యోహాను 2:1-25

  • కానాలో పెళ్లి; నీళ్లను ద్రాక్షారసంగా మార్చడం  (1-12)

  • ఆలయాన్ని యేసు శుభ్రం చేయడం  (13-22)

  • మానవ స్వభావం యేసుకు తెలుసు (23-25)

2  రెండు రోజుల తర్వాత, గలిలయలోని కానా అనే ఊరిలో ఒక పెళ్లివిందు జరిగింది, యేసు తల్లి అక్కడే ఉంది.  యేసు, ఆయన శిష్యులు కూడా ఆ పెళ్లివిందుకు ఆహ్వానించబడ్డారు.  అక్కడ ద్రాక్షారసం అయిపోతున్నప్పుడు యేసు తల్లి ఆయనతో, “వాళ్ల దగ్గర ద్రాక్షారసం లేదు” అని చెప్పింది.  అయితే యేసు ఆమెతో, “దానికి మనమేం చేస్తాం? నా సమయం ఇంకా రాలేదు” అన్నాడు.  పనివాళ్లకు ఆయన తల్లి ఇలా చెప్పింది: “ఆయన మీకు ఏంచెప్తే అది చేయండి.”  అక్కడ యూదుల ఆచారం ప్రకారం శుద్ధీకరణ కోసం రాతితో చేసిన ఆరు నీటి బానలు ఉన్నాయి. ఒక్కోదానిలో రెండు లేదా మూడు కుండల* నీళ్లు పడతాయి.  యేసు ఆ పనివాళ్లతో, “ఆ బానలను నీళ్లతో నింపండి” అన్నాడు. దాంతో వాళ్లు అంచుల దాకా నింపారు.  తర్వాత ఆయన, “మీరు ఇప్పుడు వాటిలో నుండి కొంచెం తీసుకుని, విందు నిర్వాహకుడి దగ్గరికి వెళ్లండి” అని వాళ్లకు చెప్పాడు. వాళ్లు ఆయన చెప్పినట్లే చేశారు.  విందు నిర్వాహకుడు ద్రాక్షారసంగా మారిన ఆ నీళ్లను రుచి చూశాడు. ఆ ద్రాక్షారసం ఎక్కడనుండి వచ్చిందో అతనికి తెలీదు. ఆ నీళ్లను తెచ్చిన పనివాళ్లకు మాత్రం ఆ విషయం తెలుసు. విందు నిర్వాహకుడు పెళ్లికొడుకును పిలిచి, 10  “అందరూ మొదట మంచి ద్రాక్షారసం పోసి, ప్రజలు మత్తులో ఉన్నప్పుడు తక్కువ రకం ద్రాక్షారసం పోస్తారు. నువ్వు మాత్రం ఇప్పుడు మంచి ద్రాక్షారసాన్ని ఇస్తున్నావు” అన్నాడు. 11  గలిలయలోని కానాలో యేసు చేసిన ఈ అద్భుతం ఆయన చేసిన అద్భుతాల్లో మొదటిది. దాని ద్వారా ఆయన తన మహిమను అందరికీ చూపించాడు, ఆయన శిష్యులు ఆయనమీద విశ్వాసం ఉంచారు. 12  తర్వాత యేసు, ఆయన తల్లి, ఆయన తమ్ముళ్లు, ఆయన శిష్యులు కపెర్నహూముకు వెళ్లారు. అయితే వాళ్లు అక్కడ ఎక్కువ రోజులు ఉండలేదు. 13  యూదుల పస్కా పండగ దగ్గరపడింది కాబట్టి యేసు యెరూషలేముకు వెళ్లాడు. 14  ఆయన ఆలయంలోకి వెళ్లినప్పుడు, అక్కడ ప్రజలు పశువుల్ని, గొర్రెల్ని, పావురాల్ని అమ్మడం; డబ్బులు మార్చేవాళ్లు తమ స్థానాల్లో కూర్చొని ఉండడం చూశాడు. 15  అప్పుడు యేసు తాళ్లతో ఒక కొరడా చేసి వాళ్లందర్ని, వాళ్ల గొర్రెల్ని, పశువుల్ని ఆలయంలో నుండి వెళ్లగొట్టాడు. డబ్బు మార్చేవాళ్ల నాణేలను, వాళ్ల బల్లలను కింద పడేశాడు. 16  పావురాలను అమ్మేవాళ్లతో, “వీటిని ఇక్కడినుండి తీసుకెళ్లండి! నా తండ్రి ఆలయాన్ని వ్యాపారస్థలంగా* మార్చకండి!” అన్నాడు. 17  అప్పుడు ఆయన శిష్యులు, “నీ ఇంటి విషయంలో నాకున్న ఉత్సాహం మండుతున్న అగ్నిలా ఉంటుంది” అని రాయబడి ఉందని గుర్తుతెచ్చుకున్నారు. 18  యూదులు అది చూసి యేసును, “నువ్వు ఈ పనులు చేస్తున్నావు కదా, వీటిని చేసే హక్కు నీకుందని ఏ అద్భుతం చేసి చూపిస్తావు?” అని అడిగారు. 19  యేసు వాళ్లకు, “ఈ ఆలయాన్ని పడగొట్టండి, మూడు రోజుల్లో నేను దాన్ని లేపుతాను” అని జవాబిచ్చాడు. 20  అప్పుడు యూదులు, “ఈ ఆలయాన్ని కట్టడానికి 46 సంవత్సరాలు పట్టింది, నువ్వు దాన్ని మూడు రోజుల్లో లేపుతావా?” అన్నారు. 21  కానీ, ఆయన తన శరీరం అనే ఆలయం గురించి ఆ మాట అన్నాడు. 22  అయితే ఆయన మృతుల్లో నుండి బ్రతికించబడినప్పుడు, ఆయన శిష్యులు యేసు ఈ మాట తరచూ చెప్పేవాడని గుర్తుతెచ్చుకున్నారు. వాళ్లు లేఖనాల్ని, యేసు మాటల్ని నమ్మారు. 23  అయితే యేసు యెరూషలేములో ఉన్నప్పుడు పస్కా పండుగ సమయంలో అద్భుతాలు చేశాడు. వాటిని చూసి చాలామంది ఆయన పేరుమీద విశ్వాసం ఉంచారు. 24  కానీ యేసు వాళ్లను పూర్తిగా నమ్మలేదు, ఎందుకంటే ఆయనకు మనుషుల హృదయాల్లో ఏముందో తెలుసు. 25  అంతేకాదు, మనుషుల గురించి ఎవ్వరూ ఆయనకు సాక్ష్యం ఇవ్వాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మానవ స్వభావం ఆయనకు తెలుసు.

అధస్సూచీలు

ఒక్కొక్క కుండలో సుమారు 22 లీటర్ల నీళ్లు పట్టేవి.
లేదా “సంతలా.”