మార్కు 5:1-43

  • యేసు అపవిత్ర దూతల్ని పందుల్లోకి పంపడం  (1-20)

  • యాయీరు కూతురు; ఒక స్త్రీ యేసు పైవస్త్రాన్ని ముట్టుకుంటుంది  (21-43)

5  తర్వాత వాళ్లు సముద్రానికి అవతల ఉన్న గెరసవాళ్ల ప్రాంతానికి వచ్చారు.  యేసు పడవ దిగగానే, అపవిత్ర దూత పట్టిన ఒకతను సమాధుల* మధ్య నుండి ఆయన దగ్గరికి వచ్చాడు.  అతను సమాధుల మధ్యే తిరుగుతూ ఉండేవాడు, ఆ క్షణం వరకు అతన్ని ఎవ్వరూ గొలుసులతో కూడా గట్టిగా బంధించలేకపోయారు.  అతన్ని చాలాసార్లు సంకెళ్లతో, గొలుసులతో బంధించారు కానీ ప్రతీసారి అతను ఆ సంకెళ్లను తెంచేసుకొని, గొలుసుల్ని ముక్కలుముక్కలు చేసేవాడు; అతన్ని లొంగదీసుకునేంత బలం ఎవ్వరికీ లేకపోయింది.  పగలూ రాత్రి అనే తేడా లేకుండా అతను సమాధుల్లో, కొండల్లో అరుస్తూ తిరిగేవాడు, రాళ్లతో గాయపర్చుకుంటూ ఉండేవాడు.  కానీ అతను దూరం నుండి యేసును చూడగానే పరుగెత్తుకుంటూ వచ్చి ఆయనకు వంగి నమస్కారం చేశాడు.  తర్వాత అతను, “సర్వోన్నత దేవుని కుమారుడా, యేసూ, నాతో నీకేం పని? నన్ను హింసించనని దేవుని మీద ఒట్టేయి” అని గట్టిగా అరిచాడు.  ఎందుకంటే యేసు అంతకుముందు అతనితో ఇలా అన్నాడు: “అపవిత్ర దూతా, అతనిలో నుండి బయటికి రా.”  అయితే యేసు అతన్ని, “నీ పేరేంటి?” అని అడిగాడు. అందుకు అతను, “నా పేరు సేన,* ఎందుకంటే మేము చాలామందిమి ఉన్నాం” అన్నాడు. 10  తమను ఆ దేశం నుండి పంపించేయొద్దని అతను పదేపదే యేసును వేడుకున్నాడు. 11  ఆ సమయంలో కొండ మీద ఓ పెద్ద పందుల మంద మేత మేస్తూ ఉంది. 12  కాబట్టి, ఆ అపవిత్ర దూతలు ఆయన్ని ఇలా వేడుకున్నారు: “దయచేసి మమ్మల్ని ఆ పందుల్లోకి వెళ్లనివ్వు.” 13  అప్పుడు ఆయన వాళ్లను వెళ్లనిచ్చాడు. ఆ అపవిత్ర దూతలు అతనిలో నుండి బయటికి వచ్చి ఆ పందుల్లో దూరారు. దాంతో ఆ మందలోని పందులన్నీ అంటే దాదాపు 2,000 పందులు కొండ అంచువరకు* పరుగెత్తుకుంటూ వెళ్లి సముద్రంలో పడి మునిగిపోయాయి. 14  అయితే వాటిని మేపేవాళ్లు పారిపోయి నగరంలో, పల్లెల్లో ఆ సంగతి చెప్పారు. అది విన్న ప్రజలు జరిగింది చూడడానికి అక్కడికి వచ్చారు. 15  వాళ్లు యేసు దగ్గరికి వచ్చి, అంతకుముందు అపవిత్ర దూతల సేన పట్టిన మనిషి ఇప్పుడు బట్టలు వేసుకొని స్థిమితంగా కూర్చొని ఉండడం చూశారు, దాంతో వాళ్లు భయపడ్డారు. 16  చెడ్డదూతలు పట్టిన వ్యక్తి ఎలా బాగయ్యాడో, పందులు ఎలా చచ్చిపోయాయో చూసినవాళ్లు జరిగినదంతా వచ్చినవాళ్లకు చెప్పారు. 17  అప్పుడు వాళ్లు యేసును తమ ప్రాంతం నుండి వెళ్లిపొమ్మని బ్రతిమాలారు. 18  యేసు పడవ ఎక్కుతుండగా, అపవిత్ర దూతల బారినుండి బయటపడిన మనిషి తాను కూడా వస్తానని ఆయనను వేడుకున్నాడు. 19  అందుకు యేసు ఒప్పుకోకుండా అతనితో ఇలా అన్నాడు: “మీ ఇంటికి వెళ్లి, యెహోవా* నీ కోసం చేసినవాటన్నిటి గురించి, నీ మీద ఆయన చూపించిన కరుణ గురించి నీ బంధువులకు చెప్పు.” 20  అతను వెళ్లి, యేసు అతనికి చేసినవాటన్నిటి గురించి దెకపొలిలో* ప్రకటించడం మొదలుపెట్టాడు, అది విన్న ప్రజలంతా ఆశ్చర్యపోయారు. 21  యేసు మళ్లీ పడవలో అవతలి ఒడ్డుకు వెళ్లాడు. ఆయన ఇంకా సముద్ర తీరాన ఉండగానే చాలామంది ఆయన దగ్గరికి వచ్చారు. 22  ఇంతలో సభామందిర అధికారి ఒకతను అక్కడికి వచ్చాడు. అతని పేరు యాయీరు. యేసు కనబడగానే అతను ఆయన కాళ్ల మీద పడ్డాడు. 23  “మా పాపకి బాగా జబ్బు చేసింది.* దయచేసి మీరు వచ్చి తన మీద చేతులు ఉంచండి, అప్పుడు తను బాగౌతుంది, బ్రతుకుతుంది” అంటూ ఆ అధికారి ఆయనను ఎంతో బ్రతిమాలాడు. 24  అప్పుడు యేసు అతనితో వెళ్లాడు, చాలామంది ఆయన వెనకాలే వెళ్తూ ఉన్నారు, జనం ఆయన మీద పడుతూ ఉన్నారు. 25  ఆ జనంలో 12 ఏళ్లుగా రక్తస్రావంతో బాధపడుతున్న ఒకామె ఉంది. 26  ఆమె ఎంతోమంది వైద్యుల దగ్గరికి వెళ్లి నానా బాధలు పడింది,* ఉన్నదంతా ఖర్చుపెట్టింది. కానీ రోగం నయం కాలేదు, ఇంకా ముదిరింది. 27  యేసు గురించిన వార్తలు విన్న ఆమె అందర్నీ దాటుకుంటూ ఆయన దగ్గరికి వచ్చి, వెనకనుండి ఆయన వస్త్రాన్ని ముట్టుకుంది. 28  ఎందుకంటే, “నేను ఆయన వస్త్రాన్ని ముట్టుకుంటే చాలు, నాకు బాగౌతుంది” అని ఆమె అనుకుంటూ ఉంది. 29  ఆ క్షణంలోనే ఆమె రక్తస్రావం ఆగిపోయింది, తనని ఎంతో బాధించిన ఆ రోగం నయమైపోయిందని ఆమెకు అర్థమైంది. 30  వెంటనే యేసుకు తనలో నుండి శక్తి బయటికి వెళ్లినట్లు అర్థమైంది, ఆయన వెనక్కి తిరిగి జనాన్ని చూస్తూ, “నా వస్త్రాన్ని ముట్టుకున్నది ఎవరు?” అని అడిగాడు. 31  అయితే శిష్యులు ఆయనతో, “అందరూ తోసుకుంటూ నీ మీద పడుతుంటే, ‘నన్ను ముట్టుకున్నది ఎవరు?’ అని అడుగుతున్నావేంటి?” అన్నారు. 32  అయినా యేసు తనను ముట్టుకున్నది ఎవరో తెలుసుకోవడానికి చుట్టూ చూశాడు. 33  అప్పుడు, తాను బాగయ్యానని గ్రహించిన ఆ స్త్రీ భయంతో వణికిపోతూ ఆయన ముందు మోకరించి విషయమంతా ఆయనకు చెప్పింది. 34  ఆయన ఆమెతో ఇలా అన్నాడు: “అమ్మా,* నీ విశ్వాసం నిన్ను బాగుచేసింది. మనశ్శాంతితో వెళ్లు, ఏ నొప్పీ లేకుండా ఆరోగ్యంగా ఉండు.” 35  ఆయన ఇంకా మాట్లాడుతుండగా, సభామందిర అధికారి ఇంటినుండి కొంతమంది వచ్చి, “నీ కూతురు చనిపోయింది! ఇక బోధకుణ్ణి ఇబ్బందిపెట్టకు” అన్నారు. 36  కానీ, యేసు వాళ్ల మాటలు విని ఆ అధికారితో, “భయపడకు,* విశ్వాసం మాత్రం ఉంచు” అన్నాడు. 37  తర్వాత పేతురును, యాకోబును, అతని సోదరుడు యోహానును తప్ప ఇంకెవ్వరినీ యేసు తనతో రానివ్వలేదు. 38  వాళ్లు సభామందిర అధికారి ఇంటికి వచ్చారు. అక్కడ అంతా గోలగా ఉండడం, ప్రజలు దుఃఖిస్తూ బోరున ఏడ్వడం ఆయన చూశాడు. 39  ఆయన లోపలికి వచ్చాక వాళ్లతో ఇలా అన్నాడు: “మీరు ఎందుకు ఏడుస్తున్నారు? ఎందుకు గోల చేస్తున్నారు? పాప చనిపోలేదు, నిద్రపోతోంది అంతే.” 40  ఆ మాట వినగానే వాళ్లు ఆయన్ని చూసి వెటకారంగా నవ్వడం మొదలుపెట్టారు. కానీ ఆయన వాళ్లందరినీ బయటికి పంపించేసి, పాప తల్లిదండ్రులను, తనతో ఉన్నవాళ్లను తీసుకొని పాప ఉన్న గదిలోకి వచ్చాడు. 41  తర్వాత ఆయన పాప చేయి పట్టుకొని “తలీతా కుమీ” అన్నాడు. ఆ మాటకు, “పాపా, లేమ్మా!” అని అర్థం. 42  వెంటనే పాప లేచి నడిచింది. (ఆమెకు 12 ఏళ్లు.) అది చూసి వాళ్లు ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యారు. 43  కానీ ఈ విషయం ఎవ్వరికీ తెలియకూడదని ఆయన వాళ్లకు మరీమరీ చెప్పాడు,* తినడానికి పాపకు ఏమైనా పెట్టమని కూడా అన్నాడు.

అధస్సూచీలు

లేదా “స్మారక సమాధుల.”
మత్తయి 26:53కి ఉన్న పాదసూచిక చూడండి.
లేదా “ఏటవాలుగా ఉన్న కొన వరకు.”
పదకోశం చూడండి.
లేదా “పది నగరాలున్న ప్రాంతంలో.”
లేదా “పాప కొన ఊపిరితో ఉంది.”
లేదా “ఎంతో నొప్పిని అనుభవించింది.”
అక్ష., “కుమారీ.”
లేదా “ఆందోళనపడకు.”
లేదా “గట్టిగా ఆజ్ఞాపించాడు.”