రాజులు రెండో గ్రంథం 11:1-21

  • అతల్యా సింహాసనాన్ని చేజిక్కించుకోవడం (1-3)

  • యెహోయాషును రహస్యంగా రాజును చేయడం (4-12)

  • అతల్యాను చంపడం (13-16)

  • యెహోయాదా తెచ్చిన మార్పులు (17-21)

11  అహజ్యా తల్లియైన అతల్యా+ తన కుమారుడు చనిపోవడం చూసినప్పుడు,+ ఆమె రాజవంశం* మొత్తాన్ని నాశనం చేసింది.+  అయితే, యెహోరాము రాజు కూతురూ అహజ్యా సహోదరీ అయిన యెహోషెబ, అహజ్యా కుమారుడైన యెహోయాషును+ దాచిపెట్టింది. ఆమె చంపబడబోయే రాకుమారుల్లో నుండి అతన్ని రహస్యంగా తీసుకెళ్లి అతన్ని, అతని దాదిని లోపలి పడకగదిలో ఉంచింది. వాళ్లు అతన్ని అతల్యాకు కనబడకుండా ఏదో విధంగా దాచిపెట్టారు కాబట్టి అతను చంపబడలేదు.  అతను ఆరు సంవత్సరాలు యెహోవా మందిరంలో దాచబడి, ఆమె దగ్గర ఉన్నాడు. ఆ సమయంలో అతల్యా దేశాన్ని పరిపాలిస్తూ ఉంది.  ఏడో సంవత్సరంలో యెహోయాదా, రాజ అంగరక్షకుల మీద, రాజభవన కాపలావాళ్ల* మీద ఉన్న శతాధిపతుల్ని*+ రమ్మని కబురు చేశాడు. అతను వాళ్లను యెహోవా మందిరం దగ్గరికి పిలిపించాడు. అతను వాళ్లతో ఒక ఒప్పందం* చేసి, యెహోవా మందిరంలో వాళ్లతో ఒట్టు వేయించి, తర్వాత వాళ్లకు రాకుమారుణ్ణి చూపించాడు.+  యెహోయాదా వాళ్లకు ఇలా ఆజ్ఞాపించాడు: “మీరు ఏమి చేయాలంటే, మీలో మూడోవంతు మంది విశ్రాంతి రోజున పనిలోకి వచ్చి, రాజభవనాన్ని గట్టిగా కాపలా కాయాలి,+  ఇంకో మూడోవంతు మంది పునాది ద్వారం దగ్గర ఉండాలి, మరో మూడోవంతు మంది రాజభవన కాపలాదారుల వెనకున్న ద్వారం దగ్గర ఉండాలి. మీరు వంతులవారీగా మందిరాన్ని కాపలా కాయాలి.  విశ్రాంతి రోజున పనికి వెళ్లాల్సిన అవసరం లేని మీ రెండు విభాగాలవాళ్లు రాజును కాపాడడానికి యెహోవా మందిరాన్ని గట్టిగా కాపలా కాయాలి.  మీలో ప్రతీ ఒక్కరు ఆయుధాలు చేతపట్టుకుని రాజుకు అన్నివైపులా కాపలా కాయాలి. ఎవరైనా సైనిక పంక్తుల్లోకి ప్రవేశిస్తే, వాళ్లను చంపాలి. రాజు ఎక్కడికి వెళ్లినా* మీరు అతని వెంట ఉండాలి.”  ఆ శతాధిపతులు+ యాజకుడైన యెహోయాదా ఆజ్ఞాపించినట్టే చేశారు. వాళ్లలో ప్రతీ ఒక్కరు విశ్రాంతి రోజున పని చేస్తున్న తమ మనుషుల్ని, అలాగే విశ్రాంతి రోజున పనికి వెళ్లాల్సిన అవసరం లేని తమ మనుషుల్ని వెంటబెట్టుకొని యాజకుడైన యెహోయాదా దగ్గరికి వచ్చారు.+ 10  అప్పుడు యాజకుడు, యెహోవా మందిరంలో ఉన్న దావీదు రాజు ఈటెల్ని, గుండ్రటి డాళ్లను శతాధిపతులకు ఇచ్చాడు. 11  రాజభవన కాపలాదారులు+ ఆయుధాలు పట్టుకొని మందిరం కుడివైపు నుండి ఎడమవైపు వరకు, బలిపీఠం+ పక్కన, మందిరం పక్కన, రాజు చుట్టూ తమతమ స్థానాల్లో నిలబడ్డారు. 12  అప్పుడు యెహోయాదా రాజు కుమారుణ్ణి+ బయటికి తీసుకొచ్చి అతని తలమీద కిరీటాన్ని, దేవుని ధర్మశాస్త్ర గ్రంథపు చుట్టను+ పెట్టాడు. వాళ్లు అతన్ని రాజును చేసి అభిషేకించారు. తర్వాత వాళ్లు చప్పట్లు కొడుతూ, “రాజు దీర్ఘకాలం జీవించాలి!” అని అరిచారు.+ 13  ప్రజలు పరుగెత్తుతున్న శబ్దం విన్నప్పుడు, అతల్యా వెంటనే యెహోవా మందిరంలో ఉన్న ప్రజల దగ్గరికి వచ్చింది.+ 14  ఆచారం ప్రకారం రాజు అక్కడ స్తంభం పక్కన నిలబడి ఉండడం ఆమె చూసింది.+ అధిపతులు, బాకాలు ఊదేవాళ్లు+ రాజు పక్కన ఉన్నారు, దేశంలోని ప్రజలందరూ సంతోషిస్తూ బాకాలు ఊదుతున్నారు. అప్పుడు అతల్యా తన బట్టలు చింపుకొని, “కుట్ర! కుట్ర!” అని అరిచింది. 15  అప్పుడు యాజకుడైన యెహోయాదా, సైన్యం మీద నియమించబడిన శతాధిపతులకు+ ఇలా ఆజ్ఞాపించాడు: “పంక్తుల మధ్య నుండి ఆమెను బయటికి తీసుకెళ్లండి, ఎవరైనా ఆమె వెనక వస్తే వాళ్లను కత్తితో చంపండి!” అయితే, “యెహోవా మందిరంలో ఆమెను చంపొద్దు” అని అతను చెప్పాడు. 16  దాంతో వాళ్లు ఆమెను పట్టుకొని, రాజభవనంలోకి+ గుర్రాలు ప్రవేశించే చోటికి తీసుకొచ్చి ఆమెను చంపారు. 17  తర్వాత యెహోయాదా, యెహోవా ప్రజలుగా కొనసాగుతామని యెహోవాకు, రాజుకు, ప్రజలకు మధ్య ఒక ఒప్పందం చేయించాడు.+ అంతేకాదు రాజుకు, ప్రజలకు మధ్య కూడా ఒక ఒప్పందం చేయించాడు.+ 18  తర్వాత ఆ దేశ ప్రజలందరూ బయలు గుడికి వచ్చి దాని బలిపీఠాల్ని పడగొట్టారు,+ దాని విగ్రహాల్ని ముక్కలుముక్కలు చేశారు;+ బయలు పూజారైన మత్తానును బలిపీఠాల ఎదురుగా చంపారు.+ తర్వాత యాజకుడు యెహోవా మందిరం మీద పర్యవేక్షకుల్ని నియమించాడు.+ 19  అంతేకాదు, రాజును యెహోవా మందిరం నుండి తీసుకురావడానికి అతను శతాధిపతుల్ని,+ రాజ అంగరక్షకుల్ని, రాజభవన కాపలాదారుల్ని,+ దేశ ప్రజలందర్నీ పిలిపించాడు. వాళ్లు రాజును రాజభవన కాపలాదారుల ద్వారం గుండా రాజభవనంలోకి తీసుకొచ్చారు, అతను రాజుల సింహాసనం మీద కూర్చున్నాడు.+ 20  అతల్యా, రాజభవనం దగ్గర కత్తితో చంపబడింది కాబట్టి దేశ ప్రజలందరూ సంతోషించారు, నగరం ప్రశాంతంగా ఉంది. 21  యెహోయాషు+ రాజైనప్పుడు అతనికి ఏడేళ్లు.+

అధస్సూచీలు

అక్ష., “రాజ్య విత్తనం.”
అక్ష., “పరుగెత్తేవాళ్ల.”
అంటే, 100 మంది మీద అధిపతులు.
లేదా “సంధి.”
అక్ష., “అతను బయటికి వెళ్లినప్పుడు, అతను లోపలికి వచ్చినప్పుడు.”