లూకా 9:1-62

  • పరిచర్య కోసం ఆ పన్నెండుమందికి నిర్దేశాలు (1-6)

  • యేసును బట్టి హేరోదు కంగారుపడతాడు (7-9)

  • యేసు 5,000 మందికి ఆహారం పెడతాడు (10-17)

  • పేతురు క్రీస్తును గుర్తిస్తాడు (18-20)

  • యేసు చనిపోతాడని ముందే చెప్పబడింది  (21, 22)

  • యేసును అనుసరించాలంటే ఏంచేయాలి  (23-27)

  • యేసు రూపం మారిపోవడం  (28-36)

  • చెడ్డదూత పట్టిన అబ్బాయి బాగవుతాడు (37-43ఎ )

  • యేసు చనిపోతాడని మరోసారి ముందే చెప్పబడింది  (43బి -45)

  • ఎవరు గొప్ప అని శిష్యులు వాదించుకుంటారు (46-48)

  • మనకు వ్యతిరేకంగా లేని వ్యక్తి మనవైపే ఉన్నాడు (49, 50)

  • సమరయలోని ఒక గ్రామంవాళ్లు యేసును తిరస్కరిస్తారు (51-56)

  • యేసును ఎలా అనుసరించాలి  (57-62)

9  తర్వాత ఆయన ఆ 12 మందిని పిలిచి, చెడ్డదూతలందర్నీ వెళ్లగొట్టడానికి, రోగుల్ని బాగుచేయడానికి వాళ్లకు శక్తిని, అధికారాన్ని ఇచ్చాడు.  అలాగే, దేవుని రాజ్యం గురించి ప్రకటించడానికి, రోగుల్ని బాగుచేయడానికి వాళ్లను పంపిస్తూ  ఇలా చెప్పాడు: “ప్రయాణం కోసం ఏమీ తీసుకెళ్లొద్దు. చేతికర్రను గానీ, ఆహారం మూటను గానీ, రొట్టెను గానీ, డబ్బులు* గానీ తీసుకెళ్లొద్దు. అదనపు వస్త్రాన్ని* కూడా ఉంచుకోవద్దు.  అయితే ఎక్కడైనా మీరొక ఇంట్లో అడుగుపెడితే, ఆ ఊరిని విడిచి వెళ్లిపోయేవరకు ఆ ఇంట్లోనే ఉండండి.  ఎక్కడైనా ప్రజలు మిమ్మల్ని చేర్చుకోకపోతే, ఆ ఊరిని విడిచి వెళ్లేటప్పుడు వాళ్లకు హెచ్చరికగా ఉండడానికి మీ పాదాలకు అంటుకున్న దుమ్ము అక్కడే దులిపేయండి.”  తర్వాత ఆ పన్నెండుమంది బయల్దేరి, ఆ ప్రాంతంలోని గ్రామాలన్నిటిలో తిరుగుతూ ప్రతీచోట మంచివార్త ప్రకటిస్తూ, రోగుల్ని బాగుచేస్తూ వెళ్లారు.  ఆ జిల్లా పరిపాలకుడు* హేరోదు* జరుగుతున్న వాటన్నిటి గురించి విని, చాలా కంగారుపడ్డాడు. ఎందుకంటే, యోహాను మళ్లీ బ్రతికాడని కొంతమంది చెప్పుకుంటున్నారు.  అయితే ఇంకొంతమంది ఏలీయా మళ్లీ వచ్చాడని, మరికొంతమంది ప్రాచీన ప్రవక్తల్లో ఒకరు మళ్లీ బ్రతికారని చెప్పుకుంటున్నారు.  హేరోదు ఇలా అన్నాడు: “యోహాను తలను నేను నరికించాను కదా. మరైతే ఈయన ఎవరు? ఈయన గురించి నేను రకరకాల విషయాలు వింటున్నాను.” కాబట్టి హేరోదు ఆయన్ని చూడాలని ఎంతో కోరుకున్నాడు. 10  అపొస్తలులు తిరిగివచ్చినప్పుడు, తాము చేసినవాటన్నిటి గురించి యేసుకు చెప్పారు. కాబట్టి ఆయన వాళ్లను వెంటబెట్టుకొని, వాళ్లు ఏకాంతంగా ఉండడం కోసం బేత్సయిదా నగరానికి తీసుకెళ్లాడు. 11  అయితే జనాలు ఆ సంగతి తెలుసుకొని, ఆయన వెనుక వెళ్లారు. ఆయన వాళ్లను ప్రేమతో చేర్చుకొని, దేవుని రాజ్యం గురించి వాళ్లతో మాట్లాడడం మొదలుపెట్టాడు; రోగాలతో బాధపడుతున్న వాళ్లను బాగుచేశాడు. 12  సాయంత్రం కావస్తున్నప్పుడు ఆ పన్నెండుమంది ఆయన దగ్గరకు వచ్చి ఇలా అన్నారు: “మనం మారుమూల ప్రాంతంలో ఉన్నాం. కాబట్టి నువ్వు ప్రజల్ని పంపించేస్తే, వాళ్లు చుట్టుపక్కల గ్రామాల్లోకి, పల్లెల్లోకి వెళ్లి ఉండడానికి స్థలం వెతుక్కుంటారు, ఆహారం కొనుక్కుంటారు.” 13  అయితే యేసు వాళ్లతో ఇలా అన్నాడు: “మీరే వాళ్లకు తినడానికి ఏమైనా పెట్టండి.” దానికి వాళ్లు ఇలా అన్నారు: “మా దగ్గర ఐదు రొట్టెలు, రెండు చేపలు తప్ప ఇంకేమీ లేవు. మేము వెళ్లి వీళ్లందరి కోసం ఆహారం కొనుక్కురావాలా?” 14  నిజానికి అక్కడ దాదాపు 5,000 మంది పురుషులు ఉన్నారు. అయితే యేసు తన శిష్యులతో ఇలా చెప్పాడు: “ఒక్కో గుంపులో దాదాపు 50 మంది ఉండేలా వాళ్లందర్నీ గుంపులు గుంపులుగా కూర్చోబెట్టండి.” 15  వాళ్లు ఆయన చెప్పినట్టే ప్రజలందర్నీ కూర్చోబెట్టారు. 16  ఆయన ఆ ఐదు రొట్టెల్ని, రెండు చేపల్ని తీసుకొని ఆకాశం వైపు చూసి వాటిని ఆశీర్వదించాడు. తర్వాత ఆయన వాటిని విరిచి, ప్రజలకు పెట్టమని తన శిష్యులకు ఇవ్వడం మొదలుపెట్టాడు. 17  దాంతో వాళ్లంతా తృప్తిగా తిన్నారు. మిగిలిన ముక్కల్ని పోగుచేసినప్పుడు 12 గంపలు అయ్యాయి. 18  ఒకరోజు యేసు ఒంటరిగా ఉండి ప్రార్థిస్తున్నప్పుడు శిష్యులు ఆయన దగ్గరికి వచ్చారు. అప్పుడాయన, “ప్రజలు నేను ఎవరినని చెప్పుకుంటున్నారు?” అని వాళ్లను అడిగాడు. 19  దానికి వాళ్లు ఇలా జవాబిచ్చారు: “బాప్తిస్మమిచ్చే యోహానువని చెప్పుకుంటున్నారు. కొంతమందేమో ఏలీయావని చెప్పుకుంటున్నారు. ఇంకొంతమంది, ప్రాచీన ప్రవక్తల్లో ఒకరు మళ్లీ బ్రతికారని చెప్పుకుంటున్నారు.” 20  అప్పుడాయన, “మరి మీరు, నేనెవరినని అనుకుంటున్నారు?” అని వాళ్లను అడిగాడు. అందుకు పేతురు, “నువ్వు దేవుడు పంపిన క్రీస్తువు” అన్నాడు. 21  తర్వాత యేసు, ఆ విషయం ఎవరికీ చెప్పొద్దని వాళ్లకు గట్టిగా ఆజ్ఞాపించాడు. 22  అంతేకాదు ఆయన ఇలా అన్నాడు: “మానవ కుమారుడు ఎన్నో బాధలు పడాలి; పెద్దల చేత, ముఖ్య యాజకుల చేత, శాస్త్రుల చేత తిరస్కరించబడి, చంపబడాలి; తర్వాత మూడో రోజున బ్రతికించబడాలి.” 23  తర్వాత ఆయన అందరితో ఇలా చెప్పడం మొదలుపెట్టాడు: “ఒక వ్యక్తి నా శిష్యుడు అవ్వాలనుకుంటే, అతను తన జీవితాన్ని త్యాగం చేసి, ప్రతీరోజు తన హింసాకొయ్యను* మోస్తూ, నన్ను అనుసరిస్తూ ఉండాలి. 24  ఎందుకంటే తన ప్రాణాన్ని కాపాడుకోవాలని అనుకునే వ్యక్తి చనిపోతాడు. కానీ నా కోసం చనిపోయే వ్యక్తి మళ్లీ బ్రతుకుతాడు. 25  నిజానికి, ఒక వ్యక్తి లోకాన్నంతా సంపాదించుకొని తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే లేదా హాని చేసుకుంటే, అతనికి ఏమి లాభం? 26  ఎవరైనా నా శిష్యులుగా ఉండడానికి, నా మాటలు నమ్మడానికి సిగ్గుపడితే మానవ కుమారుడు తన మహిమతో, తన తండ్రి మహిమతో, తన పవిత్ర దూతల మహిమతో వచ్చినప్పుడు వాళ్ల విషయంలో సిగ్గుపడతాడు. 27  నేను నిజంగా చెప్తున్నాను, ఇక్కడ ఉన్నవాళ్లలో కొంతమంది దేవుని రాజ్యాన్ని చూసేవరకు చనిపోరు.” 28  నిజానికి, ఆ మాటలు చెప్పిన దాదాపు ఎనిమిది రోజుల తర్వాత యేసు పేతురును, యోహానును, యాకోబును వెంటబెట్టుకొని ప్రార్థించడానికి కొండ మీదికి వెళ్లాడు. 29  ఆయన ప్రార్థిస్తుండగా ఆయన ముఖ రూపం మారిపోయింది. ఆయన బట్టలు తెల్లగా అయ్యి తళతళ మెరుస్తున్నాయి. 30  అప్పుడు ఇదిగో! ఇద్దరు మనుషులు ఆయనతో మాట్లాడుతున్నారు. వాళ్లు ఎవరంటే మోషే, ఏలీయా. 31  వాళ్లు తేజస్సుతో కనిపించి, యేసు ఈ లోకం నుండి వెళ్లిపోవడం గురించి, అంటే యెరూషలేములో ఆయన నెరవేర్చబోతున్న దాని గురించి మాట్లాడడం మొదలుపెట్టారు. 32  అప్పుడు పేతురు, అతనితో పాటు ఉన్నవాళ్లు నిద్రమత్తులో ఉన్నారు. వాళ్లు పూర్తిగా మేల్కొన్నప్పుడు ఆయన తేజస్సును, ఆయనతో పాటు నిలబడి ఉన్న ఆ ఇద్దర్ని చూశారు. 33  వాళ్లిద్దరు ఆయన దగ్గర నుండి వెళ్లిపోతుండగా, పేతురు యేసుతో ఇలా అన్నాడు: “బోధకుడా, మనం ఇక్కడే ఉంటే బాగుంటుంది. మమ్మల్ని మూడు డేరాలు వేయనివ్వు; ఒకటి నీకు, ఒకటి మోషేకు, ఒకటి ఏలీయాకు.” నిజానికి అతను ఏమి మాట్లాడుతున్నాడో అతనికే తెలియట్లేదు. 34  అతను అలా మాట్లాడుతుండగా ఒక మేఘం ఏర్పడి వాళ్లను కమ్ముకోవడం మొదలుపెట్టింది. దాంతో వాళ్లు భయపడిపోయారు. 35  అప్పుడు ఆ మేఘంలో నుండి ఒక స్వరం ఇలా వినిపించింది: “ఈయన నేను ఎంచుకున్న నా కుమారుడు. ఈయన మాట వినండి.” 36  ఆ స్వరం వినిపించే సమయానికి అక్కడ యేసు మాత్రమే కనిపించాడు. అయితే ఆ రోజుల్లో వాళ్లు తాము చూసిన వాటిలో దేని గురించీ ఎవరికీ చెప్పలేదు. 37  తర్వాతి రోజు వాళ్లు కొండ దిగి వచ్చినప్పుడు, చాలామంది ప్రజలు ఆయనకు ఎదురయ్యారు. 38  అప్పుడు ఇదిగో! వాళ్లలో ఒకతను ఇలా అరిచాడు: “బోధకుడా, ఒకసారి వచ్చి నా కొడుకును చూడమని వేడుకుంటున్నాను. అతను నా ఒక్కగానొక్క కొడుకు. 39  ఇదిగో! నా కొడుకును ఒక చెడ్డదూత లొంగదీసుకుంటూ ఉంటాడు. దాంతో అతను ఉన్నట్టుండి పెద్దగా కేకలు వేస్తాడు. ఆ చెడ్డదూత అతన్ని గిలగిలా కొట్టుకునేలా చేస్తాడు. అప్పుడు అతని నోటి నుండి నురుగు కారుతుంది. ఆ చెడ్డదూత అతన్ని గాయపర్చి, అతి కష్టం మీద గానీ అతనిలో నుండి బయటికి రాడు. 40  ఆ చెడ్డదూతను వెళ్లగొట్టమని నేను నీ శిష్యుల్ని వేడుకున్నాను, కానీ అది వాళ్ల వల్ల కాలేదు.” 41  అప్పుడు యేసు ఇలా అన్నాడు: “ఓ విశ్వాసంలేని చెడ్డ తరమా, ఎంతకాలం నేను మీతో ఉంటూ మిమ్మల్ని సహించాలి? నీ కొడుకును ఇక్కడికి తీసుకురా.” 42  అతను వస్తున్నప్పుడు కూడా ఆ చెడ్డదూత అతన్ని కిందపడేసి, అతను భయంకరంగా గిలగిలా కొట్టుకునేలా చేశాడు. అయితే యేసు ఆ అపవిత్ర దూతను గద్దించి, ఆ అబ్బాయిని బాగుచేసి, అతన్ని వాళ్ల నాన్నకు అప్పగించాడు. 43  వాళ్లంతా దేవుని గొప్ప శక్తిని చూసి ఎంతో ఆశ్చర్యపోయారు. ఆయన చేస్తున్న వాటన్నిటిని చూసి వాళ్లు అలా ఆశ్చర్యపోతుండగా, ఆయన తన శిష్యులతో ఇలా అన్నాడు: 44  “ఈ మాటలు జాగ్రత్తగా విని గుర్తుపెట్టుకోండి. మానవ కుమారుడు శత్రువుల చేతికి అప్పగించబడబోతున్నాడు.” 45  కానీ ఆయన ఏం చెప్తున్నాడో వాళ్లకు అర్థంకాలేదు. నిజానికి వాళ్లు అర్థం చేసుకోకుండా ఉండేలా అది దాచబడి ఉంది. పైగా ఆ మాట గురించి ప్రశ్నించడానికి వాళ్లకు ధైర్యం చాల్లేదు. 46  తర్వాత, తమలో ఎవరు గొప్ప అనే దాని గురించి వాళ్ల మధ్య గొడవ తలెత్తింది. 47  యేసుకు వాళ్ల హృదయాలోచన తెలుసు కాబట్టి, ఆయన ఒక చిన్న బాబును తీసుకొని, తన పక్కన నిలబెట్టుకొని 48  వాళ్లతో ఇలా అన్నాడు: “నా పేరున ఈ పిల్లవాణ్ణి చేర్చుకునేవాళ్లు నన్ను కూడా చేర్చుకుంటారు. నన్ను చేర్చుకునేవాళ్లు, నన్ను పంపిన దేవుణ్ణి కూడా చేర్చుకుంటారు. మీ అందరిలో ఎవరు తక్కువవాడిలా నడుచుకుంటారో అతనే గొప్పవాడు.” 49  అప్పుడు యోహాను ఇలా అన్నాడు: “బోధకుడా, ఒకతను నీ పేరున చెడ్డదూతల్ని వెళ్లగొడుతుండడం మేము చూశాం. అతను మనలో ఒకడు కాదు కాబట్టి అతన్ని ఆపడానికి ప్రయత్నించాం.” 50  అయితే యేసు అతనితో ఇలా అన్నాడు: “అతన్ని ఆపడానికి ప్రయత్నించొద్దు. మీకు వ్యతిరేకంగా లేని వ్యక్తి మీ వైపే ఉన్నాడు.” 51  ఆయన పరలోకానికి వెళ్లే సమయం దగ్గరపడుతుండగా,* ఆయన యెరూషలేముకు వెళ్లాలని బలంగా నిశ్చయించుకున్నాడు. 52  కాబట్టి ఆయన తనకు ముందుగా కొంతమంది శిష్యుల్ని పంపించాడు. వాళ్లు ఆయన కోసం ఏర్పాట్లు చేయడానికి సమరయుల గ్రామాల్లో ఒకదానికి వెళ్లారు. 53  అయితే, ఆయన యెరూషలేముకు వెళ్లాలని నిశ్చయించుకున్నాడు కాబట్టి అక్కడివాళ్లు ఆయన్ని చేర్చుకోలేదు. 54  ఆయన శిష్యులు యాకోబు, యోహాను అది చూసి ఇలా అన్నారు: “ప్రభువా, వీళ్లను నాశనం చేయడానికి ఆకాశం నుండి అగ్ని రప్పించమంటావా?” 55  కానీ ఆయన వాళ్లవైపు తిరిగి, వాళ్లను గద్దించాడు. 56  అప్పుడు వాళ్లు ఇంకో గ్రామానికి వెళ్లారు. 57  వాళ్లు దారిలో వెళ్తుండగా ఒకతను ఆయనతో, “నువ్వు ఎక్కడికి వెళ్లినా నీ వెంట వస్తాను” అన్నాడు. 58  కానీ యేసు అతనితో ఇలా చెప్పాడు: “నక్కలకు బొరియలు, ఆకాశపక్షులకు గూళ్లు ఉన్నాయి. కానీ మానవ కుమారుడు తల వాల్చడానికి ఎక్కడా స్థలం లేదు.” 59  తర్వాత ఇంకో వ్యక్తితో ఆయన, “నా శిష్యుడివి అవ్వు” అన్నాడు. దానికి అతను, “ప్రభువా, ముందు వెళ్లి నా తండ్రిని పాతిపెట్టడానికి నాకు అనుమతి ఇవ్వు” అన్నాడు. 60  కానీ యేసు అతనితో, “మృతులు తమ మృతుల్ని పాతిపెట్టుకోనివ్వు. నువ్వు వెళ్లి ప్రతీచోట దేవుని రాజ్యం గురించి ప్రకటించు” అన్నాడు. 61  ఆ తర్వాత ఇంకో వ్యక్తి ఇలా అన్నాడు: “ప్రభువా, నేను నీ వెంట వస్తాను. కానీ ముందు మా ఇంట్లోవాళ్లకు వీడ్కోలు చెప్పిరావడానికి అనుమతి ఇవ్వు.” 62  యేసు అతనికి ఇలా చెప్పాడు: “నాగలి మీద చెయ్యి పెట్టి వెనుక ఉన్నవాటి వైపు చూసే వాళ్లెవ్వరూ దేవుని రాజ్యంలో ఉండడానికి తగినవాళ్లు కాదు.”

అధస్సూచీలు

అక్ష., “వెండి.”
అక్ష., “రెండు వస్త్రాల్ని.”
అక్ష., “చతుర్థాధిపతి.”
అంటే, హేరోదు అంతిప. పదకోశం చూడండి.
పదకోశం చూడండి.
అక్ష., “పూర్తికావస్తుండగా.”