేయడాన్ని మోషే అనుమతించాడు” అన్నారు.  కానీ యేసు వాళ్లకు ఇలా చెప్పాడు: “మీ మొండి వైఖరిని బట్టే అతను మీ కోసం ఆ ఆజ్ఞ రాశాడు.  అయితే, సృష్టి ఆరంభంలో ‘దేవుడు పురుషుణ్ణి, స్త్రీని సృష్టించాడు.  అందుకే పురుషుడు తన అమ్మానాన్నల్ని విడిచిపెడతాడు;  అతను, అతని భార్య* ఒక్క శరీరం అవుతారు.’ అప్పటినుండి వాళ్లు ఇక రెండు శరీరాలుగా కాదు, ఒక్క శరీరంగా ఉంటారు.  కాబట్టి దేవుడు ఒకటి చేసినవాళ్లను* ఏ మనిషీ విడదీయకూడదు.” 10  వాళ్లు తిరిగి ఇంటికి వచ్చినప్పుడు, శిష్యులు దాని గురించి ఆయన్ని అడిగారు. 11  ఆయన వాళ్లకు ఇలా చెప్పాడు: “తన భార్యకు విడాకులు ఇచ్చి ఇంకో స్త్రీని పెళ్లి చేసుకునే ప్రతీ వ్యక్తి వ్యభిచారం చేసి తన భార్యకు ద్రోహం చేసినవాడౌతాడు. 12  ఒకవేళ భార్య తన భర్తకు విడాకులు ఇచ్చి మరో అతన్ని పెళ్లి చేసుకుంటే, ఆమె వ్యభిచారం చేసినదౌతుంది.” 13  చిన్నపిల్లల మీద యేసు తన చేతులుంచాలని ప్రజలు పిల్లల్ని ఆయన దగ్గరికి తీసుకొచ్చారు, కానీ శిష్యులు వాళ్లను గద్దించారు. 14  అది చూసిన యేసు ఆగ్రహానికి గురై శిష్యులతో ఇలా అన్నాడు: “చిన్నపిల్లల్ని నా దగ్గరికి రానివ్వండి, వాళ్లను ఆపాలని చూడకండి. ఎందుకంటే దేవుని రాజ్యం ఇలాంటివాళ్లదే. 15  నేను నిజంగా మీతో చెప్తున్నాను, చిన్నపిల్లల్లా దేవుని రాజ్యాన్ని స్వీకరించనివాళ్లు అందులోకి అస్సలు ప్రవేశించరు.” 16  ఆయన పిల్లల్ని ఎత్తుకొని వాళ్ల మీద చేతులుంచి దీవించాడు. 17  ఆయన వెళ్తుండగా, దారిలో ఒకతను పరుగెత్తుకుంటూ వచ్చి ఆయన ముందు మోకరించి, “మంచి బోధకుడా, శాశ్వత జీవితం పొందాలంటే* నేను ఏమి చేయాలి?” అని అడిగాడు. 18  యేసు అతనితో ఇలా అన్నాడు: “నన్ను మంచివాడని ఎందుకు అంటున్నావు? దేవుడు తప్ప మంచివాళ్లెవరూ లేరు. 19  ‘హత్య చేయకూడదు, వ్యభిచారం చేయకూడదు, దొంగతనం చేయకూడదు, తప్పుడు సాక్ష్యం చెప్పకూడదు, మోసం చేయకూడదు, మీ అమ్మానాన్నల్ని గౌరవించాలి’ అనే ఆజ్ఞలు నీకు తెలుసు కదా.” 20  అప్పుడు అతను, “బోధకుడా, నేను చిన్నప్పటి నుండి ఇవన్నీ పాటిస్తూనే ఉన్నాను” అన్నాడు. 21  యేసు అతన్ని ప్రేమగా చూసి ఇలా అన్నాడు: “నువ్వు చేయాల్సింది ఇంకొకటి ఉంది. నువ్వు వెళ్లి, నీ దగ్గర ఉన్నవి అమ్మేసి, వచ్చిన డబ్బును పేదవాళ్లకు ఇవ్వు, అప్పుడు నీకు పరలోకంలో ఐశ్వర్యం కలుగుతుంది; ఆ తర్వాత వచ్చి నా శిష్యుడివి అవ్వు.” 22  కానీ అతను యేసు చెప్పినదానికి బాధపడి, దుఃఖిస్తూ వెళ్లిపోయాడు. ఎందుకంటే అతనికి చాలా ఆస్తిపాస్తులు ఉన్నాయి. 23  యేసు చుట్టూ చూసి, తన శిష్యులతో ఇలా అన్నాడు: “డబ్బున్న వాళ్లు దేవుని రాజ్యంలోకి ప్రవేశించడం ఎంత కష్టం!” 24  కానీ శిష్యులు యేసు మాటలకు ఆశ్చర్యపోయారు. దానికి యేసు ఇలా స్పందించాడు: “పిల్లలారా, దేవుని రాజ్యంలోకి ప్రవేశించడం ఎంత కష్టం! 25  ధనవంతుడు దేవుని రాజ్యంలోకి ప్రవేశించడం కన్నా సూది రంధ్రం గుండా ఒంటె దూరడం తేలిక.” 26  వాళ్లు ఇంకెంతో ఆశ్చర్యపోయి ఆయనతో ఇలా అన్నారు:* “అసలు రక్షణ పొందడం ఎవరికైనా సాధ్యమేనా?” 27  యేసు వాళ్లను సూటిగా చూసి, “మనుషులకు ఇది అసాధ్యమే, కానీ దేవునికి అన్నీ సాధ్యం” అన్నాడు. 28  పేతురు ఆయనతో, “ఇదిగో! మేము అన్నీ వదిలేసి నిన్ను అనుసరించాం” అన్నాడు. 29  అందుకు యేసు ఇలా చెప్పాడు: “నేను నిజంగా మీతో చెప్తున్నాను, నా కోసం, మంచివార్త కోసం ఇల్లును గానీ, అన్నదమ్ముల్ని గానీ, అక్కచెల్లెళ్లని గానీ, అమ్మను గానీ, నాన్నను గానీ, పిల్లల్ని గానీ, భూముల్ని గానీ వదులుకున్నవాళ్లు 30  ఈ కాలంలో హింసలతో పాటు 100 రెట్లు ఎక్కువ ఇళ్లను, అన్నదమ్ముల్ని, అక్కచెల్లెళ్లని, తల్లుల్ని, పిల్లల్ని, భూముల్ని పొందుతారు. అంతేకాదు రానున్న వ్యవస్థలో* శాశ్వత జీవితాన్ని పొందుతారు. 31  కానీ, ముందున్న చాలామంది వెనక్కి వెళ్తారు, వెనక ఉన్నవాళ్లు ముందుకు వస్తారు.” 32  ఇప్పుడు వాళ్లు యెరూషలేముకు వెళ్లే దారిలో నడుస్తున్నారు. యేసు శిష్యులకు ముందు నడుస్తున్నాడు, శిష్యులకు ఆశ్చర్యమేసింది, వాళ్ల వెనక వస్తున్నవాళ్లకు భయమేసింది. యేసు మళ్లీ పన్నెండుమంది శిష్యులను పక్కకు తీసుకువెళ్లి, తనకు జరగబోయేవాటి గురించి ఇలా చెప్పాడు: 33  “ఇదిగో! మనం యెరూషలేముకు వెళ్తున్నాం. అక్కడ మానవ కుమారుడు ముఖ్య యాజకులకు, శాస్త్రులకు అప్పగించబడతాడు. వాళ్లు ఆయనకు మరణశిక్ష విధించి, అన్యులకు అప్పగిస్తారు. 34  ఆ అన్యులు ఆయన్ని ఎగతాళి చేస్తారు, ఆయన మీద ఉమ్మేస్తారు, ఆయన్ని కొరడాలతో కొడతారు, చంపేస్తారు. కానీ మూడు రోజుల తర్వాత ఆయన మళ్లీ బ్రతుకుతాడు.” 35  జెబెదయి కొడుకులైన యాకోబు, యోహాను ఆయన దగ్గరికి వచ్చి ఆయనతో ఇలా అన్నారు: “బోధకుడా, మేము ఏది అడిగినా నువ్వు కాదనకూడదు, మా కోసం చేయాలి.” 36  అందుకు యేసు, “మీ కోసం ఏమి చేయమంటారు చెప్పండి” అని అడిగాడు. 37  దానికి వాళ్లు ఇలా అన్నారు: “నువ్వు రాజ్య పరిపాలన చేసేటప్పుడు నీ కుడివైపు ఒకరు, నీ ఎడమవైపు ఒకరు కూర్చునే అవకాశం మాకు ఇవ్వు.” 38  కానీ యేసు వాళ్లతో ఇలా అన్నాడు: “మీరు ఏమి అడుగుతున్నారో మీకు తెలియట్లేదు. నేను తాగుతున్న గిన్నెలోది తాగడం మీవల్ల అవుతుందా? నేను తీసుకుంటున్న బాప్తిస్మం తీసుకోవడం మీవల్ల అవుతుందా?” 39  అందుకు వాళ్లు, “మావల్ల అవుతుంది” అన్నారు. అప్పుడు యేసు వాళ్లతో ఇలా అన్నాడు: “నేను తాగే గిన్నెలోది మీరు తాగుతారు, నేను తీసుకుంటున్న బాప్తిస్మం మీరు తీసుకుంటారు. 40  అయితే నా కుడివైపు గానీ, నా ఎడమవైపు గానీ కూర్చోబెట్టుకోవడం నా చేతుల్లో లేదు, కానీ అవి ఎవరి కోసం సిద్ధం చేయబడ్డాయో వాళ్లే ఆ స్థానాల్లో కూర్చుంటారు.” 41  ఈ విషయం గురించి మిగతా పదిమంది విన్నప్పుడు, యాకోబు యోహానుల మీద కోపంతో మండిపడ్డారు. 42  కానీ యేసు వాళ్లను దగ్గరికి పిలిచి ఇలా అన్నాడు: “దేశాల్ని పరిపాలించేవాళ్లు ప్రజలమీద అధికారం చెలాయిస్తారనీ, వాళ్లలో గొప్పవాళ్లు వాళ్లమీద పెత్తనం చేస్తారనీ మీకు తెలుసు కదా. 43  మీ మధ్య అలా ఉండకూడదు; మీలో గొప్పవాడిగా ఉండాలనుకునేవాడు మీకు సేవకుడిగా ఉండాలి, 44  మీలో ముందు ఉండాలనుకునేవాడు అందరికీ దాసుడిగా ఉండాలి. 45  మానవ కుమారుడు కూడా సేవ చేయించుకోవడానికి రాలేదు కానీ సేవచేయడానికి, ఎంతోమంది కోసం విమోచన క్రయధనంగా తన ప్రాణాన్ని అర్పించడానికి వచ్చాడు.” 46  ఆ తర్వాత వాళ్లు యెరికోకు వచ్చారు. అయితే యేసు, ఆయన శిష్యులు, కొంతమంది జనం యెరికో నుండి వెళ్తున్నప్పుడు బర్తిమయి (తీమయి కొడుకు) అనే కళ్లులేని బిచ్చగాడు దారి పక్కన కూర్చొని ఉన్నాడు. 47  అటుగా వెళ్తున్నది నజరేయుడైన యేసు అని అతను విన్నప్పుడు, “దావీదు కుమారుడా, యేసూ, నన్ను కరుణించు!” అని గట్టిగా అరవడం మొదలుపెట్టాడు. 48  అది చూసి చాలామంది నిశ్శబ్దంగా ఉండమని అతన్ని గద్దించడం మొదలుపెట్టారు, కానీ అతను ఇంకా ఎక్కువగా, “దావీదు కుమారుడా, నన్ను కరుణించు!” అని అరుస్తూ ఉన్నాడు. 49  అప్పుడు యేసు ఆగి, “అతన్ని పిలవండి” అన్నాడు. వాళ్లు ఆ గుడ్డివాడితో, “ధైర్యం తెచ్చుకో! లే; ఆయన నిన్ను పిలుస్తున్నాడు” అన్నారు. 50  అప్పుడు ఆ గుడ్డివాడు తన పైవస్త్రాన్ని తీసిపారేసి, టక్కున లేచి యేసు దగ్గరికి వచ్చాడు. 51  తర్వాత యేసు, “నీ కోసం నన్ను ఏమి చేయమంటావు?” అని అడిగాడు. ఆ గుడ్డివాడు యేసుతో, “రబ్బూనీ,* నాకు చూపు తెప్పించు” అన్నాడు. 52  అప్పుడు యేసు అతనితో, “వెళ్లు, నీ విశ్వాసం నిన్ను బాగుచేసింది” అన్నాడు. వెంటనే, అతనికి చూపు వచ్చింది, ఆ తర్వాత అతను జనంతోపాటు యేసు వెనకే వెళ్లాడు.

అధస్సూచీలు

లేదా “పొలిమేర్లకు.”
అక్ష., “ఆ ఇద్దరు.”
అక్ష., “దేవుడు ఒక కాడి కిందకు తెచ్చినవాళ్లను.”
అక్ష., “వారసత్వంగా పొందాలంటే.”
లేదా “ఒకరితో ఒకరు ఇలా అనుకున్నారు” అయ్యుంటుంది.
లేదా “రానున్న యుగంలో.” పదకోశం చూడండి.
“బోధకుడా” అని అర్థం.