అపొస్తలుల కార్యాలు 22:1-30

  • ప్రజల ముందు పౌలు వాదన (1-21)

  • పౌలు తన రోమా పౌరసత్వాన్ని ఉపయోగించడం (22-29)

  • మహాసభ సమావేశమవ్వడం (30)

22  “సహోదరులారా, తండ్రులారా, ఏం జరిగిందో నేను చెప్తాను, వినండి.”+  పౌలు తమతో హీబ్రూ భాషలో మాట్లాడడం విన్నప్పుడు, వాళ్లు ఇంకా నిశ్శబ్దంగా ఉన్నారు. అప్పుడు పౌలు ఇలా అన్నాడు:  “నేనొక యూదుణ్ణి,+ కిలికియలోని తార్సులో+ పుట్టాను. కానీ ఈ నగరంలోనే గమలీయేలు+ పాదాల దగ్గర చదువు నేర్చుకున్నాను. మన పూర్వీకులు పాటించిన ధర్మశాస్త్రాన్ని ఖచ్చితంగా పాటించాలని ఉపదేశం పొందాను.+ ఇప్పుడు మీరంతా చూపిస్తున్నట్టే దేవుని సేవ విషయంలో ఉత్సాహం చూపించాను.+  ప్రభువు మార్గాన్ని అనుసరిస్తున్న పురుషుల్ని, స్త్రీలను బంధించి, చెరసాలల్లో వేయడానికి అప్పగించాను. వాళ్లను హింసించాను, చంపించాను.+  దీని గురించి ప్రధానయాజకుడు, పెద్దల సభలోని వాళ్లంతా సాక్ష్యం చెప్పగలరు. అంతేకాదు, దమస్కులోని తోటి యూదులకు ఇవ్వడానికి వాళ్ల దగ్గర ఉత్తరాలు కూడా తీసుకుని, దమస్కులో ప్రభువు మార్గాన్ని అనుసరిస్తున్నవాళ్లను బంధించి, శిక్షించడానికి వాళ్లను యెరూషలేముకు తీసుకురావాలని అక్కడికి బయల్దేరాను.  “అయితే, నేను ప్రయాణిస్తూ దమస్కు దగ్గరికి వచ్చినప్పుడు మధ్యాహ్న సమయంలో, ఉన్నట్టుండి ఆకాశం నుండి గొప్ప వెలుగు నా చుట్టూ ప్రకాశించింది.+  ఆ వెలుగు వల్ల నేను నేల మీద పడిపోయాను. అప్పుడు ఒక స్వరం, ‘సౌలా, సౌలా, నన్నెందుకు హింసిస్తున్నావు?’ అని నాతో అనడం విన్నాను.  అప్పుడు నేను, ‘ప్రభువా, నువ్వెవరు?’ అని అడిగాను. దానికి ఆయన నాతో, ‘నేను నువ్వు హింసిస్తున్న నజరేయుడైన యేసును’ అన్నాడు.  నాతోపాటు ఉన్నవాళ్లకు ఆ వెలుగు కనిపించింది, కానీ ఆ స్వరం నాతో ఏం చెప్పిందో వాళ్లకు అర్థం కాలేదు.* 10  అప్పుడు నేను, ‘ప్రభువా, నేను ఏమి చేయాలి?’ అని అడిగాను. ప్రభువు నాతో ఇలా అన్నాడు: ‘నువ్వు లేచి దమస్కుకు వెళ్లు. నువ్వు ఏమి చేయాలని నిర్ణయించబడిందో అక్కడ ఒక వ్యక్తి నీకు చెప్తాడు.’+ 11  ఆ వెలుగు చాలా ప్రకాశవంతంగా ఉండడం వల్ల నేను ఏమీ చూడలేకపోయాను. కాబట్టి నాతో ఉన్నవాళ్లు నన్ను చేతులు పట్టుకొని నడిపించుకుంటూ తీసుకెళ్లడంతో దమస్కుకు చేరుకున్నాను. 12  “ధర్మశాస్త్రాన్ని నిష్ఠగా పాటిస్తూ, అక్కడి యూదులందరి మధ్య మంచిపేరు ఉన్న అననీయ అనే వ్యక్తి 13  నా దగ్గరికి వచ్చాడు. అతను నా పక్కన నిలబడి నాతో, ‘సౌలా, సహోదరుడా, మళ్లీ చూపు పొందు!’ అన్నాడు. ఆ క్షణమే నాకు చూపొచ్చింది, దాంతో నేను అతన్ని చూశాను.+ 14  అప్పుడతను ఇలా అన్నాడు: ‘తన ఇష్టాన్ని తెలుసుకోవడానికి, ఆ నీతిమంతుణ్ణి చూడడానికి,+ ఆయన స్వరం వినడానికి మన పూర్వీకుల దేవుడు నిన్ను ఎంచుకున్నాడు. 15  నువ్వు చూసిన వాటన్నిటి గురించి, విన్న వాటన్నిటి గురించి మనుషులందరి ముందు ప్రకటిస్తూ ఆయనకు సాక్షిగా ఉండాలని అలా ఎంచుకున్నాడు.+ 16  ఇంకా ఎందుకు ఆలస్యం చేస్తున్నావు? లేచి బాప్తిస్మం తీసుకో. ఆయన పేరున ప్రార్థించి+ నీ పాపాలు కడిగేసుకో.’+ 17  “తర్వాత నేను యెరూషలేముకు తిరిగెళ్లి+ ఆలయంలో ప్రార్థిస్తున్నప్పుడు నాకు ఒక దర్శనం వచ్చింది.* 18  దానిలో నేను ప్రభువును చూశాను. ఆయన నాతో ఇలా అన్నాడు: ‘నువ్వు వెంటనే లేచి, యెరూషలేము నుండి త్వరగా వెళ్లిపో. ఎందుకంటే నా గురించి నువ్వు ఇచ్చే సాక్ష్యాన్ని వాళ్లు ఒప్పుకోరు.’+ 19  అప్పుడు నేను ఇలా అన్నాను: ‘ప్రభువా, నేను ఒక సమాజమందిరంలో నుండి ఇంకో సమాజమందిరంలోకి వెళ్తూ, నిన్ను విశ్వసిస్తున్నవాళ్లను చెరసాలలో వేయించేవాణ్ణని, కొట్టేవాణ్ణని+ వాళ్లకు బాగా తెలుసు. 20  అంతేకాదు, స్తెఫను అనే నీ సాక్షి చంపబడుతున్నప్పుడు* నేను అక్కడే నిలబడి ఉన్నాను. వాళ్లు చేస్తున్నదాన్ని అంగీకరిస్తూ, అతన్ని చంపుతున్నవాళ్ల పైవస్త్రాలకు కాపలా ఉన్నాను.’+ 21  కానీ ఆయన నాతో, ‘వెళ్లు, నేను నిన్ను దూరంగా ఉన్న అన్యజనుల దగ్గరికి పంపిస్తాను’ అన్నాడు.”+ 22  ఈ మాట వరకు వాళ్లు అతను చెప్పింది వింటూ ఉన్నారు. తర్వాత వాళ్లు బిగ్గరగా ఇలా అరిచారు: “ఇతన్ని భూమ్మీద ఉండకుండా చంపేయండి. ఇతను బ్రతకడానికి అర్హుడు కాడు!” 23  వాళ్లు అరుస్తూ, తమ పైవస్త్రాలు విసిరేస్తూ, గాల్లోకి దుమ్ము ఎత్తి పోస్తూ ఉండడంతో+ 24  పౌలును సైనికుల కోటలోకి తీసుకెళ్లమని సహస్రాధిపతి* ఆజ్ఞాపించాడు. వాళ్లు పౌలుకు వ్యతిరేకంగా ఎందుకలా అరుస్తున్నారో ఖచ్చితంగా తెలుసుకోవడం కోసం అతన్ని కొరడాలతో కొట్టి విచారణ చేయాలని చెప్పాడు. 25  అయితే, పౌలును కొరడాలతో కొట్టడానికి వాళ్లు అతన్ని కట్టేసినప్పుడు, పౌలు అక్కడ నిలబడిన సైనికాధికారిని, “విచారణ చేయకుండానే ఒక రోమీయుణ్ణి* కొరడాలతో కొట్టే హక్కు మీకుందా?”+ అని అడిగాడు. 26  సైనికాధికారి ఆ మాట విన్నప్పుడు సహస్రాధిపతి దగ్గరికి వెళ్లి, “నువ్వు ఏం చేయాలని అనుకుంటున్నావు? ఇతను ఒక రోమీయుడు” అని చెప్పాడు. 27  దాంతో ఆ సహస్రాధిపతి పౌలు దగ్గరికి వచ్చి, “చెప్పు, నువ్వు రోమీయుడివా?” అని అడిగాడు. పౌలు, “అవును” అన్నాడు. 28  అప్పుడు సహస్రాధిపతి, “నేను చాలా డబ్బులు ఇచ్చి రోమా పౌరసత్వ హక్కుల్ని కొనుక్కున్నాను” అన్నాడు. అయితే పౌలు, “నాకు మాత్రం అవి పుట్టుకతోనే వచ్చాయి”+ అని చెప్పాడు. 29  దాంతో, అతన్ని హింసించి విచారణ చేయాలనుకున్న వాళ్లు వెంటనే వెనక్కి తగ్గారు. పౌలు రోమీయుడని, తాను అతన్ని సంకెళ్లతో బంధించానని గ్రహించినప్పుడు ఆ సహస్రాధిపతి భయపడిపోయాడు.+ 30  యూదులు అతన్ని ఎందుకు నిందిస్తున్నారో ఖచ్చితంగా తెలుసుకోవాలని ఆ సహస్రాధిపతి అనుకున్నాడు. కాబట్టి ఆ తర్వాతి రోజు అతను పౌలును విడుదల చేసి, ముఖ్య యాజకుల్ని, మహాసభ వాళ్లందర్నీ సమావేశమవ్వమని ఆజ్ఞాపించాడు. తర్వాత పౌలును అక్కడికి రప్పించి అతన్ని వాళ్ల మధ్య నిలబెట్టించాడు.+

అధస్సూచీలు

లేదా “వాళ్లు వినలేదు.”
లేదా “నేను పరవశుణ్ణి అయ్యాను.”
లేదా “రక్తం చిందించబడుతున్నప్పుడు.”
ఇతని కింద 1,000 మంది సైనికులు ఉండేవాళ్లు.
లేదా “రోమా పౌరుణ్ణి.”