రాజులు రెండో గ్రంథం 22:1-20

  • యోషీయా, యూదా రాజు (1, 2)

  • ఆలయాన్ని బాగుచేయడానికి నిర్దేశాలు (3-7)

  • ధర్మశాస్త్ర గ్రంథం దొరకడం (8-13)

  • విపత్తు గురించి హుల్దా ప్రవచించడం (14-20)

22  యోషీయా+ రాజైనప్పుడు అతనికి ఎనిమిదేళ్లు; అతను యెరూషలేములో 31 సంవత్సరాలు పరిపాలించాడు.+ అతని తల్లి పేరు యెదీదా. ఆమె బొస్కతుకు+ చెందిన అదాయా కూతురు.  యోషీయా యెహోవా దృష్టిలో సరైనది చేస్తూ తన పూర్వీకుడైన దావీదు మార్గాలన్నిట్లో నడిచాడు,+ అతను వాటి నుండి కుడివైపుకు గానీ ఎడమవైపుకు గానీ తిరగలేదు.  యోషీయా రాజు తన పరిపాలనలోని 18వ సంవత్సరంలో మెషుల్లాము మనవడూ, అజల్యా కుమారుడూ, కార్యదర్శీ అయిన షాఫానును యెహోవా మందిరానికి పంపిస్తూ+ ఇలా చెప్పాడు:  “నువ్వు ప్రధానయాజకుడైన హిల్కీయా+ దగ్గరికి వెళ్లు; యెహోవా మందిరంలోకి వచ్చే డబ్బంతటినీ,+ అంటే ద్వారపాలకులు ప్రజల దగ్గర సేకరించిన డబ్బంతటినీ పోగుచేయమని చెప్పు.+  వాళ్లు ఆ డబ్బును యెహోవా మందిరంలో జరుగుతున్న పనిని పర్యవేక్షిస్తున్నవాళ్లకు ఇవ్వాలి; వాళ్లు ఆ డబ్బును యెహోవా మందిరాన్ని* బాగుచేసే పనివాళ్లకు ఇస్తారు,+  అంటే నైపుణ్యంగల పనివాళ్లకు, నిర్మాణకులకు, తాపీ పనివాళ్లకు ఇస్తారు; అంతేకాదు ఆ డబ్బుతో మందిరాన్ని బాగుచేయడానికి కావాల్సిన మ్రానుల్ని, చెక్కిన రాళ్లను కొంటారు.+  అయితే వాళ్లకు ఇచ్చిన డబ్బు విషయంలో వాళ్లను లెక్క అడగాల్సిన అవసరం లేదు, వాళ్లు నమ్మకస్థులు.”+  తర్వాత ప్రధానయాజకుడైన హిల్కీయా, “యెహోవా మందిరంలో నాకు ధర్మశాస్త్ర గ్రంథం+ దొరికింది” అని కార్యదర్శి అయిన షాఫానుతో+ అన్నాడు. హిల్కీయా ఆ గ్రంథాన్ని షాఫానుకు ఇచ్చాడు, అతను దాన్ని చదవడం మొదలుపెట్టాడు.+  తర్వాత కార్యదర్శి అయిన షాఫాను, రాజు దగ్గరికి వెళ్లి ఇలా చెప్పాడు: “నీ సేవకులు మందిరంలో ఉన్న డబ్బును సేకరించి* దాన్ని యెహోవా మందిరంలో జరుగుతున్న పనిని పర్యవేక్షించేవాళ్లకు అప్పగించారు.”+ 10  కార్యదర్శి అయిన షాఫాను రాజుతో ఇంకా ఇలా అన్నాడు: “యాజకుడైన హిల్కీయా నాకు ఒక గ్రంథం+ ఇచ్చాడు.” తర్వాత షాఫాను ఆ గ్రంథాన్ని రాజు ముందు చదవడం మొదలుపెట్టాడు. 11  ధర్మశాస్త్ర గ్రంథంలోని మాటలు వినగానే, రాజు తన బట్టలు చింపుకున్నాడు.+ 12  తర్వాత అతను యాజకుడైన హిల్కీయాకు, షాఫాను కుమారుడైన అహీకాముకు,+ మీకాయా కుమారుడైన అక్బోరుకు, కార్యదర్శి అయిన షాఫానుకు, రాజ సేవకుడైన అశాయాకు ఈ ఆజ్ఞ ఇచ్చాడు: 13  “మీరు వెళ్లి, దొరికిన ఈ గ్రంథంలో రాయబడిన వాటిగురించి నా తరఫున, ప్రజల తరఫున, యూదావాళ్లందరి తరఫున యెహోవా దగ్గర విచారణ చేయండి; యెహోవా మనమీద చాలా కోపంగా ఉన్నాడు.+ ఎందుకంటే మన పూర్వీకులు ఈ గ్రంథంలోని మాటలకు లోబడలేదు. మన విషయంలో రాయబడిన వాటన్నిటి ప్రకారం వాళ్లు నడుచుకోలేదు.” 14  అప్పుడు యాజకుడైన హిల్కీయా, అహీకాము, అక్బోరు, షాఫాను, అశాయా కలిసి హుల్దా అనే ప్రవక్త్రి+ దగ్గరికి వెళ్లారు. ఆమె, బట్టల గది మీద అధికారైన షల్లూము భార్య. షల్లూము హర్హషు మనవడు, తిక్వా కుమారుడు. హుల్దా యెరూషలేములోని రెండో భాగంలో నివసిస్తోంది, వాళ్లు అక్కడ ఆమెతో మాట్లాడారు.+ 15  ఆమె వాళ్లతో ఇలా అంది: “ఇశ్రాయేలు దేవుడైన యెహోవా చెప్పేదేమిటంటే, ‘మిమ్మల్ని నా దగ్గరికి పంపించిన వ్యక్తితో ఇలా చెప్పండి: 16  “యెహోవా చెప్పేదేమిటంటే, ‘నేను ఈ స్థలం మీదికి, దాని నివాసుల మీదికి విపత్తు తీసుకొస్తాను, యూదా రాజు ఆ గ్రంథంలో చదివిన మాటలన్నిటినీ+ నేను నెరవేరుస్తాను. 17  వాళ్లు నన్ను విడిచిపెట్టి, వేరే దేవుళ్లకు బలులు అర్పిస్తూ వాటి పొగ పైకిలేచేలా చేస్తూ,+ తమ చేతి పనులన్నిటితో+ నాకు కోపం తెప్పించారు. కాబట్టి ఈ స్థలం మీద నా కోపాగ్ని రగులుకుంటుంది, అది ఆరిపోదు.’ ”+ 18  యెహోవా దగ్గర విచారణ చేయమని మిమ్మల్ని పంపించిన యూదా రాజుకు మీరు ఇలా చెప్పాలి, “నువ్వు విన్న మాటల గురించి ఇశ్రాయేలు దేవుడైన యెహోవా చెప్పేదేమిటంటే: 19  ‘ఈ స్థలం గురించి, దాని నివాసుల గురించి నేను చెప్పిన మాటల్ని విన్నప్పుడు, అంటే వాళ్ల పరిస్థితిని చూసి ప్రజలు భయపడతారని, వాళ్లను శపిస్తారని నేను చెప్పిన మాటల్ని విన్నప్పుడు నీ హృదయం స్పందించింది; యెహోవా ఎదుట నిన్ను నువ్వు తగ్గించుకొని,+ నీ బట్టల్ని చింపుకొని+ నా ఎదుట ఏడ్చావు; కాబట్టి నేను నీ ప్రార్థన విన్నాను అని యెహోవా చెప్తున్నాడు. 20  అందుకే నేను నిన్ను నీ పూర్వీకుల దగ్గరికి చేరుస్తాను,* నువ్వు శాంతిగా సమాధిలోకి చేర్చబడతావు, నేను ఈ స్థలం మీదికి తీసుకొచ్చే విపత్తు అంతటినీ నువ్వు చూడవు.’ ” ’ ” వాళ్లు రాజు దగ్గరికి వచ్చి ఆ మాటలు చెప్పారు.

అధస్సూచీలు

లేదా “మందిరానికి ఉన్న పగుళ్లను.”
అక్ష., “బయటికి కుమ్మరించి.”
మరణాన్ని కావ్యరూపంలో ఇలా వర్ణించారు.