యోహాను 11:1-57

  • లాజరు చనిపోవడం  (1-16)

  • యేసు మార్తను, మరియను ఓదార్చడం  (17-37)

  • యేసు లాజరును పునరుత్థానం చేయడం  (38-44)

  • యేసును చంపడానికి కుట్ర  (45-57)

11  బేతనియలో లాజరు అనే ఒకతను ఉండేవాడు, అతనికి జబ్బు చేసింది; ఆ గ్రామంలోనే మరియ, ఆమె సోదరి మార్త ఉండేవాళ్లు.  ప్రభువు పాదాల మీద అత్తరు పోసి, వాటిని తన తలవెంట్రుకలతో తుడిచింది ఈ మరియే; జబ్బుపడిన లాజరు ఆమె సోదరుడు.  దాంతో అతని సోదరీలు యేసుకు ఇలా కబురు పంపించారు: “ప్రభువా, వచ్చి చూడు! నువ్వు ప్రేమిస్తున్న వ్యక్తి జబ్బుపడ్డాడు.”  అయితే అది విన్నప్పుడు యేసు ఇలా అన్నాడు: “ఈ జబ్బు అతను చనిపోవడానికి రాలేదు, కానీ దేవుని మహిమ కోసం వచ్చింది. దాని ద్వారా దేవుని కుమారుడు మహిమపర్చబడడానికి వచ్చింది.”  యేసు మార్తను, ఆమె సోదరిని, లాజరును ప్రేమించాడు.  అయితే లాజరు జబ్బుపడ్డాడని విన్నప్పుడు, యేసు తానున్న చోటే మరో రెండు రోజులు ఉండిపోయాడు.  ఆ తర్వాత ఆయన తన శిష్యులతో, “మనం మళ్లీ యూదయకు వెళ్దాం” అన్నాడు.  శిష్యులు ఆయనతో, “రబ్బీ, ఈమధ్యే యూదయవాళ్లు నిన్ను రాళ్లతో కొట్టాలని చూశారు. నువ్వు మళ్లీ అక్కడికి వెళ్తావా?” అన్నారు.  అప్పుడు యేసు ఇలా అన్నాడు: “పగలు 12 గంటలు ఉన్నాయి కదా? ఎవరైనా పగటిపూట నడిస్తే, వాళ్లు ఈ లోకపు వెలుగును చూస్తారు కాబట్టి దేనివల్లా తడబడరు. 10  కానీ ఎవరైనా రాత్రిపూట నడిస్తే, అతనిలో వెలుగు లేదు కాబట్టి అతను తడబడతాడు.” 11  ఈ విషయాలు చెప్పాక యేసు ఇంకా ఇలా అన్నాడు: “మన స్నేహితుడు లాజరు నిద్రపోతున్నాడు, అతన్ని లేపడానికి వెళ్తున్నాను.” 12  అప్పుడు శిష్యులు ఆయనతో, “ప్రభువా, అతను నిద్రపోతుంటే బాగవుతాడు” అన్నారు. 13  అయితే లాజరు మరణం గురించి యేసు ఆ మాట అన్నాడు. కానీ అతను నిద్రపోయి విశ్రాంతి తీసుకోవడం గురించి యేసు మాట్లాడుతున్నాడని వాళ్లు అనుకున్నారు. 14  అప్పుడు యేసు వాళ్లతో స్పష్టంగా ఇలా చెప్పాడు: “లాజరు చనిపోయాడు, 15  అయితే నేను అక్కడ లేనందుకు సంతోషిస్తున్నాను. ఎందుకంటే నేను చేయబోయే పని మీ విశ్వాసాన్ని బలపరుస్తుంది. మనం అతని దగ్గరికి వెళ్దాం.” 16  అప్పుడు దిదుమ అని పిలువబడిన తోమా తన తోటి శిష్యులతో ఇలా అన్నాడు: “మనం కూడా వెళ్దాం, ఆయనతో పాటు చనిపోదాం.” 17  యేసు బేతనియకు చేరుకున్నప్పుడు, లాజరు అప్పటికే నాలుగు రోజులుగా సమాధిలో* ఉన్నాడని తెలుసుకున్నాడు. 18  బేతనియ యెరూషలేముకు సుమారు రెండు మైళ్ల* దూరంలో ఉంది. 19  తమ సోదరుణ్ణి పోగొట్టుకున్న మార్తను, మరియను ఓదార్చడానికి చాలామంది యూదులు వాళ్ల దగ్గరికి వచ్చారు. 20  యేసు వస్తున్నాడని విన్నప్పుడు మార్త ఆయన్ని కలుసుకోవడానికి వెళ్లింది, మరియ మాత్రం ఇంట్లోనే ఉండిపోయింది. 21  మార్త యేసుతో ఇలా అంది: “ప్రభువా, నువ్వు ఇక్కడ ఉండివుంటే నా సోదరుడు చనిపోయేవాడు కాదు. 22  ఇప్పటికీ నువ్వు దేవుణ్ణి ఏది అడిగినా ఆయన నీకు ఇస్తాడని నాకు నమ్మకం ఉంది.” 23  యేసు ఆమెతో, “నీ సోదరుడు లేస్తాడు” అన్నాడు. 24  అందుకు మార్త, “చివరి రోజున పునరుత్థానం జరిగే సమయంలో లేస్తాడని నాకు తెలుసు” అంది. 25  అప్పుడు యేసు ఆమెతో ఇలా అన్నాడు: “పునరుత్థానాన్ని, జీవాన్ని నేనే. నా మీద విశ్వాసం చూపించే వ్యక్తి చనిపోయినా మళ్లీ బ్రతుకుతాడు; 26  అంతేకాదు, ఇప్పుడు జీవిస్తూ నా మీద విశ్వాసం చూపించే వ్యక్తి ఎప్పటికీ చనిపోడు. నువ్వు దీన్ని నమ్ముతున్నావా?” 27  అందుకు ఆమె ఇలా అంది: “అవును ప్రభువా, నువ్వు దేవుని కుమారుడివైన క్రీస్తువు అని, లోకంలోకి రావాల్సిన వ్యక్తివి అని నేను నమ్ముతున్నాను.” 28  ఆమె ఈ మాటలు చెప్పి అక్కడి నుండి వెళ్లిపోయింది. ఆమె తన సోదరి మరియను పక్కకు పిలిచి ఇలా అంది: “బోధకుడు వచ్చాడు, నిన్ను పిలుస్తున్నాడు.” 29  మరియ ఆ మాట వినగానే వెంటనే లేచి, ఆయన దగ్గరికి వెళ్లింది. 30  యేసు ఇంకా గ్రామంలోకి రాలేదు, మార్త ఆయన్ని కలిసిన చోటే ఉన్నాడు. 31  ఆ సమయంలో కొంతమంది యూదులు మరియను ఓదార్చడానికి ఆమె ఇంట్లో ఉన్నారు. ఆమె వెంటనే లేచి బయటికి వెళ్లడం చూసి వాళ్లు ఆమె వెనకాలే వెళ్లారు. ఆమె ఏడవడానికి సమాధి* దగ్గరికి వెళ్తోందని వాళ్లు అనుకున్నారు. 32  మరియ యేసు ఉన్న చోటికి వచ్చి, ఆయన్ని చూడగానే ఆయన పాదాల మీద పడి, “ప్రభువా, నువ్వు ఇక్కడ ఉండివుంటే నా సోదరుడు చనిపోయేవాడు కాదు” అని అంది. 33  ఆమె ఏడుస్తూ ఉండడం, ఆమెతోపాటు వచ్చిన యూదులు ఏడుస్తూ ఉండడం చూసినప్పుడు యేసు తనలోతాను మూలిగాడు, చాలా బాధపడ్డాడు. 34  యేసు ఇలా అడిగాడు: “మీరు అతన్ని ఎక్కడ ఉంచారు?” అందుకు వాళ్లు, “ప్రభువా, వచ్చి చూడు” అన్నారు. 35  యేసు కన్నీళ్లు పెట్టుకున్నాడు. 36  అది చూసి యూదులు, “ఈయన అతన్ని ఎంతగా ప్రేమించాడో చూడండి” అని చెప్పుకున్నారు. 37  కానీ వాళ్లలో కొంతమంది ఇలా అన్నారు: “గుడ్డివాడికి చూపు తెప్పించిన ఈయన అతన్ని చనిపోకుండా ఆపలేకపోయేవాడా?” 38  అప్పుడు యేసు మళ్లీ తనలోతాను మూలిగి, సమాధి* దగ్గరికి వచ్చాడు. నిజానికి అది ఒక గుహ. దానికి అడ్డంగా ఒక రాయి పెట్టబడి ఉంది. 39  “ఆ రాయిని తీసేయండి” అని యేసు చెప్పాడు. చనిపోయిన వ్యక్తి సోదరియైన మార్త యేసుతో ఇలా అంది: “ప్రభువా, అతను చనిపోయి నాలుగు రోజులైంది కాబట్టి శరీరం ఇప్పటికి వాసన వస్తుంటుంది.” 40  యేసు ఆమెతో ఇలా అన్నాడు: “నువ్వు నమ్మితే, దేవుని మహిమను చూస్తావని నేను నీకు చెప్పలేదా?” 41  దాంతో వాళ్లు ఆ రాయిని తీసేశారు. యేసు అప్పుడు ఆకాశంవైపు చూసి ఇలా అన్నాడు: “తండ్రీ, నువ్వు నా ప్రార్థన విన్నందుకు నీకు కృతజ్ఞతలు. 42  నువ్వు నా ప్రార్థనను ఎప్పుడూ వింటావని నాకు తెలుసు; అయితే నా చుట్టూ ఉన్న ప్రజలు నువ్వు నన్ను పంపించావని నమ్మేలా వాళ్ల గురించే నేను ఈ మాట అన్నాను.” 43  ఆయన ఈ మాటలు అన్న తర్వాత, “లాజరూ, బయటికి రా!” అని బిగ్గరగా పిలిచాడు. 44  దాంతో చనిపోయిన వ్యక్తి బయటికి వచ్చాడు. అతని కాళ్లకు, చేతులకు వస్త్రాలు చుట్టివున్నాయి. అతని ముఖానికి గుడ్డ చుట్టివుంది. యేసు వాళ్లతో, “అతని కట్లు విప్పి, అతన్ని వెళ్లనివ్వండి” అన్నాడు. 45  కాబట్టి, మరియ దగ్గరికి వచ్చిన చాలామంది యూదులు యేసు చేసిన పనిని చూసి ఆయనమీద విశ్వాసం ఉంచారు. 46  కొంతమంది మాత్రం పరిసయ్యుల దగ్గరికి వెళ్లి, యేసు చేసినదాని గురించి వాళ్లకు చెప్పారు. 47  అప్పుడు ముఖ్య యాజకులు, పరిసయ్యులు మహాసభను సమావేశపర్చి ఇలా అన్నారు: “మనం ఏంచేద్దాం? ఈ మనిషి ఎన్నో అద్భుతాలు చేస్తున్నాడు. 48  ఆయన్ని ఇలాగే వదిలేస్తే, అందరూ ఆయనమీద విశ్వాసం ఉంచుతారు. అప్పుడు రోమన్లు వచ్చి మన స్థలాన్ని,* మన దేశాన్ని లాక్కుంటారు.” 49  వాళ్లలో కయప అనే వ్యక్తి కూడా ఉన్నాడు. ఆ సంవత్సరం అతను ప్రధానయాజకుడు. అతను వాళ్లతో ఇలా అన్నాడు: “మీకు అసలేమీ తెలీదు, 50  దేశమంతా నాశనం కావడం కన్నా, అందరి కోసం ఒక మనిషి చనిపోవడం మీకు మంచిదని అనిపించడం లేదా?” 51  అయితే, అతను తనంతట తాను ఈ మాట చెప్పలేదు గానీ, ఆ సంవత్సరం అతను ప్రధానయాజకునిగా ఉన్నాడు కాబట్టి, యేసు తన ప్రజల కోసం చనిపోవాల్సి ఉందని ప్రవచించాడు. 52  తన ప్రజల కోసమే కాదు, చెదిరివున్న దేవుని పిల్లల్ని ఒకటి చేయడానికి కూడా ఆయన చనిపోవాల్సి ఉందని ప్రవచించాడు. 53  అందుకే, ఆ రోజు నుండి వాళ్లు ఆయన్ని చంపడానికి కుట్ర పన్నుతూ ఉన్నారు. 54  కాబట్టి, యేసు అప్పటినుండి యూదుల మధ్య బహిరంగంగా తిరగడం మానేశాడు. ఆయన అక్కడి నుండి అరణ్యానికి దగ్గర్లో ఉన్న ఎఫ్రాయిము అనే నగరానికి వెళ్లి, శిష్యులతో కలిసి అక్కడ ఉన్నాడు. 55  యూదుల పస్కా పండుగ దగ్గరపడింది. కాబట్టి, దేశమంతటా ఉన్న చాలామంది ప్రజలు ఆచారబద్ధంగా శుద్ధి చేసుకోవడానికి పస్కా పండుగకు ముందే యెరూషలేముకు వెళ్లారు. 56  వాళ్లు అక్కడ యేసు కోసం వెతుకుతూ, దేవాలయంలో నిలబడి ఒకరితో ఒకరు ఇలా చెప్పుకున్నారు: “మీకు ఏమనిపిస్తుంది? ఆయన పండుగకు అసలు రాడా?” 57  అయితే తాము యేసును బంధించేలా, ఆయన ఎక్కడ ఉన్నాడో ఎవరికైనా తెలిస్తే తమకు చెప్పాలని ముఖ్య యాజకులు, పరిసయ్యులు ఆదేశాలు ఇచ్చారు.

అధస్సూచీలు

లేదా “స్మారక సమాధిలో.”
దాదాపు మూడు కిలోమీటర్లు. అక్ష., “పదిహేను స్టేడియా.” పదకోశంలో “మైలు” చూడండి.
లేదా “స్మారక సమాధి.”
లేదా “స్మారక సమాధి.”
అంటే, ఆలయాన్ని.