మార్కు 11:1-33
11 వాళ్లు యెరూషలేము దరిదాపుల్లోకి వస్తున్నప్పుడు బేత్పగే, బేతనియ ప్రాంతాలు ఉన్న ఒలీవల కొండకు చేరుకున్నారు. అప్పుడు ఆయన ఇద్దరు శిష్యుల్ని పంపిస్తూ,
2 వాళ్లకు ఇలా చెప్పాడు: “కనిపించే ఆ గ్రామానికి వెళ్లండి. మీరు అక్కడికి వెళ్లగానే కట్టేసివున్న ఒక చిన్న గాడిద మీకు కనిపిస్తుంది. ఇప్పటివరకు దానిమీద ఎవరూ కూర్చోలేదు. దాన్ని విప్పి ఇక్కడికి తీసుకురండి.
3 ఎవరైనా ‘మీరు దాన్ని ఎందుకు విప్పుతున్నారు?’ అని అడిగితే, ‘ఇది ప్రభువుకు కావాలి, మళ్లీ వెంటనే పంపించేస్తాడు’ అని చెప్పండి.”
4 ఆయన చెప్పినట్టే వాళ్లు వెళ్లారు. ఒక సందులో ఓ ఇంటి గుమ్మం ముందు కట్టేసివున్న చిన్న గాడిదను చూసి, దాన్ని విప్పారు.
5 అక్కడ నిలబడి ఉన్న కొందరు, “మీరు దాన్ని ఎందుకు విప్పుతున్నారు?” అని శిష్యుల్ని అడిగారు.
6 శిష్యులు సరిగ్గా యేసు చెప్పమన్నట్టే చెప్పారు; అప్పుడు వాళ్లు దాన్ని తీసుకువెళ్లనిచ్చారు.
7 వాళ్లు ఆ చిన్న గాడిదను యేసు దగ్గరికి తీసుకొచ్చి, దాని మీద తమ పైవస్త్రాలు వేశారు, యేసు దాని మీద కూర్చున్నాడు.
8 ఇంకా చాలామంది తమ పైవస్త్రాల్ని దారిలో పరిచారు. కొందరేమో పొలంలో నరికిన చెట్ల మట్టలు తెచ్చారు.
9 ఆయన ముందు వెళ్తున్నవాళ్లు, ఆయన వెనక వస్తున్నవాళ్లు ఇలా అరుస్తూ ఉన్నారు: “దేవా, ఈయన్ని కాపాడు! యెహోవా* పేరిట వస్తున్న ఈయన దీవెన పొందాలి!
10 రాబోయే మన తండ్రైన దావీదు రాజ్యాన్ని దేవుడు దీవించాలి! పరలోకంలో నివసించే దేవా, ఈయన్ని కాపాడు!”
11 యేసు యెరూషలేముకు వచ్చి దేవాలయంలోకి వెళ్లాడు, అక్కడ చుట్టూవున్న ప్రతీదాన్ని చూశాడు. కానీ అప్పటికే సాయంకాలం అవడంతో, పన్నెండుమంది శిష్యుల్ని తీసుకొని బేతనియకు వెళ్లిపోయాడు.
12 మరుసటి రోజు వాళ్లు బేతనియ నుండి బయల్దేరినప్పుడు ఆయనకు ఆకలేసింది.
13 కాస్త దూరంలో ఆకులున్న ఓ అంజూర చెట్టు ఆయనకు కనిపించింది. దానికి పండ్లు ఏమైనా ఉంటాయేమో అని ఆ చెట్టు దగ్గరికి వెళ్లాడు. తీరా వెళ్లి చూసేసరికి ఆకులు తప్ప ఒక్క పండు కూడా లేదు. ఎందుకంటే అది అంజూర పండ్లు కాసే కాలం కాదు.
14 అప్పుడు యేసు ఆ చెట్టుతో, “ఇంకెప్పుడూ నీ పండ్లు ఎవ్వరూ తినరు” అని అన్నాడు. ఆ మాట శిష్యులు విన్నారు.
15 తర్వాత వాళ్లు యెరూషలేముకు వచ్చారు. ఆయన ఆలయం లోపలికి వెళ్లి, ఆలయంలో అమ్మేవాళ్లను, కొనేవాళ్లను బయటికి వెళ్లగొట్టాడు. డబ్బులు మార్చేవాళ్ల బల్లల్ని, పావురాలు అమ్మేవాళ్ల బల్లల్ని తలక్రిందులుగా పడేశాడు.
16 వస్తువులు మోసుకెళ్లేవాళ్లను ఆలయం గుండా వెళ్లనివ్వలేదు.
17 ఆయన బోధిస్తూ వాళ్లతో ఇలా అన్నాడు: “‘నా మందిరం అన్ని దేశాల ప్రజలకు ప్రార్థన మందిరమని పిలవబడుతుంది’ అని లేఖనాల్లో రాసిలేదా? కానీ మీరు దీన్ని దొంగల గుహగా మార్చేశారు.”
18 ఆ మాట విన్న ముఖ్య యాజకులు, శాస్త్రులు ఆయన్ని ఎలా చంపాలా అని ఆలోచించడం మొదలుపెట్టారు; ఎందుకంటే జనమంతా ఆయన బోధకు ఆశ్చర్యపోవడం చూసి వాళ్లు ఆయనకు భయపడ్డారు.
19 సాయంకాలమైనప్పుడు యేసు, ఆయన శిష్యులు ఆ నగరం నుండి వెళ్లిపోయారు.
20 అయితే తెల్లవారుజామున వాళ్లు వెళ్తుండగా దారిలో ఆ అంజూర చెట్టు వేర్లతోసహా ఎండిపోయి ఉండడం చూశారు.
21 విషయం గుర్తుకొచ్చి, పేతురు యేసుతో ఇలా అన్నాడు: “రబ్బీ, చూడు! నువ్వు శపించిన అంజూర చెట్టు ఎండిపోయింది.”
22 అప్పుడు యేసు వాళ్లతో ఇలా అన్నాడు: “దేవుని మీద విశ్వాసం ఉంచండి.
23 నేను నిజంగా మీతో చెప్తున్నాను, ఎవరైనా ఈ కొండతో ‘నువ్వు లేచి సముద్రంలో పడిపో’ అని చెప్పి, సందేహపడకుండా తాను అన్నది జరుగుతుందని విశ్వసిస్తే, అది జరిగి తీరుతుంది.
24 అందుకే చెప్తున్నాను, ప్రార్థనలో మీరు అడిగినవన్నీ మీరు అప్పటికే పొందేశారని విశ్వసించండి, అప్పుడు మీరు వాటిని తప్పక పొందుతారు.
25 మీరు ప్రార్థించడానికి నిలబడినప్పుడు, మీకు ఎవరితోనైనా ఏమైనా గొడవ ఉంటే వాళ్లను క్షమించండి, అప్పుడే పరలోకంలో ఉన్న మీ తండ్రి కూడా మీ తప్పులను క్షమిస్తాడు.”
26 *——
27 వాళ్లు మళ్లీ యెరూషలేముకు వచ్చారు. యేసు ఆలయంలో నడుస్తుండగా ముఖ్య యాజకులు, శాస్త్రులు, పెద్దలు వచ్చి
28 ఆయన్ని ఇలా అడిగారు: “నువ్వు ఏ అధికారంతో ఇవి చేస్తున్నావు? ఇవి చేసే అధికారం నీకు ఎవరు ఇచ్చారు?”
29 యేసు వాళ్లతో ఇలా అన్నాడు: “నేను మిమ్మల్ని ఓ ప్రశ్న అడుగుతాను. దానికి మీరు సమాధానం చెప్తే, నేను ఏ అధికారంతో ఇవి చేస్తున్నానో మీకు చెప్తాను.
30 బాప్తిస్మమిచ్చే అధికారం యోహానుకు దేవుడు ఇచ్చాడా?* మనుషులు ఇచ్చారా? చెప్పండి.”
31 అప్పుడు వాళ్లలోవాళ్లు ఇలా మాట్లాడుకున్నారు: “మనం ‘దేవుడు ఇచ్చాడు’ అని చెప్తే, ‘మరి మీరు అతన్ని ఎందుకు నమ్మలేదు?’ అంటాడు.
32 పోనీ తెగించి, ‘మనుషులు ఇచ్చారు’ అని చెప్పేద్దామా?” అయితే, యోహాను నిజంగా ఒక ప్రవక్త అని ప్రజలంతా నమ్మారు కాబట్టి వాళ్లు జనానికి భయపడ్డారు.
33 అందుకే వాళ్లు యేసుతో, “మాకు తెలియదు” అని చెప్పారు. దానికి యేసు వాళ్లతో, “ఏ అధికారంతో ఇవి చేస్తున్నానో నేను కూడా మీకు చెప్పను” అన్నాడు.
అధస్సూచీలు
^ పదకోశం చూడండి.
^ మత్తయి 17:21కి ఉన్న పాదసూచిక చూడండి.
^ అక్ష., “పరలోకం నుండి వచ్చిందా?”